బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌.. కెప్టెన్‌ విధ్వంసకర శతకం | ICC Women's World Cup Qualifier 2025: Bangladesh Beat Thailand By 178 Runs | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌.. కెప్టెన్‌ విధ్వంసకర శతకం

Published Thu, Apr 10 2025 4:28 PM | Last Updated on Thu, Apr 10 2025 4:56 PM

ICC Women's World Cup Qualifier 2025: Bangladesh Beat Thailand By 178 Runs

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 10) బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ తలపడ్డాయి. లాహోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ థాయ్‌ను 178 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. షర్మిన్‌ అక్తర్‌ (126 బంతుల్లో 94 నాటౌట్‌; 11 ఫోర్లు) సెంచరీకి చేరువై అజేయంగా నిలిచింది. ఓపెనర్‌ ఫర్జానా హాక్‌ (53) అర్ద సెంచరీతో రాణించింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పసికూన థాయ్‌లాండ్‌.. బంగ్లా స్పిన్నర్లు ఫహిమ ఖాతూన్‌ (8.5-1-21-5), జన్నతుల్‌ ఫిర్దౌస్‌ (5-3-7-5) చెలరేగడంతో 23.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. థాయ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చనిద (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బోణీ కొట్టింది.

కాగా, ఈసారి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలకు పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ సహా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌ వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం పోటీపడుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement