-
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మరచిపోయి వేసిన స్టెప్స్నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాలో బేబీ బంప్తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ కాబోయే చిన్న కోడలికి దుబాయ్లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్గా, ఎన్ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్రూమ్లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనుంది. అంతేకాదు బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు కూడా ఇది సరిపోతుందని అంచనా.లవ్బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్లో జామ్ నగర్లో ప్రీవెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా అనంత్కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్ అంబానీ. అలాగే కాబోయే కోడలు రాధికా మర్చంట్కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.థైరాయిడ్ వ్యాధిమెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్కు దారతీయవచ్చు.గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటేచక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చుథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం. ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి. -
నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆసీజన్లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో పండ్లు ఎక్కువగా వస్తాయి. నేనేడు పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్లు, జ్యూస్లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్ల నేరేడు ప్రయోజనాలునేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిదినేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ.నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. అపోహనేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.ఎవరు తినకూడదంటే...నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు. -
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
వరల్డ్ ఫ్యామస్ మీమ్ డాగ్ ఇకలేదు.. గుండె పగిలిందంటున్న నెటిజన్లు
సోషల్మీడియాలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినా జపనీస్ కుక్క(19) ఇకలేదు. సోషల్ మీడియాలో మీమ్స్ ఐకాన్ కబోసు "డాగీ" కన్నుమూసింది. ఈవిషయాన్ని కబోసు యజమాని అత్సుకో సాటో ప్రకటించారు. "మే 26 ఆదివారం నాడు కబో-చాన్కు వీడ్కోలు పార్టీ"ని నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీంతో డాగ్ లవర్స్, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆర్ఐపీ కబోసు సందేశాలు వెల్లువెత్తాయి.Rest in Peace, Doge 💔Doge मीम के पीछे का, करोड़ों लोगों के चेहरों पर मुस्कान लाने वाला जापानी कुत्ता काबोसु (kabosu) 18 साल की उम्र में मर गया, लेकिन काबोसु हमेशा ज़िंदा रहेगा। ❤Miss u kabosu 😥Kabuso the dog behind this meme died , RIP Doge 💔 pic.twitter.com/LLDfWp7xcU— Jayesh Jha (@imjayeshjha) May 24, 2024క్రిప్టోకరెన్సీ డాగ్కాయిన్ను, సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్గా షిబా ఇను కబోసు పేరుగాంచింది. లుకేమియా , కాలేయ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే అన్నం తిని పుష్కలంగా నీళ్ళు తాగిందనీ, గాఢ నిద్రలో ప్రశాతంగా కన్నుమూసిందని సాటో తెలిపారు. 2022లో లుకేమియా , కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. -
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది. -
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్స్టాగ్రామ్లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్లైక్ ఇమేజ్లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. -
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి! -
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్పీహెచ్బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. పూర్ణిమ విశిష్టత..ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. బోధి వృక్షానికి పూజలు..బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?) -
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్లోని వాంకనేర్కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే -
ట్రైనీ నుంచి డైరెక్టర్ దాకా... రూ.2,556 కోట్ల మార్కెట్
నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా. మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్లో ఒక చిన్న డెయిరీ యూనిట్ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్లోనే జాబ్లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్గా తీసుకున్నాను. పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. శ్రేష్టమైన ఉత్పత్తులు..చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్ను చూపించగలిగాను. గడపగడపకూ..ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను. దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ. -
నయా ట్రెండ్ : అమ్మమ్మ చేతి వంట
నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్. రూ.2000 ల పెట్టుబడిఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్ని బాగా ఇష్టపడ్డారు. ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది. పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని. నేడు ఎస్కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది. -
కేతు విశ్వనాథ రెడ్డి గారి తెలుగు కథలు!
నాకు ఇష్టమైన కథకుల కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నాకు దక్కిన అదృష్టాల్లో చిన్నతనాననే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం అని రాసి పెట్టబడి ఉంది. రెక్కలు అనే ఆ కథకు నా బొమ్మ ఎంత బాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా. కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను ' నాయనా ' అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో మా రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకించి పోతాను నేను. పెద్దలు, ఇష్టులు, నాకు దగ్గరువారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం పుష్కల బాగా ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కొకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి వందల ఫుట్నోట్స్ చేర్చి ఆ సాహిత్యాన్ని ఇంకాస్త ఎత్తు పెంచారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక , అచ్చుతప్పుల పురుగు పట్టి లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. చేయవలసినంత ఆ నాశనపు పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కొకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు. ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఇంకో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు. కదా, పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని ఎందుకో కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! బహుశా నాకు గల ప్రాంతీయాభిమానమేమో ! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డిగారి పుస్తకాల కవర్లకు చంద్ర గారి కొల్లాజ్ పొకడలు నాకు ఎప్పుడూ సంభ్రమాన్నే కలిగిస్తూ ఉండేవి. విశ్వనాథరెడ్డి గారు తన కాలేజీ ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్గా తన సేవలందించారు. పంజాగుట్టలో ఉండేది ఆ ఆఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అయితే నాకు గుర్తుండి కృష్ణారెడ్డి గారితో ఆంద్రజ్యోతి లో నా తొలి పరిచయం. శ్రీ రమణ గారిని కలవడం కొరకు రోజూ ఆ పత్రిక అఫీసు కి వెళ్ళేవాడిని, ఆ పక్కనే శ్రీ కృష్ణారెడ్డి గారు కనపడేవారు. అదే సి. సి. రెడ్డి గారి ఆఫీస్ లో అప్పుడప్పుడూ వంశీ అని ఒక పాత దర్శకుడు గారు కూడా కనపడేవారు. నాకు గుర్తు ఉండి అప్పట్లో "తను నేనూ సావిత్రి" అనే సినిమా తీస్తున్నా, టైటిల్ ఎలా ఉంది అని నన్ను ఒకసారి అడిగారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు. అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయిత గా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.--అన్వర్ సాక్షి(చదవండి: 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!) -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్శాచురేటెడ్ , పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. -
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్ను వాడతారు. -
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Porsche Centre Chennai (@porschecentrechennai)పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్స్టాగ్రామ్లో సూపర్కార్తో ఉన్న నాగ చైతన్య ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. నేచురల్ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్పీ పవర్ను, 468 గరిష్ట టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.నాగ చైతన్యకు ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర కార్లు ఉన్నాయి. వర్క్ ఫ్రంట్లో, నాగ చైతన్య రాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
ఒడిషాలోని బీచ్ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీచ్లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్ల గురించి తెలుసుకుందాం.<Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 1. పూరి బీచ్ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 20242. అస్తరంగ బీచ్పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.4. గోపాల్పూర్ బీచ్ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.5. రాంచండీ బీచ్, కోణార్క్కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.6. బలిఘై బీచ్, పూరిపూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.7. తలసరి బీచ్తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- IPL 2024: కోల్కతాకే కిరీటం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement