
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. నిన్న (ఏప్రిల్ 6) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు.
తద్వారా గుజరాత్ సన్రైజర్స్ను వారి సొంత ఇలాకాలో (ఉప్పల్ స్టేడియంలో) చిత్తుగా ఓడించింది. ఈ ప్రదర్శనకు గానూ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ (4-0-19-3) సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శనకు కూడా సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు గుజరాత్ ముంబై ఇండియన్స్ను మట్టికరిపించడంలోనూ సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో సిరాజ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, రికెల్టన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు) తీశాడు.
సిరాజ్ వరుసగా మూడు మ్యాచ్ల్లో రెచ్చిపోవడంతో గుజరాత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిన ఈ జట్టు ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. గుజరాత్ ఈ స్థాయిలో సత్తా చాటడంలో సిరాజ్దే ప్రధాన పాత్ర.
సన్రైజర్స్పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ ఇలా అన్నాడు. సొంత మైదానంలో ఆడటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఇవాళ మ్యాచ్లో నా కుటుంబ సభ్యులు జనం మధ్యలో ఉన్నారు. అదే నన్ను పైకి లేపింది. నేను ఏడు సంవత్సరాలు ఆర్సీబీకి ఆడాను. నా బౌలింగ్ను మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాను. అది నాకు ఇప్పుడు పనిచేస్తోంది. ఓ సమయంలో నేను దానిని జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు).
అయినా నిరాశపడకుండా ఫిట్నెస్ మరియు ఆటపై దృష్టి పెట్టాను. నేను చేసిన తప్పులపై వర్కౌట్ చేశాను. ప్రస్తుతం నా బౌలింగ్ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియా తరఫున స్థిరంగా ఆడుతున్నప్పుడు జట్టులో స్థానం కోల్పోవడం నిజంగా బాధించింది. అయినా నన్ను నేను ఉత్సాహపరుచుకున్నాను. ఐపీఎల్ కోసం ఎదురు చూశాను. కసితో వర్కౌట్ చేసి సత్ఫలితాలు సాధిస్తున్నాను.