
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్పై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ నేతలు గవర్నర్ పేరుతో రకరకాల ప్రచారాలకు తెరలేపారు. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చారని, కలవడానికి తమ నేతలు వెళుతున్నారని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్ తమ పార్టీనేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు.
తర్వాత కొద్దిసేపటికి అపాయింట్మెంట్ మరునాటికి మారిందని టీడీపీ వర్గాలు మాట మార్చాయి. వాస్తవానికి శనివారం గవర్నర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్ను కలుస్తున్నట్లు ప్రచారం చేశాయి. కానీ.. అది కూడా జరగలేదు. మరోవైపు ఎల్లో మీడియా ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్ పట్ల గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తనకు తెలియకుండా ఎలా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారానికి దిగాయి.
శనివారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్పై వివరణ ఇవ్వాలని గవర్నర్ సీఐడీ అధికారులను కోరారని, వాళ్లు ఫైళ్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. చివరకు అవన్నీ ఎల్లో మీడియా పుకార్లేనని తేలింది. కోర్టులో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కావాలని రకరకాల ప్రచారాలకు తెరలేపి ప్రజల్లో గందరగోళం సృష్టించారు.