మల్లారంలో నేరడిగొండవాసి హత్య | Sakshi
Sakshi News home page

మల్లారంలో నేరడిగొండవాసి హత్య

Published Mon, May 6 2024 6:20 AM

-

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతంలో నిర్మల్‌ జిల్లా నేరడిగొండవాసి హత్యకు గురయ్యాడు. ఆదివారం నేరడిగొండ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన గంగయ్య (35) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్‌ఫోన్‌ రికార్డులను పరిశీలించారు. మిస్సింగ్‌ అయిన తర్వాత చివరగా ఎవరితో మాట్లాడారో తెలుసుకొని నిజామాబాద్‌ నగరంలోని ఐదోటౌన్‌ పీఎస్‌ పరిధిలోని నివాసిని అదుపులోకి తీసుకొని విచారించారు.

అతడు నేరడిగొండ వాసి మల్లారం ప్రాంతంలో చనిపోయాడని తెలుపడంతో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తిని కాల్చివేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకోవడంతో కాల్చివేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తెలిపాడు. ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు కాల్చివేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

నేరడిగొండ వాసికి నిజామాబాద్‌ వాసికి సోషల్‌ మీడియాలోని ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. కాగా నేరడిగొండ వాసి హత్యకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రూరల్‌ సీఐ సురేశ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement