
హైదరాబాద్: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) కలెక్టర్లతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి.
ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలి. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలి. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించండి. ఎక్కడా తాగు నీటి సమస్య రాకూడదు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.