
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు.
లాంగ్ ఐలాండ్లో హిక్స్విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు.