తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలోని తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న కమిషనింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సుమిత్కుమార్, ఆర్ఓ కె.చెన్నయ్య పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.
తణుకులో..
తణుకు: తణుకు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్కుమార్ ఆదివారం పరిశీలించారు. స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఈనెల 6, 7 తేదీల్లో జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి బీవీ రమణ, అధికారులు ఉన్నారు.
ఉద్యోగుల ఓటు హక్కు తిరస్కరించొద్దు
ఉండి: ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోను ఓటు హక్కును తిరస్కరించవద్దని జాయింట్ కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సీవీ ప్రవీణ్ ఆదిత్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు ఫారం–12ను సకాలంలో సమర్పించకపోవడం వల్ల ఓటు వినియోగించుకోలేకపోతున్నారనే విష యం తమ దృష్టికి వచ్చిందన్నారు. స్పాట్లోనే ఫారం–12 స్వీకరించి ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న ఓటరు ఈనెల 1వ తేదీ నాటికి ఫారం–12ను సమర్పించలేకపోతే ఏ ఆర్వో పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో ఆ ఆర్వోకు ఫారం–12 సమర్పించేందుకు, ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని ఆదేశించారు. ఈనెల 7,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. ఉద్యోగులు ప్రత్యేక సెలవును సద్వినియోగం చేసుకుని పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలన్నారు. అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆర్వోలంతా సహకరించాలని కోరారు. ఈసీఐ మార్గదర్శకాలను అనుసరించడంలో తేడాలు వస్తే సంబంధిత ఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
ఏలూరు(మెట్రో)/ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.కృష్ణకాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ అన్నారు. ఆదివారం స్థానిక సీఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణా కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్ పాఠక్ మాట్లాడుతూ నిఘా నేత్రాలతో పరిశీలిస్తూ తప్పిదాలు, ఉల్లంఘనలు సంభవిస్తే వెంటనే ఎన్నికల పరిశీలకులు దృష్టికి తేవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో, పీఓ, ఏపీఓలు నిర్వహిస్తున్న విధులను, ఓటింగ్ తీరును నిశితంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. విధి నిర్వహణలో అనుమానాలు ఉంటే సెల్ 9154690377 నంబర్కు తెలియజేయాలన్నారు.