-
బాధ్యతల స్వీకరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యూకేషన్ (ఎస్డీఎల్సీఈ) సైన్స్ కోర్సుల డైరెక్టర్గా మైక్రోబయాలజీ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటగోపినాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆబాధ్యతలు నిర్వర్తించిన బాటనీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ కరుణాకర్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ఆచార్య రాంచంద్రం, రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి, డాక్టర్ వల్లాల జగన్, కుక్టా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్, కాంట్రాక్టు అధ్యాపకులు సంకినేని వెంకట్, సూర్యం, శ్రీధర్, విద్యాసాగర్, సత్యనారాయణ, గడ్డం కృష్ణ, రాజునాయక్, తదితరులు అభినందించారు. ఆల్మాల స్టూడెంట్స్ అసోసియేషన్ కేయూ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, దూరవిద్యాకేంద్రం ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎఫ్రిమ్రాజు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇంటర్లో ప్రవేశాలకు 23న కౌన్సెలింగ్
ఏటూరునాగారం: జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ రీజియన్లలోని గిరిజన గురుకుల కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజున ఏటూరునాగారం స్పోర్ట్స్ కళాశాలలో బాలురులకు, ఈనెల 25న బాలికలకు ఏటూరునాగారం మండల కేంద్రంలోని బాలికల కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కాటారం కళాశాల ఎంపీసీ, బైపీసీ, ఏటూరునాగా రం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఏటీ, ము లుగు ఎంపీసీ, బైపీసీ, దామరవంచ ఎంపీసీ, బైపీసీ, మహబూబాబాద్ ఎంపీసీ, బైపీసీ, మరిపెడ ఎ ంపీసీ, బైపీసీ, రెండ్యాల సీఈసీ, హెచ్ఈసీల్లో బాలురకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే బాలికలకు కాటారం కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, పీటీ, ఏటూరునాగారం ఎంపీసీ, బై పీసీ, సీఈసీ, ఏ టీ, ఐఎం, వెంకటాపురం(కె) ఎంపీసీ, బైపీసీ, కొత్తగూడ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, కేసముద్రం సీఈసీ, హెచ్ఈసీ, మహబూబాబాద్ ఎంపీసీ, బైపీసీ కో ర్సులకు అవకాశం ఉందని తెలిపా రు. ప్రతి గ్రూపులో ఎస్టీ విద్యార్థులతోపాటు ఎస్సీ, బీసీ, ఓసీలకు ఒ క్కో సీటు ఉంటుందని, ఆర్ఫన్(అ నాథ)లకు, స్పో ర్ట్స్ కోట కింద, దివ్యాంగులకు ఒ క్కో సీటు ఉంటు ందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు టెన్త్ మెమో, టీసీ, స్టడీ, కులం, ఆదాయం, ని వాసం సర్టిఫికెట్స్(ఒరిజినల్స్)తోపాటు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు రెండు సె ట్స్ జిరాక్స్లతో కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు
శాయంపేట: జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ నలుగురిని అరెస్టు చేసి, ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకున్నట్లు అదుపులోకి తీసుకున్నట్లు పరకాల ఏసీపీ కిశోర్కుమార్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని వసంతాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర సాయిచరణ్ హైదరాబాద్లోని బోడుప్పల్లో నివసిస్తున్నాడు. అక్కడ భూక్య అజాద్తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి సినిమాలు, షికార్లకు వెళ్తూ జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. జల్సాలకు డబ్బులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్ల ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలించి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని వసంతాపూర్ గ్రామంలో ఉన్న అవినాష్, హరికృష్ణకు అప్పగించి వారితో వాహనాలు అమ్మించి డబ్బులను వాడుకునేవారు. బోడుప్పల్ ప్రాంతం నుంచి స్కూటీ, హోండా షైన్, పల్సర్ బైక్లను చోరీ చేయగా శాయంపేటలో ఒక స్కూటీని దొంగతనం చేసి అప్పగించినట్లు తెలిపారు. నెలలో నాలుగు బైకులు చోరీ చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను ఎస్సై ప్రమోద్కుమార్, పోలీస్ కానిస్టేబుల్ సాధన్, ఖలీల్, హెచ్జీ నరేష్ చాకచక్యంగా పట్టుకున్నారు. బోడుప్పల్కు చెందిన ముక్కెర జాన్ విల్సన్ అలియాస్ సాయిచరణ్ అలియాస్ లడ్డు, భూక్య ఆజాద్ అలియాస్ అజ్జి, వసంతాపూర్కు చెందిన ముక్కెర అవినాష్, మేకల హరికృష్ణలను శుక్రవారం అరెస్టు చేసి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు కిశోర్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో శాయంపేట సీఐ రంజిత్రావు, ఎస్సై ప్రమోద్కుమార్, సిబ్బంది ఉన్నారు. 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
రాయపూర్ ఎక్స్ప్రెస్లో స్పెషల్ డ్రైవ్
● చైల్డ్లైన్కు బాలల అప్పగింతకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాయపూర్ నుంచి సికింద్రాబాద్ (12772) వెళ్లే ఎక్స్ప్రెస్లో స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ ఎం.సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపూర్ ఎక్స్ప్రెస్లో బల్లార్షా నుంచి కాజీపేట వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో అనుమానాస్పదంగా కనిపించిన 14ఏళ్ల బాలలను తరలిస్తున్న నలుగురు ట్రాఫికర్స్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని విచారించగా పిల్లలను హైదరాబాద్లో పని నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తేలిందని తెలిపారు. 1098 చైల్డ్ లైన్ బాధ్యులను పిలిపించి ఆరుగురు బాలలను అప్పగించి, బాలలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారికి చట్టప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. -
కేయూ లా కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్గా, బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్గా, లా డీన్గా, యూనివర్సిటీలో లీగల్సెల్ అండ్ ఇన్చార్జ్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ తన పదవులకు రాజీనామా చేశారు. యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్, బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేస్తూ మూడు రోజుల క్రితం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డికి రాజీనామా లేఖను అందించారు. హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్ శ్రీనివాస్తోపాటు అసోసియేట్ ప్రొఫెసర్ పద్మజారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదర్శన్ ఉన్నారు. ఒక్క శ్రీనివాస్కే నాలుగు కీలకమైన పదవులతో కూడిన బాధ్యతలు ఉండటంతో తనకు పనిభారం పెరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వ్యక్తిగతంగా సమస్యలున్నాయని తెలిపారు. రెండు పదవులను మిగితా ఇద్దరు అధ్యాపకులకు కేటాయించాలని వీసీ రమేశ్ను కోరారు. అయినా శ్రీనివాస్నే కొనసాగిస్తుండటంతో తాను యూనివర్సిటీ లా డీన్, యూనివర్సిటీ లీగల సెల్ ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతానని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. -
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
ఎస్ఎస్తాడ్వాయి: అంగన్వాడీ టీచర్ సుజాత హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవీందర్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్టేషన్లో పస్రా సీఐ శంకర్తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్లో అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన సుజాత ఈనెల 14న విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరింది. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు వెళ్లిపోవడంతో ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య బైక్పై కాటాపూర్లోని బస్టాండ్ వద్ద లిప్ట్ అడిగి ఎక్కింది. అంతకు ముందుగానే రామయ్య వెంట వచ్చిన రోయూరు గ్రామానికి చెందిన పగిడి జంపయ్యతో కలిసి ఆమెను అడవిలోకి తీసుకెళ్లి హత్యాచారం చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నం చేయగా మృతురాలు ప్రతిఘటించడంతో తలపై బండారాయితో కొట్టి, గొంతు నొక్కి, స్కార్ప్తో మెడకు ఉరిబిగించి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్పై వెళ్తున్న రామయ్య, జంపయ్యను పట్టుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు ఉపయోగించిన బైక్, బంగారు గొలుసు, పుస్తెలు, హ్యాండ్ బ్యాగ్, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్ చేసినట్లు తెలిపారు. హత్య కేసును త్వరగా చేధించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి, ఏఎస్సై నారాయణ, హెడ్ కానిస్టేబుల్ అనుమాండ్ల కిషన్, కానిస్టేబుళ్లు పూజారి రమేశ్, జాజ సాంబయ్య, అప్పాల రమేశ్, రాజీవ్, రాజేశ్లను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
రంగస్థలనాటక కార్యక్రమాలకు అనుగుణంగా కళాక్షేత్రం
హన్మకొండ కల్చరల్ : ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని రంగస్థలనాటక కార్యక్రమాలకు అనుగుణంగా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని కోరారు. ఈసందర్భంగా రంగస్థల నాటక కార్యక్రమాలకు వేదికగా ఉండేందుకు కర్టెన్స్, లైటింగ్, సౌండ్ సిస్టిమ్స్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ కాకతీయ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు రాధారపు సంజీవరెడ్డి, జిల్లా రంగస్థల నాటక కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, ఓడపల్లి చక్రపాణి, గూడూరు బాలాజీ, జూలూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ హామీ నెరవేర్చకుంటే ఉద్యమిస్తాం..
హన్మకొండ: ముదిరాజ్లకు ఇచ్చిన మాట ప్రకారం ఈ స్థానిక ఎన్నికలలోపే రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే ఐక్య ఉద్యమాలు చేస్తామని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ – తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బొట్లపల్లి సంజీవన్ కుమార్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బోయిని జగన్మోహన్ ముదిరాజ్ అన్నారు. హనుమకొండలోని అసోసియేషన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీసీ కుల గణనను ఈ స్థానిక ఎన్నికలలోపే చేయాలని, అప్పుడే బీసీలలో అధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్లకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికే సుప్రీంకోర్టు ఇచ్చిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు నీరటి రాజు, సింగారపు రామకృష్ణ, దండు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చోరీ
రామన్నపేట : వరంగల్ నగరంలోని ఎస్వీఎన్ రోడ్డులోని ఇండస్ట్రీయల్ ఏరియాలో గోపి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో చోరీ జరిగినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి శుక్రవారం తెలిపారు. బాధితుడు గునిశెట్టి రాజేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇండస్ట్రీయల్ ఏరియాలో గత పది సంవత్సరాల నుంచి గోపి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ పేరుతో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్స్ ప్రొడక్షన్, లంబాడ గాజులు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఉదయం 5.30గంటలకు షాప్ పక్కన ఉన్న రెడీమేడ్ డ్రెస్ తయారీ ఇండస్ట్రీ యజమాని శ్రీనివాస్ మీ షటర్లో శబ్దం వస్తుందని ఫోన్ చేయగా వెళ్లిచూసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు షాప్ వెనకాల కిటీకీ పగులగొట్టి షాప్లోకి చొరబడినట్లు గుర్తించారు. షాప్లోకి వెళ్లి పరిశీలించగా.. సుమారు 1.30లక్షల విలువ గల పలు మౌల్డ్లు, మౌల్డింగ్ మిషన్ మోటర్, కంప్రెషన్ మోటర్ అపహరణకు గురయ్యాయని గుర్తించినట్లు తెలిపారు. గునిశెట్టి రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
టేకుమట్ల: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి శివారు ఇటుక బట్టీల వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మలయదరువా(19) బతుకు దెరువు కోసం ఫిబ్రవరిలో బూర్నపల్లి శివారులోని ఇటుక బట్టీలలో పనికి చేరాడు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురుస్తున్న సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బాబాయ్ పద్మన్దరువా ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి .. భూపాలపల్లి రూరల్: వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన భూపాలపల్లి పట్టణకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓరుగంటి వీరయ్య(55) గురువారం వృత్తిలో భాగంగా లక్ష్మీనగర్లో ఇసీ్త్ర చేస్తుండగా.. అస్వస్తతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు భూపాలపల్లి ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ వీరయ్య గురువారం రాత్రి మృతి చెందాడు. వీరయ్యకు భార్య వణమ్మ ,ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రజక సంఘం పట్టణ అధ్యక్షుడు వైనల శోభన్, నాయకులు ఓరుగంటి లక్ష్మి, రాములు, వీరస్వామి, రాజయ్య, రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైలునుంచి జారిపడి యువకుడు.. గూడూరు: మానుకోట జిల్లా గూడూరు శివారు కలకత్త తండాకు చెందిన వాంకుడోతు దేవేందర్, నీలా దంపతుల కుమారుడు వాంకుడోతు విక్రమ్ (18) ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటర్ పూర్తి చేశాడు. గురువారం వరంగల్కు వచ్చిన విక్రమ్.. రాత్రి సమయంలో రైలులో ఖమ్మం బయల్దేరాడు. ఈక్రమంలో విక్రమ్ నిద్రమత్తులో ఉండగా.. ట్రెయిన్ ఖమ్మం దాటి మధిర చేరుకుంది.. గుర్తించిన విక్రమ్ ట్రెయిన్ నెమ్మది వెళ్తుండగా.. దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు జారి రైలు కిందపడగా అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. శుక్రవారం విక్రమ్ మృతిచెందినట్లు రైల్వే పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువుల రోదనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాజీపేట జంక్షన్ జలమయం ● ప్లాట్ఫాంలోకి చేరిన వర్షపు నీరుకాజీపేట రూరల్: గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాజీపేట జంక్షన్ జలమయమైంది. రైల్వే స్టేషన్ ముందున్న సర్క్యూలేటింగ్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున వర్షం నీరు కాజీపేట రైల్వే స్టేషన్లోకి ప్రవేశించింది. దీంతో టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు, రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్తోపాటు ప్లాట్ఫాంలోకి వర్షం నీరు చేరడంతో రైలు పట్టాల వరకు జలమయమైంది. రైల్వే స్టేషన్లోకి వర్షం నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు రైల్వే సిబ్బంది వర్షం నీటిని బయటికి పంపించారు. కాగా, ఉత్తర దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్లో వర్షం పడినప్పుడల్లా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం నీరు వెంటనే బయటికి వెళ్లేందుకు రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీదే విజయం
హన్మకొండ/దేశాయిపేట: నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీజేపీదే విజయమని కామారెడ్డి ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. పట్టభద్రులు తమ బంగారు భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యావంతులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. దీనికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నాంది పలుకాలని పేర్కొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే పదేళ్లలో కేంద్రం ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాలన్నారు. ఇదిలాఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి హనుమకొండకు వచ్చిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ నాయకులు సన్మానించారు. సమావేశంలో వరంగల్ పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, వరంగల్, ములుగు జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, బలరాం, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, ప్రదీప్ రావు, సరోత్తంరెడ్డి, విజయ్చందర్రెడ్డి, సంతోష్రెడ్డి, జితేందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు దేశాయిపేట రోడ్డులోని వరంగల్ తూర్పు బీపేజీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి -
వీసీ నియామకం జరిగేనా..?
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పది యూనివర్సిటీలకు త్వరలో వీసీలను నియమిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. యూనివర్సిటీల్లో నూతన వీసీల నియామకానికి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా అనుమతి లభించింది. దీంతో ప్రభుత్వం వీసీల నియామకానికి ఉపక్రమించబోతుంది. ఈక్రమంలో 8యూనివర్సిటీలకు సెర్చ్కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. కానీ, కాకతీయ యూనివర్సిటీకి సెర్చ్కమిటీని ఏర్పాటు చేయలేదని సమచారం. కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ పదవీకాలం ఈనెల 21న ముగియనుంది. ఈనేపథ్యంలో మిగితా యూనివర్సిటీలతోపాటే కేయూకు కొత్త వీసీని నియమిస్తారని అంతాభావించారు. కానీ, సెర్చ్కమిటీ ఏర్పాటు కాకపోవటంతో ఇప్పట్లో కేయూకు కొత్త వీసీ నియామకం జరగకపోవచ్చనే అనుమానం కలుగుతోంది. పాలకమండలి లేకపోవటమే కారణమా..? కేయూకు గత సంవత్సరం అక్టోబర్లో పూర్తిస్థాయి పాలకమండలి సభ్యుల పదవీ కాలం ముగిసి, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. యూనివర్సిటీ పాలకమంలి సమావేశాన్ని ఈఏడా ది ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించారు. ఈసమావేశంలో కేయూ వీసీ నియామకానికి సెర్చ్కమిటీకి యూనివర్సిటీ నామి నీని సూచించారు. అయినప్పటికీ పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడం వల్లనే సెర్చ్కమిటీ నియామకం చేపట్టలేదనే చర్చజరుగుతుంది. పాలకమండలి ఏర్పాటయ్యాకే ఈ విషయంలో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. వీసీల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వీసీల నియామకానికి ప్రభుత్వం ఈఏడాది జనవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించిన విషయం విధితమే. పది సంవత్సరాలపాటు ప్రొఫెసర్లుగా అనుభవం కలిగినవారు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి 149 దరఖాస్తులు వచ్చాయని సమాచారం. 312మంది (ప్రసుత్తం పనిచేస్తున్న, రిటైర్డ్ ప్రొఫెసర్లు కలిపి) నుంచి 1,382 దరఖాస్తులు అందాయి. ఒక ప్రొఫెసర్ రెండు నుంచి నాలుగైదు యూనివర్సిటీలకు కూడా దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. మార్చిలోనే ఆయా దరఖాస్తుల స్క్రూటిని పూర్తయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలతో నియామక ప్రక్రియకు బ్రేక్పడింది. సెర్చ్కమిటీలో ముగ్గురు వీసీల నియామక ప్రక్రియ చేపట్టేందుకు వివిధ యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. ఒక్కో సెర్చ్కమిటీలో ముగ్గురు సభ్యులు.. యూజీసీ నామిని, యూనివర్సిటీ నామిని, ప్రభుత్వ నామిని ఉంటారు. దరఖాస్తుల నుంచి యూనివర్సిటీలవారీగా సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లను గవర్నర్కు ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వ సూచనమేరకు ఆ ముగ్గురిలో ఒకరిని గవర్నర్ వీసీగా ని యమిస్తారు. ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన సెర్చ్కమిటీల్లో ప్రభుత్వనామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నారు. కాగా, కాకతీయ యూనివర్సిటీకి సెర్చ్కమిటీని ఏర్పాటు చేయలేదు. దీంతో కేయూ వీసీ నియామకంపై సందిగ్ధం నెలకొంది. నియామకాలు పారదర్శకంగా జరిగేనా..? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన పలు యూనివర్సిటీల వీసీలపై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సమర్ధులైనవారిని వీసీలుగా నియమించలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. వీసీల పాలనపై ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం వీసీల నియామకాలు పారదర్శకంగా చేపట్టి, సమర్థులైన వారికి పాలన బాధ్యతలు అప్పగిస్తారని ఆశిద్దాం.ఈనెల 21తో ముగియనున్న కేయూ వీసీ రమేశ్ పదవీకాలం సెర్చ్కమిటీ ఏర్పాటుచేయని ప్రభుత్వం పాలకమండలి నియమించాకే సెర్చ్ కమిటీకి అవకాశం! ఆశావహుల ప్రయత్నాలు ఆశావహుల దరఖాస్తులు.. కేయూ వీసీ పదవి కోసం దరఖాస్తులు చేసినవారిలో ప్రస్తుత వీసీ ఆచార్య తాటికొండ రమేశ్తోపాటుగా కేయూ మాజీ వీసీ ఆచార్య వెంకటరత్నం, శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ కేయూ రిటైర్డ్ ఆచార్యులు ఎండీ ఇక్బాల్ అలీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ వీసీ, కేయూ రిటైర్డ్ ఆచార్యులు అల్తాఫ్ హుస్సేన్ కూడా ఉన్నారు. కేయూ ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి, మాజీ రిజిస్ట్రార్లు సదానందం, సాయిలు, పురుషోత్తం కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి, కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ఆచార్యులు గాదె దయాకర్, కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ఆచార్యులు వడ్డె రవీందర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేన్ విభాగంలో ప్రస్తుత ప్రొఫసర్ యాదగిరి రావు, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, మహేందర్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఆశావహులు తాము ఎలాగైనా వీసీ కావాలనే ఉద్దేశంతో రాజకీయ సంబంధాలను సైతం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఇన్చార్జ్ పాలన తప్పదా..? కేయూ వీసీ రమేశ్ పదవీకాలం ఈనెల 21న ముగిశాక.. 22వ తేదీ నుంచి ఇన్చార్జ్ వీసీ పాలన తప్పదని తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో వివిధ ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ను ఇన్చార్జ్ వీసీగా నియమిస్తారని భావిస్తున్నారు. కేయూకు పూర్తిస్థాయి పాలకమండలి సభ్యులను నియమించాక వీసీ నియామకానికి సెర్చ్కమిటీకోసం యూనివర్సిటీ నామినీని నియమించాల్సి ఉంటుంది. సెర్చ్కమిటీ ఏర్పాటు.. వీసీ నియామకం పూర్తయ్యేవరకు మరో రెండు నెలలు సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వాగులకు జలకళ
డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగు.. జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డోర్నకల్: డోర్నకల్ సమీపంలోని మున్నేరవాగు నిండుగా నీటితో ప్రవహిస్తోంది. గురువారం సా యంత్రం వరకు చుక్క నీరు లేకుండా వెలవెలబోయిన వాగు ఎగువ ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి నీటితో కళకళలాడుతోంది. వాగు పరీవాహక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
మహబూబాబాద్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి ఆమె జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర వసతులు కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా కార్యాచరణ ఉండాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నర్సింహారావు, సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం 2024–25 విద్యా సంవత్సరానికి ఒకటి, ఐదో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల ఇన్చార్జ్ అధికా బాలరాజు శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఒకటో తరగతిలో 47 సీట్లు, ఐదో తరగతిలో 50 సీట్లు ఉన్నాయని, జూన్ 7వ తేదీ వరకు ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు, కుల, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందేవారు 01–09–2018 నుంచి 31–08–2019 మధ్య జన్మించిన ఉండాలన్నారు. అలాగే ఐదో తరగతిలో ప్రవేశాలకు 01–09–2014 నుంచి 31–08–2015 మధ్య జన్మించి ఉండాలన్నారు. కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ప్రవేశానికి అవకాశం ఉంటుందన్నారు. ట్రాన్స్ఫార్మ్లోని రాగి తీగ చోరీ కొత్తగూడ: ట్రాన్స్ఫార్మలోని రాగి తీగ చోరీకి గురైన ఘటన మండలంలోని పొగుళ్లపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. ట్రాన్స్ కో ఏఈ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతుల బోర్లకు విద్యుత్ సరఫరా చేసే 25కేవీ ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈమేరకు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏఈ తెలిపారు. పెరిగిన కూలిరేట్లు అమలు చేయాలి కేసముద్రం: బిహార్ కార్మికులకు పెరిగిన 12శాతం కూలి రేట్లు వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారపు శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ పరిధిలో కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయడంలో వ్యాపారులు మొండివైఖరి వీడాలన్నారు. మార్కెట్ను నమ్ముకుని జీవిస్తున్న స్థానిక, బిహార్ కార్మికులకు వెంటనే పెరిగిన రేట్లను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టగడుపుల వెంకన్న, రాజు, సోహన్, చందన్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి ఆలయంలో డోలోత్సవం హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి పాలభోగం, క్షీరాన్న నివేదన జరిపారు. అమ్మవారి మూలమూర్తిని పూమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి డోలోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భద్రపీఠం, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగించారు. -
ధాన్యం కొనుళ్లను వేగవంతం చేయాలి
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లు, ఇతర విషయాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాంటాలు, ఆన్లైన్ నమోదు, ఇతర ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. 2023–24కి సంబంధించిన సీఎంఆర్ పెట్టేలా మిల్లులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరాలి.. కేసముద్రం: జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరేలా చూడాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రంవిలేజ్ జెడ్పీహైస్కూల్లోని జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు. గోదాంకు వచ్చిన పుస్తకాల వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరేలా చూడాలని డీఈఓ రామారావును ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్, మందుల శ్రీరాములు, తహసీల్దార్ దామోదర్, మేనేజర్ కొత్త జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రైతులను ఆదుకోవాలి నెహ్రూసెంటర్: అకాల వర్షాలకు పంటలు తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాకయ్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొనుగో లు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అలాగే మామిడి రైతులకు నష్టం వాటిల్లిందని, వారికి పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల రుణమాఫీ, కొత్త రుణాల మంజూరుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
బయ్యారం చెరువుకు భారీగా వరదనీరు..
బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన వాగుల్లో వరదనీరు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలో ప్రధాననీటి వనరు అయిన బయ్యారం పెద్దచెరువులోకి పందిపంపుల, మసివాగుల నుంచి వరదనీరు చేరుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు నీటిమట్టం 9అడుగులకు చేరింది. మరో వైపు పెద్దవాగు ప్రవాహంతో కోయగూడెం–కిష్టాపురం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. వ్యవసాయ సీజన్కు ముందే భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు. -
సాగుకు సన్నద్ధం
మహబూబాబాద్ రూరల్: వానాకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులను పొలా లు, చేలల్లో చల్లుతున్నారు. కాగా వానాకాలంలో జిల్లాలో 4,30,521 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. ప్రణాళిక సిద్ధం.. ఇప్పటికే రైతులు ఏ పంటలు సాగు చేస్తారు? ఎంత మేర విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయి? తదితర అంశాలతో వ్యవసాయశాఖ అధికారులు వానాకాలం సాగు ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. వానాకాలంలో అన్ని పంటలు కలిపి 4,30,521 ఎకరాల్లో సాగు చేస్తారని అధికా రులు అంచనా వేశారు. ఇందులో పత్తి 84,070 ఎకరాల్లో సాగయ్యే అవకాశముంది. వరి 2,15,278 ఎకరాలు, కంది 1,236, మొక్కజొన్న 53,037, వేరుశనగ 64, మిర్చి 68,133, పెసర 1,722, పసుపు 1,870, ఆయిల్ పామ్ 4,416, కూరగాయలు 586, పొగాకు 55 ఎకరాలు, ఇతర పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. రైతన్నల బిజీబిజీ.. ఈ నెల 30నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీనికితోడు జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభం తర్వాత వానలు కురుస్తాయని అన్నదాతల నమ్మకం. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు వేసవి దుక్కులు దున్నుకొని సిద్ధం చేసుకుంటున్నారు. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా భూమిలో తేమశాతం పెరిగి, భూసారం అభివృద్ధి, పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ ఇతర ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా భూమి సారవంతమై అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈమేరకు రైతులు దుక్కులు దున్నే పనిలో బిజీగా ఉన్నారు. గతేడాది నిరాశపరిచిన సాగు.. గత ఏడాది వర్షాలు సకాలంలో కురిసినప్పటికీ పలు రకాల కారణాలు వానాకాలం పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి రైతులను నిరాశ పరిచాయి. రుతు పవనాలు ప్రవేశించిన వెంటనే వర్షాలు కురిశాయి. ఆశాజనకంగా సాగు జరుగుతుందని రైతులు సంతోష పడ్డారు. రెండు నెలల పాటు అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత అధిక వర్షాలు కురిశాయి. దీంతో తెగుళ్లు తీవ్రమై పంటలు దెబ్బతిన్నాయి. మిరప, పత్తి పూత, కాతనిలవకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. పంట చేతికొచ్చిన తర్వాత వడగండ్లవానతో ధాన్యం తడిసి రైతన్నలు కొంత మేరకు నష్టపోయారు. ఏది ఏమైనా దిగుబడులపై గణనీయ ప్రభావం పడింది.జిల్లాలో 4,30,521 ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా వరి 2,15,278 ఎకరాలు, పత్తి 84,070, మిర్చి 68,133 ఎకరాల్లో సాగు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్న అధికారులు వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు -
ప్రతిభను వెలికితీయాలి
కొత్తగూడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఐటీడీఏ డీడీ మంకిడి ఎర్రయ్య సూచించారు. మండల కేంద్రంలోని క్రీడా పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో పాటు సిలబస్లో కూడా శిక్షణ ఇచ్చి మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఏసీఎంఓ వీర్లాల్, పాఠశాల హెచ్ఎం దేవదాస్, ఏటీడీఓ భాస్కర్, పీడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల ఆర్థిక పురోగతికి సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సహకరించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయ మెంబర్ సెక్రటరీ రాజారావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా గ్రామ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఆయన సందర్శించి పరిశీలించారు. కూలీలతో మాట్లాడి టెంట్, తాగునీటి వసతి ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించారు. కూలీలకు రోజుకు రూ.300 వేతనం వచ్చే విధంగా పని కల్పించాలని సూచించారు. కూలీలకు పనులు కల్పించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయ మెంబర్ అబేద్ ఖాన్, అడిషనల్ డీఆర్డీఓ శాంతకుమారి, అంబుడ్స్ పర్సన్ ఆదాం, ఎంపీడీఓ రవికుమార్, ఏపీఓ రమేష్ రెడ్డి, టీఏలు ఓంకార్, సంతోష్, శంకర్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు పరిశీలన మరిపెడ రూరల్: మరిపెడ మండలం బాల్యతండాలో రాష్ట్ర బృందం గురువారం సందర్శించింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపట్టిన పనులను పరిశీలించింది. ముందుగా రాష్ట్ర బృందం సభ్యులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. సభ్యులు ఉపాధి పనులు చేసిన ప్రాంతాలను సందర్శించి వివరాలను కూలీల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణకు సంబంధించి ప్రతి వివరాలు బోర్డులో రాయించాలని సూచించారు. ఉపాధి నిధులతో గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం బాల్యతండాలో కూలీ లు చేసిన పనులను పరిశీలించారు. స్టేట్ పంచాయ తీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ మెంబర్ రాజారావు, జిల్లా అదనపు డీఆర్డీఓ శాంతకుమారి, అంబుడ్స్మెన్ అధికారి ఆదాం, ఎంపీడీఓ రేవతి, ఎంపీఓ పూర్ణచందర్రెడ్డి, ఏపీఓ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 9505514424 ఫీజు : రూ.3 వేలు -
రైతుల పక్షాన పోరాటం సాగిస్తాం..
కేసముద్రం: రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై ఆ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని, అదే విధంగా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, తీరా అధికారంలోకి రాగానే ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు జరిగిన రాస్తారోకోతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుగులోతు వీరునాయక్, మండల ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత నీలం దుర్గేష్, ఎంపీటీసీ సట్ల వెంకన్న, కొండ్రెడ్డి రవీందర్రెడ్డి, మోడెం రవీందర్గౌడ్, ఊకంటి యాకూబ్రెడ్డి, చిర్ర యాకాంతంగౌడ్, కూన భద్రాద్రి, బానోతు వెంకన్న, మిట్టగడుపుల మహేందర్, చందాగోపి, సుమన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ -
ఇంటర్ సప్ల్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
మహబూబాబాద్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించి 144 సెక్షన్ విధించాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో 4,679 మంది 16 సెంటర్లలో పరీక్షలు రాస్తారని తెలిపారు. విద్యార్థులతో పాటు సిబ్బంది కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దని సూచించారు. ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించాలని, పోస్టల్ అధికారులు నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలన్నా రు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పో, డీఐఈఓ సత్యనారాయణ, డీఈఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణపై కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 483 అమ్మ ఆదర్శ పాఠశాలలు ఎంపిక కాగా.. 432 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయన్నారు. పనులు పాఠశాలల ప్రారంభం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్, డీఈఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
● మానుకోటలో భారీవర్షం
మహబూబాబాద్ అర్బన్: మానుకోట పట్టణంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. బయ్యారంలో.. బయ్యారం: మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బయ్యారం, జగ్గుతండా, గంధంపల్లి–కొత్తపేట, వెంకట్రాంపురం గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి, వెంకట్రాంపురం గ్రామానికి చెందిన జక్కుల తిరుపతయ్య ఇంటి సమీపంలో పిడుగుపడటంతో రూ.60 వేల విలువైన పాడిగేదె మృతి చెందింది. -
పార్ట్టైం లెక్చరర్ల ధర్నా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్లను కాంట్రాక్టుగా కన్వర్షన్చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం పరిపాలన భవనం వద్ద ధర్నా చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేయూ పార్ట్టైం లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వై రాంబాబు మాట్లాడుతూ ఈనెల 15న తాము ఆందోళన చేయగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి పార్ట్టైం లెక్చరర్లను కాంట్రాక్టుగా కన్వర్షన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతికోసం సంబంధిత ప్రిన్సిపల్సెక్రటరీకి లేఖ రాస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ లేఖలో 120మంది రెగ్యులర్, సెల్ప్ఫైనాన్స్ కోర్సుల్లో 16 పీరియడ్లతో పార్ట్టైం లెక్చరర్లు పనిచేస్తున్నారని, వారిని కాంట్రాక్టు లేదా అకడమిక్ కన్సల్టెంట్లుగా అప్గ్రేడ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే పంపుతున్నట్లు ఉందన్నారు. ఈ లేఖను సంబంధిత అధికారులు పార్ట్టైం అధ్యాపకులకు చూపారని, అదిసరికాదని మార్చాలని డిమాండ్ చేశారు. ఈనెల15న ఏసీపీ దేవేందర్రెడ్డి సమక్షంలో జరిగిన చర్చలో రిజిస్ట్రార్ ఇచ్చిన హామీకి భిన్నంగా ఉందని తెలిపారు. కేయూ వీసీ రమేశ్.. పార్ట్టైం అధ్యాపకులను అఫిడవిట్ తీసుకురావాలని సూచించారన్నారు. కానీ అతనే గురువారం పరిపాలనాభవనానికి రాలేదని ఆరోపించారు. ఈ విషయంలో వీసీ ఆంతర్యమేమిటో అని తెలపాలని డిమాండ్ చేశారు. పార్ట్టైం లెక్చరర్లను కాంట్రాక్టుగా కన్వర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చే వరకూ తాము ఇక్కడి నుంచి కదలబోమని రాత్రి 10 గంటలైనా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్ట్టైం అధ్యాపకుల సంఘం జనరల్సెక్రటరీ నరేందర్నాయక్, బాధ్యులు దేవోజీ నాయక్, భాగ్యమ్మ, వినోద, సుజాత, విజయ, సుధీర్ ,అన్నపూర్ణ , మాధవి, వాణిదేవి, సృజన, కల్యాణి, ప్రియ, శ్రీధర్, ఫణి తదితరులు పాల్గొన్నారు. కాగా, పార్ట్టైం లెక్చరర్ల ఆందోళన చేస్తుండంతో వీసీ రమేశ్, రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిపాలనభవనానికి రాకుండా వీసీ లాడ్జ్ వద్ద నుంచే తమ విధులు నిర్వర్తించారు. కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి ఆందోళన -
మరియ మాతకు వెండి కిరీటం బహూకరణ
చెన్నారావుపేట: దాతలు.. మరియ మాతకు రూ.4 లక్షల విలువైన 3 కిలోల వెండి కిరీటం బహూకరించారు. తిమ్మరాయిని పహాడ్కు చెందిన నాగోతు లూర్థయ్య, శౌరమ్మ దంపతుల జ్ఞాపకార్థం నాగోతు బాలస్వామి, జయమ్మ దంపతులు, వారి కుమారుడు అమెరికాలో ఉంటున్న జోసఫ్ అమృత రాజ్, డాక్టర్ మరియ సింధూర దంపతులు తమ కుమారుడు జయ దీక్షాంతలు..మరియమాతకు కిరీటం బహూకరించారు. శతావత్సర గ్రామ ఆవిర్భావ జూబ్లీ వేడుకల సందర్భంగా గురువారం పునీత రాయప్ప బోధన పీఠ దేవాలయం చర్చి ఫాదర్ తుమ్మ యాగారెడ్డికి వెండి కిరీటం అందించారు. 40 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ పట్టివేత దంతాలపల్లి: నలబై సంవత్సరాలుగా తప్పించుకుతిరుతున్న ఖైదీని గురువారం పట్టుకున్నట్లు మహబూబాబాద్, వరంగల్ జైల్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 1982లో మహబాబాబాద్లో జరిగిన ఓ హత్యకేసులో మహబూ బాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన సందు వీరన్న జీవిత ఖైదు శిక్ష పడింది. 1984లో వీరన్న పెరోల్పై విడుదలయ్యాడు. పెరోల్ గడువు ముగిసినా జైలుకు వెళ్లలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు జైలు అధికారుల కళ్లు కప్పి తిరుగుతున్నాడు. కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమించి తమకు వచ్చిన సమాచారం మేరకు గురువారం దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు. వీరన్నను పట్టుకున్న ఆపరేషన్లో మహబూబాబా ద్, వరంగల్ జైలు అధికారులు రామకృష్ణారెడ్డి, బి.నాగరాజు, వార్డర్లు యాసిన్, రఘు పాల్గొన్నారు. అప్పుడు అతని వయస్సు 27 కాగా, ఇప్పుడు 70 సంవత్సరాలు. వీరన్నను పట్టుకోవడంలో మహబూబాబాద్ సీఐ సర్వయ్య. దంతాలపల్లి ఎస్సై కరుణాకర్ సహకారం అందించారని అధికారులు తె లిపారు. నలబై సంవత్సరాల కేసును చేధించిన జైలర్లను ఉన్నతాధికారులు అభినందించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement