
కీటక జనిత వ్యాధుల నియంత్రణకు చర్యలు
సాక్షి,పాడేరు: జిల్లాలో కీటక జనిత వ్యాధుల నివారణకు పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పలు శాఖల జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా,డెంగ్యూ మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మూడు ఐటీడీఏల పరిధిలో దోమల నివారణ,మలేరియా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని,ఈనెల 15 నుంచి మొదటి విడత దోమల నివారణ మందు పిచికారీ ప్రారంభించాలని ఆదేశించారు. దోమల మందు పిచికారీపై ప్రజలను చైతన్య పరచాలని,జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని తెలిపారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలు,ఏపీఆర్ విద్యాలయాల్లో దోమతెరలు ఏర్పాటు చేయాలని, విద్యార్థినీవిద్యార్థులకు నైట్డ్రెస్లు పంపిణీ చేయాలని తెలిపారు.జిల్లా మలేరియాశాఖ అధికారి తులసి మాట్లాడుతూ ఈనెల 15నుంచి జూన్ 15వరకు మొదటి విడత, జులై 1నుంచి ఆగస్టు 31వతేదీ రెండవ విడత దోమలమందు పిచికారీ నిర్వహించనున్నట్టు చెప్పారు.అనంతరం కీటక జనిత వ్యాధుల నివారణకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వర్చువల్గా జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్ బాషా, ప్రత్యక్షంగా జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డీఈవో బ్రహ్మాజీరావు, ఇన్చార్జి గిరిజన సంక్షేమ డీడీ రజనీ, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం జన్మన్ పనులు వేగవంతం
పీఎం జన్మన్లో మంజూరు చేసిన రహదారి నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.పలు ఇంజినీరింగ్శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో 23 రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదించగా 20 పనులు ఆమోదించామన్నారు.పాడేరు డివిజన్లో ఏడు రోడ్లకు ఐదు పనులను ఆమోదించామని చెప్పారు.జిల్లాలో 1600 సెల్టవర్లను మంజూరు చేశామని,వాటి పనులు వేగవంతం చేయాలన్నారు. 43 జియో సెల్టవర్ల నిర్మాణానికి స్థలాలు అనుకూలంగా లేవని జియో నెట్వర్క్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,డీఎఫ్వో సందీప్రెడ్డి,రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం,గిరిజన సంక్షేమశాఖ ఈఈలు వేణుగోపాల్,డేవిడ్,పీఆర్ ఈఈలు శ్రీనివాస్,కొండయ్యపడాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజంగి రిజర్వాయర్కు నష్టం తేవద్దు
జాతీయ రహదారి నిర్మాణంలో తాజంగి రిజర్వాయర్కు ఎలాంటి నష్టం తేవద్దని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. తాజంగి రిజర్వాయర్ వద్ద మట్టి పోస్తుండడంతో నీటిమట్టం తగ్గి సేద్యానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రిజర్వాయర్ అంచుల వెంబడి రివిట్మెంట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా పంటకాల్వలు,చెక్డ్యాంలు దెబ్బతింటే వాటిని వెంటనే సరిచేయాలన్నారు. సివిల్ తగాదాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,జాతీయ రహదారుల నిర్మాణాల సంస్థ విశాఖప ట్నం పీడీ రవి, అరకు పీడీ గుల్షన్కుమార్, డీఎఫ్వో సందిప్రెడ్డి, ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు, వర్చువల్గా రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీలు పాల్గొన్నారు.
ఈనెల 15నుంచి దోమల మందు పిచికారీ
మలేరియా నిర్మూలనకు ముందస్తు ఏర్పాట్లు
కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలు