రాజమండ్రి, అనకాపల్లి బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్న నరేంద్ర మోదీ
సాక్షి, అమరావతి/సాక్షి, అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిల్లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3.30 గంటలకు వేమగిరిలో, 5.45 గంటలకు రాజుపాలెంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళతారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కళ్యాణ్ పాల్గొంటారు.
8న మళ్లీ రాష్ట్రానికి.. ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు.