-
ఏకలవ్యలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
వై.రామవరం: ఏకలవ్య పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏకలవ్య కన్వీనర్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. 2024 మార్చిలో సీబీఎస్ఈ సబ్జెక్టుల్లో 10వ తరగతి, మరియు ఎస్ఎస్సీ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ● వై.రామవరం మండలం పి.ఎర్రగొండ ఏకలవ్య పాఠశాలలో 13 మంది బాలికలకు, మారేడుమిల్లి ఏకలవ్యలో 18 మంది బాలికలకు, 16 మంది బాలురకు, రాజవొమ్మంగి ఏకలవ్యలో 15 మంది బాలికలు, 16 మంది బాలురు, చింతూరు ఏకలవ్యలో 16 మంది బాలికలు, 16మంది బాలురకు, మొత్తం 48 సీట్లు బాలురకు, 62 సీట్లు బాలికలకు ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490876026 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. జి.మాడుగుల: ఏకలవ్య కళాశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పారయ్య సూచించారు. గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంచలేదని ఆయన పేర్కొన్నారు. ఈనెల 25 వరకు గడువు కన్వీనర్ శ్రీపాద రామకృష్ణ -
మన్యంలో భారీ వర్షం
సాక్షి,పాడేరు: మన్యంలో శనివారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతీవ్రత నెలకొన్నప్పటికి మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం చల్లబడింది. ఖరీఫ్ సాగుకు ఎంతో ఉపయోగమని గిరి రైతులు తెలిపారు. ఇప్పటికే వేసవి దుక్కులు, మెట్ట వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అనంతగిరిలో భిన్న వాతావరణం అనంతగిరి: ఒకవైపు ఎండతీవ్రత, మరోవైపు భారీ వర్షంతో శనివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. మండలంలో ఉదయం నుంచి ఎండ ఎక్కువగానే ఉండగా, మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసింది. మూడు రోజులుగా మండలంలో ఇలా విభిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్షాలు పడుతుండడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీలేరులో.. సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు సీలేరులో ఆదివారం మధ్యాహ్నం నుంచి సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలు వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. దారకొండ, దుప్పులవాడ, చల్లనిశిల్ప ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. -
సత్వరంగా నాడు–నేడు పనులు
డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశంచింతపల్లి రూరల్: పాఠశాలల పునః ప్రారంభం నాటికి నాడు– నేడు పనులు పూర్తి చేయాలని డీఈవో బ్రహ్మజీరావు ఆదేశించారు. మండల కేంద్రంలో శనివారం ఆయన ఎంఈవోలు, హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. జూన్ నాటికి పాఠశాలలు ప్రారంభం అవుతాయని అప్పటిలోగా మధ్య దశలో ఉన్న నాడు నేడు పనులను పూర్తి చేయడమే కాకుండా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి,గూడెంకొత్తవీధి మండల విద్యాశాఖ అధికారులు పనసల ప్రసాద్, తగ్గి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ జెన్కో డైరెక్టర్విస్తృత పర్యటన
సీలేరు: ఏపీజెన్కో డైరెక్టర్ ఎంవీ సత్యనారాయణ శనివారం సీలేరు కాంప్లెక్స్లో విస్తృతంగా పర్యటించారు. పంపు స్టోరేజీ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం గుంటవాడ డ్యామ్, సీలేరు జల విద్యుత్ కేంద్రానికి నీరందించే రెగ్యులేటర్ డ్యామ్ గేట్లను పరిశీలించారు. గేట్ల పనితీరుపై ఆయా సివిల్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.అక్కడ నీటి నిల్వలను పరిశీలించారు. గేట్ల నుంచి నీరు లీకేజీ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవర్హౌస్లో నాలుగు యూనిట్ల పనితీరును తెలుసుకున్నారు. ఇటీవల ఒకటో యూనిట్ నిలిచిపోవడానికి కారణాలపై ఆరా తీశారు. చీఫ్ ఇంజనీరు బి.శ్రీధర్, సూపరింటెండెంట్ ఇంజనీరు కె.వి. ప్రశాంత్కుమార్, చంద్రశేఖర్ రెడ్డి (పంపు స్టోరేజి) ఇన్చార్జ్ ఎస్ఈ బాలకృష్ణ ,ఈఈలు ప్రభాకర్,రాజేంద్రప్రసాద్, ఏఈ సురేష్ పాల్గొన్నారు. -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
సాక్షి,పాడేరు: వాసవీమాత జయంతిని శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి వాసవీక్లబ్, వనిత క్లబ్ల ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులంతా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘ ప్రతినిధులు ఉడా త్రినాథరావు, సత్యవరపు సోమరాజు, ఉప్పల వెంకటరత్నం, డి.అప్పలరాజు, వీర్రాజు పాల్గొన్నారు. అలాగే వాసవీ హిల్స్ క్లబ్, వనితా హిల్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో వాసవీమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆర్యవైశ్య మహిళలంతా కుంకుమార్చన నిర్వహించిన ప్రసాదాలు పంచిపెట్టారు. -
ఏలేరు కాలువలో చురుగ్గా పూడిక తీత
నాతవరం: ఏలేరు కాలువలో పూడిక తీత పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే కాలువలో నీటి ప్రవాహం పెరగడంతో పాటు నీటి వృథాకు అడ్డుకట్టపడుతుంది. కాకికాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి 154 కిలోమీటర్ల పొడవున గల ఏలేరు కాలువ ద్వారా ప్రతి రోజు 300 క్యూసెక్కుల చొప్పున విశాఖపట్నానికి నీటిని తరలిస్తున్నారు. దీనిని ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పలు పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. ఈఏడాది కాలువలో పూడిక తొలగింపుతో పాటు పలు చోట్ల మరమర్మతుల కోసం ప్రభుత్వం రూ.4కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను వచ్చే నెలాఖరులోగా లోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏలేశ్వరం రిజర్వాయర్ అధికారులు, విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా గత నెల పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 100 కిలో మీటర్లకు పైగా పూడిక తీశారు. పూడిక తీత పనులతో పాటు ఏలేరు కాలువ గట్లపై ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించి, మరమర్మతులు చేపడుతున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా ప్రతి రోజు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తే పూడిక తీయక ముందు విశాఖపట్నానికి కేవలం 155 నుంచి 160 క్యూసెక్కులు మాత్రమే చేరేది. కాలువలో కొంత భాగంలో పూడిక తొలగించాక ప్రస్తుతం 175 నుంచి 180 క్యూసెక్కుల మధ్య నీటి ప్రవాహం పెరిగింది. వచ్చే నెలాఖరులోగా పనులు పూర్తి పూడిక తీత పనులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. పనుల్లో నాణ్యతాప్రమణాలు పాటిస్తున్నాం. గతంలో అధ్వానంగా ఉండే కాలువ ఇప్పుడు శుభ్రంగా కనిపిస్తోంది. – నానాజీ, జేఈ ఏలేరు కాలువ -
వసూళ్లపై విజిలెన్స్ ఆరా!
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వసూళ్ల పర్వానికి పాల్పడుతున్న వైనంపై విజిలెన్స్ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కాలంగా ఎక్కడెక్కడ ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారో.. దానికి సంబంధించిన వివరాలను విజిలెన్స్ సేకరిస్తోంది. ఉమ్మడి విశాఖలో తరచుగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై ‘సమన్వయ లోపంతో షాక్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్ దృష్టిసారించింది. మరోవైపు కథనంపై ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు స్పందిస్తూ విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సబ్బవరం, ఇతర మండలాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై దృష్టిసారిస్తున్నామని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఎస్ఈ మహేంద్రనాథ్ అన్నారు. రెండు నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన హెల్పర్స్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లడం వల్ల దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయంలో మిగిలిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈ తెలిపారు. అదేవిధంగా కశింకోట డివిజన్ పరిధిలో ప్రతి చోటా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని డివిజన్ ఈఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. వసూళ్లపై దృష్టిసారిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ అధికారులు -
బాలల సంక్షేమానికి కృషి
ఆరిలోవ: బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. పైనాపిల్కాలనీలో జిల్లా మహిళా కేంద్రంలో శనివారం ఆరు జిల్లాల సీ్త్ర సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, జిల్లాల బాలల సంరక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్జేడీ జి.చిన్మయిదేవి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎస్సీపీసీఆర్ చైర్మన్తో పాటు సభ్యుడు గొండు సీతారాం పాల్గొని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతరామరాజు జిల్లాల్లో ఇంతవరకు నమోదైన బాల్య వివాహాలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, గ్రామ స్థాయిలో వాటి నిర్మూలనకు ఏర్పాటు చేసిన కమిటీలు తదితర రికార్డులు పరిశీలించి, చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఽధికారులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. సమీక్షలో ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
మరికొన్ని ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాలలో నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ● సంబల్పూర్–కాచిగూడ(08325) సమ్మర్ స్పెషల్ సంబల్పూర్లో ప్రతీ సోమవారం రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ–సంబల్పూర్(08326) సమ్మర్ స్పెషల్ కాచిగూడలో ప్రతీ మంగళవారాలలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 12.35 గంటలకు బయల్దేరి బుధవారాలలో రాత్రి 11.45 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ● సంబల్పూర్–బెంగళూరు(08321) సమ్మర్ స్పెషల్ ప్రతీ గురువారాలలో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 27వ తేదీ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో బెంగళూరు–సంబల్పూర్(08322) సమ్మర్ స్పెషల్ ప్రతీ శనివారాలలో తెల్లవారు 1.15 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 8.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 29వ తేదీ వరకు నడుస్తాయి. హిరాకుడ్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు అంబాలా డివిజన్, శంభు స్టేషన్ పరిధిలో జరుగుతున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే హిరాకుడ్ ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో బయల్దేరే విశాఖపట్నం–అమృత్సర్ (20807) హిరాకుడ్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో 22వ తేదీన అమృత్సర్లో బయల్దేరే అమృత్సర్–విశాఖపట్నం(20808) హిరాకుడ్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా జఖల్, దూరి, లూధియానాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
గ్రూప్స్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ
ఎంవీపీకాలనీ : ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు సాగే శిక్షణకు 60 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణకు ఎంపికై న అభ్యర్థులకు స్టైఫండ్తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో అందజేయాలన్నారు. వివరాలకు 9492569177 నంబర్లో సంప్రదించాలన్నారు. -
● తారబు సోయగం
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులోని ప్రకృతి అందాల మధ్య తారబు జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాల నురగలను తలపిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అందాలను తిలకించేందుకు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, జైపూర్, ఒడిశా నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతంలో స్నానాలు చేస్తూ వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. – ముంచంగిపుట్టు -
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల దుర్వినియోగం
రంపచోడవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కమిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎంపీపీ బందం శ్రీదేవి ఆరోపించారు. శుక్రవారం ఆమె మండలంలోని సీతపల్లి, వాడపల్లి, పెదగెద్దాడ, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేవారు. దీనిలో భాగంగా ఆమె రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యుల అనుమతి లేకుండా హెచ్డీఎస్ నిధులను వైద్యాధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారని తెలిపారు. నిధుల ఖర్చుకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్, క్యాష్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు ఏమీ లేవన్నారు. సకాలంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించలేదన్నారు. నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ విజయ సునీత, రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరేకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పెదగెద్దాడ పీహెచ్సీలో రోగులకు సరిగ్గా వైద్య సేవలు అందడం లేదని ఆమె ఆరోపించారు. సర్పంచ్ వడల ప్రసాద్తో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. సమాచార బోర్డుల్లో ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి సంబంధించిన వివరాలు లేవన్నారు. ఎంపీటీసీలు కుంజం వంశీ, బచ్చల మంగయ్యమ్మ పాల్గొన్నారు. వైద్యాధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి -
ఉత్సవాలు విజయవంతం చేయాలి
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి ఉత్సవాలను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.విజయసునీత కోరారు. ఇందుకు సంబంధించి అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 9,10,11తేదీల్లో నిర్వహించే ఉత్పవాల్లో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాల మూడు రోజులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, 24గంటల పాటు వైద్యబృందాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని,ప్రైవేట్ జీపులకు సంబంధించి ఓవర్లోడ్ ఉండకూడదన్నారు. రెండు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్సిన్హా, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్కలెక్టర్ ధాత్రిరెడ్డి, పాడేరు ఏఎస్పీ ధీరజ్, డీఆర్వో పద్మావతి, ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొట్టగుళ్లి రామారావు, వెంకటరమణ,యాదగిరి శ్రీను పాల్గొన్నారు. -
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం సందర్శన
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం ఏపీజెన్కో డైరెక్టర్ ఎంవీవీ సత్యనారాయణ సందర్శించారు. వించ్ మార్గంలో విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు నిర్వహిస్తున్న జనరేటర్ల సామర్థ్య పరీక్షలను ఆయన పరిశీలించారు. జనరేటర్ల ఉత్పత్తి, వినియోగం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కంట్రోల్ రూంలో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. అనంతరం సీలేరు కాంప్లెక్స్కు నీటిని అందించే జోలాపుట్టు జలాశయాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీలేరు కాంప్లెక్స్ సీఈ బొడ్డుశ్రీధర్, ఎస్ఈ సివిల్ కేకేవీ ప్రశాంత్కిశోర్, ఎస్ఈ హెచ్పీసీ స్వామినాయుడు, ఎస్ఈ విద్యుత్సౌధ చంద్రశేఖర్రెడ్డి, మాచ్ఖండ్ ఎస్ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఈఈ జనరేషన్ బి.గోవిందరాజులు పాల్గొన్నారు.జనరేటర్లను పరిశీలించిన ఏపీ జెన్కో డైరెక్టర్ సత్యనారాయణ -
చివరి దశకు జీడిపిక్కల వ్యాపారం
సాక్షి,పాడేరు: జీడిపిక్కల వ్యాపారం చివరిదశకు చేరుకుంది. ఒడిశా వ్యాపారులు గిరి రైతుల నుంచి పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 58,460 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుండగా ఎకరాకు 300 కిలోల వరకు దిగుబడి వస్తుండగా రూ.30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దిగుబడి తగ్గినపపటికీ సీజన్ ప్రారంభంలో గిట్టుబాటు ధర లేక రైతులు నిరాశకు గురయ్యారు. ఈ సీజన్లో కిలో రూ.80 నుంచి రూ.100 లోపే విక్రయాలు జరిగాయి. కొయ్యూరు, రాజవొమ్మంగి ప్రాంతాల్లో సీజన్ ప్రారంభం నుంచి కిలో రూ.90లోపే వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంత రైతులు ఆదాయం కోల్పోయారు. పాడేరు మండలం వంట్లమామిడి, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మాత్రం కిలో రూ.100కు కొనుగోలు చేయడం రైతులకు ఊరటనిచ్చింది. ఒడిశాకు సరిహద్దులో ఉన్న డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, మోతుగూడెం, ధారకొండ ప్రాంతాల్లో ఒడిశా వ్యాపారులు కిలో రూ.100 నుంచి రూ.110కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. పోటీపడి కొనుగోలు చేస్తున్న ఒడిశా వ్యాపారులు కిలోకు రూ.100కు పైగా ధర చెల్లింపుసీజన్ ప్రారంభంలో నష్టం జీడిపిక్కల సీజన్ ప్రారంభంలో విక్రయించడం వల్ల నష్టపోయాను. కిలో రూ.84కు విక్రయించా. ఇప్పుడు రూ.100కు పైగా ధర ఉంది. ఇప్పుడు విక్రయించిన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. – డి.కనకరాజు, జీడిరైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం -
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
జిల్లా అధికారి ప్రసాదరావు ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నట్టు జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని కరిముఖిపుట్టు పంచాయతీ తాంగుల గ్రామంలో మలేరియా నివారణ మందు పిచికారీ పనులను పరిశీలించారు. పిచికారీకి సిద్ధం చేసిన మలేరియా నివారణ మందు మోతాదు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని గిరిజనులతో మాట్లాడారు. వీధుల్లో మురుగు, చెత్ల నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. ఇంటి బయట, లోపల మందును పిచికారీ చేయించుకోవాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దోమల నివారణ మందు తొలివిడత పిచికారీ చురుగ్గా జరుగుతోందన్నారు. మండలంలో 128 గ్రామాల్లో తొలివిడత పిచికారీ జరుగుతోందన్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శేషయ్య, మండల మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేశ్వరరావు, ఎంపీహెచ్ఈవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జిల్లా ఎన్నికల అధికారి విజయ సునీత ఆదేశం సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాడేరు, అరకులోయ స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ తుహిన్సిన్హా, అరకు ఆర్వో వి.అభిషేక్, సబ్కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఏఎస్పీ ధీరజ్తో కలిసి తనిఖీ చేశారు. భద్రత చర్యలను పరిశీలించారు. అనంతరం వచ్చే నెల నాల్గో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునుకు సంబంధించిన గదులను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లోపూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని, అభ్యర్థులు, ఏజెంట్ల పరిశీలనకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. బారికేడ్లు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత సిబ్బంది నిరంతరం అప్రమ్తతంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్ఎం రాజు,డీఈఈ అనుదీప్,పాడేరు సీఐ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
పూర్తిస్థాయిలో వైద్యసేవలు
● రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ● ఐసీయూ యూనిట్ ప్రారంభం రంపచోడవరం: రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) విభాగం అందుబాటులోకి వచ్చిందని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్గనోరే తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగాన్ని సూపరింటెండెంట్ డా. కె.లక్ష్మితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ప్రమాదాలకు గురైనవారితో పాటు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా సీరియస్ కేసులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులకు ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేసి వారికి ఆహారం అందజేస్తున్నామని పీవో తెలిపారు. -
ప్రశాంతంగా కౌన్సెలింగ్
కొమ్మాది (విశాఖ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఆధ్వర్యంలో నడుస్తున్న డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్. రూపావతి తెలిపారు. మొత్తం ఏడు గురుకుల బాలికల కళాశాలలు కలిపి అన్ని గ్రూపుల నుంచి 188 ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ అయినట్లు తెలిపారు. -
అందుబాటులో అత్యవసర వైద్యం
ఒకప్పుడు రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక వసతులతో అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చింది. గత మూడేళ్లుగా మెరుగైన వైద్యసేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రి 11 మండలాల ప్రజలకు పెద్దదిక్కుగా మారింది. ఇక్కడి ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి డా. కె లక్ష్మి ప్రత్యేకదృష్టి సారించి వైద్యులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. గతంలో అత్యవసర వైద్యం కోసం వచ్చే కేసులను రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేసేవారు. ఈ పరిస్థితుల్లో అంచెలంచెలుగా అత్యాధునిక వైద్యసేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఐసీయూ విభాగం ఏర్పాటు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఐసీయూ విభాగం ఏర్పాటు చేయడంతో అత్యవసర కేసులకు ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. ఐసీయూ విభాగంలో వెంటిలేటర్ అందుబాటులో ఉంది. అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నప్పుడు కృత్రిమ శ్వాస అందించివచ్చని వైద్యులు తెలిపారు. కేవలం కార్పొరేట్ ఆస్పత్రిల్లో మాత్రమే ఉండే ఈ సదుపాయం వల్ల రోగుల బంధువులకు అవస్థలు తప్పినట్టే. గతంలో అత్యవసర వైద్యం అందించాలంటే రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్కు తరలించేందుకు సుమారు గంటకు పైగా సమయం పట్టేది. వైద్యం అందించాల్సిన కీలకమైన సమయం రోగిని తరలించేందుకే సరిపోయేది. ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్యంలో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరిచింది. కొత్త పీహెచ్సీల ఏర్పాటుతో పాటు ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేసింది. ● ఒకప్పుడు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఒక్క ప్రత్యేక వైద్య నిపుణుడు కూడా లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ప్రస్తుతం ఉన్న 16 మంది వైద్యుల్లో 12 మంది నిపుణులు ఉన్నారు. వీరిలో గైనిక్, ఆర్దోపెడిక్, ఈఎన్టీ, కంటి వైద్య శస్త్ర చికిత్స నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు ఉన్నారు. శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చాయి. 11 మండలాలకు పెద్దదిక్కుగా రంపచోడవరం ఏరియా ఆస్పత్రి పూర్తిస్థాయిలో వైద్యనిపుణులు రోగులకు అన్నిరకాల వైద్యసేవలు పూర్తిగా తగ్గిన రిఫర్ కేసుల సంఖ్య తాజా ఐసీయూ విభాగం ఏర్పాటు దశలవారీగా సౌకర్యాలు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో దశలవారీగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒకప్పుడు రిఫర్ చేసే పరిస్థితి ఉండేది.ఇప్పుడు ఇక్కడే కీలకమైన సర్జరీలు జరుగుతున్నాయి. ఐసీయూ విభాగం అందుబాటులోకి వచ్చింది. వివిధ పరీక్షలకు సంబంధించి అత్యాధునిక ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. – కె లక్ష్మి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి రంపచోడవరం వైద్య సేవలు చాలా బాగున్నాయి రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు చాలా బాగున్నాయి. ప్రసూతి సేవలు కోసం ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు. సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఇలాంటి సేవలు అందడం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – పద్మ, తాటివాడ, రంపచోడవరం మండలం -
ఇంటర్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ విద్య: ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ జైల్ రోడ్లో నిర్వహించే బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థునులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జే. విజయ తెలిపారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీతో పాటు ఒకేషనల్ కోర్సులను ఇంగ్లిషు, తెలుగు మీడియంలో బోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థినులు వెంటనే కాలేజీలో సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడి వారైనా కాలేజీలో చేరవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు
గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలం అసరాడ తోటమామిడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి నుంచి కొయ్యూరు వెళ్తున్న మొట్టడం జీవన్ , పాంగి దారబాబులు పెదవలస నుంచి చింతపల్లి వస్తున్న పాంగి చిరంజీవి, రాశికుమారి, అన్నపూర్ణలు ద్విచక్రవాహనాల్లో వస్తుండగా ఇరువురి వాహనాలు ఎదురెదురుగా వచ్చి అదుపుతప్పడంతో అసరాడ సమీపంలోని ప్రధాన రహదారిపై ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం పాడేరు, నర్సీపట్నం ఆసుపత్రులకు రిఫర్ చేశారు. -
మరికొన్నిసమ్మర్ స్పెషల్స్
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని వన్వే సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్–సోలాపూర్(01452) వన్ వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 11.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.45 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 7 గంటలకు సోలాపూర్ వెళ్తుంది. భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి (01056) వన్వే సమ్మర్ స్పెషల్ ఈ నెల 20 సోమవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.53 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబయి వెళ్తుంది. -
ఘనంగా క్షీరాభిషేకం
డాబాగార్డెన్స్ (విశాఖ) : బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం క్షీరాభిషేక సేవ నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.500 చెల్లించిన యెడల పూజకు దంపతులు లేదా ఇద్దరిని అనుమతించనున్నట్టు చెప్పారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు 0891–2566514, 2711725 నంబర్లలో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి, ఏఈవోలు కె. తిరుమలేశ్వరరావు, వెంపలి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కనకమహాలక్ష్మికి సహస్ర తులసీదళార్చన.. కనకమహాలక్ష్మి దేవాలయంలో శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సహస్ర తులసిపూజ నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,500 పూజా రుసుం చెల్లించి పాల్గొనవచ్చు. భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్కొత్తరోడ్డు శాఖ, అకౌంట్ నంబరు 060810011006691, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0806091లో చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన భక్తులు వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా 8985515989 నంబరుకు వాట్సప్ చేయాలి. -
మరికొన్ని రైళ్ల రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: పెయిరింగ్ రైళ్లు ఆలస్యం కారణంగా ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరులో శుక్రవారం ఉద యం 10.15 గంటలకు బయలుదేరాల్సిన వీటీ బెంగళూరు–అగర్తలా(12503)హమ్సఫర్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–ఎస్ఎంవీ బెంగళూరు (08845) రాత్రి 12.30 గంటలకు బయలుదేరింది. ● శుక్రవారం ఉదయం 5.45గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన విశాఖ– సికింద్రాబాద్(20833) వందేభారత్ సుమారు 3 గంటలు ఆలస్యంగా 8.45 గంటలకు బయలుదేరింది. సికింద్రాబాద్లో మధ్యా హ్నం 3 గంలకు బయలుదేరాల్సిన సికింద్రాబాద్–విశాఖ(20834) 2.15 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి– ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22807)ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా రాత్రి 11.55 గంటలకు బయలుదేరింది. ● సంత్రగచ్చిలో శుక్రవారం రాత్రి 11.40 గంటలకు బయలుదేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06090) స్పెషల్ సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా శనివారం తెల్లవారు 4 గంటలకు బయలుదేరింది. ● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– హౌరా (12840) సూపర్ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్ సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement