
ఇక గృహ వినియోగదారుల దోపిడీ
డివిజన్ వారీగా ఉమ్మడి జిల్లాలో బిగించిన స్మార్ట్ మీటర్లు
ఆదోని 17,950
డోన్ 13,570
కర్నూలు 21,864
ఆత్మకూరు 9,945
నంద్యాల 35,890
ఎమ్మిగనూరు 12,670
మొత్తం 1,11,889
వ్యాపారులపై విద్యుత్ పిడుగు
● స్మార్ట్ మీటర్లతో
ఇబ్బడిముబ్బడిగా బిల్లులు
● సంక్షోభంలో సూక్ష్మ,
చిన్న తరహా పరిశ్రమలు
● గతంలో నెలవారీ బిల్లు
రూ.2వేల నుంచి రూ.10వేలలోపే
● రెండు నెలలుగా బిల్లులు
రూ.30 వేలపైనే
● గగ్గోలు పెడుతున్న వ్యాపార,
పారిశ్రామిక వేత్తలు
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లతో వినియోగదారులను దోపిడీ చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గతంలో వీటిని వ్యతిరేకించిన టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్మార్ట్ మీటర్ల టెక్నాలజీలో మార్పులు తెచ్చి మొదటి దశలో కమర్షియల్ కనెక్షన్లు కేటగిరి–2, పరిశ్రమల కనెక్షన్లు కేటగిరి–3లకు స్మార్ట్ మీటర్లు బిగించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఒక్కసారిగా నాలుగు అంకెల్లో ఉన్న బిల్లులు ఐదు అంకెల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వ్యాపార, పారిశ్రామిక వేత్తల్లో ఆందోళన మొదలైంది. 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధినేత ప్రచారాన్ని ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం చూస్తుంటే సంపద సృష్టి అంటే ఇదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అడ్డుగోలుగా వస్తున్న విద్యుత్ బిల్లులపై ఫిర్యాదు చేయడానికి వెళితే స్పందించే అధికారులు కూడా కరువయ్యారనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.
1.07 లక్షల కేటగిరీ–2 కనెక్షన్లకు
స్మార్ట్ మీటర్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17,06,665 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 12,67,748 హౌస్హోల్డ్ కనెక్షన్లు. కమర్షియల్ కేటగిరీ–2 కింద 1,58,252, పరిశ్రమల కేటగిరీ–3 కింద 9,698 ఉన్నాయి. ఇప్పటి వరకు కేటగిరి–2, కేటగిరి–3 కనెక్షన్లకు 1.11 లక్షల స్మార్ట్ మీటర్లు బిగించారు. డిసెంబర్ నుంచి స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమం జరుగుతోంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో వ్యాపార, పారిశ్రామికవేత్తల్లో అలజడి మొదలైంది. స్మార్ట్ మీటర్లు బిగించక ముందు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వస్తున్న విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా రూ.30 వేలు దాటుతున్నాయి. దీంతో వ్యాపారులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు బెంబేలెత్తుతున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దని.. వెనక్కు తీసుకోవాలని విద్యుత్ అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, ఎంత బిల్లు వస్తే అంత గడువులోపు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామని అధికారులు తేల్చి చెబుతుండటం గమనార్హం.
నెపం కెపాసిటర్లపైకి..
● విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో రావడానికి స్మార్ట్ మీటర్లు కారణం కాదని.. కెపాసిటర్ల వల్లే అలా వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
● సాధారణంగా రీడింగ్ను బట్టి బిల్లులు రావాల్సి ఉంది.
● సామర్థ్యం ఎక్కువగా ఉంటే స్మార్ట్ మీటర్లు రీడింగ్ను బట్టి కాకుండా కేపాసిటర్ సామర్థ్యాన్ని బట్టి బిల్లు ఇస్తుంది.
● కేపాసిటర్ల సామర్థ్యం ఎక్కువగా ఉన్న వారు దానిని తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
● స్మార్ట్ మీటర్ల వల్ల మొదటి నెలలోనే సగటున వినియోగదారుడిపై రూ.50 వేలకుపైగా భారం పడింది.
మీటరు రీడర్ల ఉపాధిపై దెబ్బ
గ్రామ, పట్టణాల్లో కనెక్షన్లను బట్టి మీటర్లు రీడర్లు ఉపాధి పొందుతున్నారు. ప్రతి నెలా 1 నుంచి 6 తేదీల మధ్య వీరు ఇంటింటికీ వెళ్లి రీడింగ్ను బట్టి బిల్లులు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా మీటరు రీడర్లతో అవసరం ఉండదు. ప్రతి నెలా 1వ తేదీ రాత్రికే విద్యుత్ అధికారులు ఆఫీసుల నుంచే వినియోగదారుల సెల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా బిల్లులు పంపుతారు. తద్వారా మీటరు రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించిన కూటమి నేతలు, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్నూలు నగరంలోని సంతోషనగర్కు చెందిన జె.ఉస్మాన్కు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ ఉంది. ఈయనకు గత ఏడాది నవంబర్లో రూ.3,380, డిసెంబర్లో రూ.7,223 బిల్లు వచ్చింది. అదే నెలలో విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటరు బిగించారు. జనవరి 2న వచ్చిన బిల్లు చూసి ఉస్మాన్ షాక్కు లోనయ్యాడు. ఏకంగా రూ.30,758 బిల్లు వచ్చింది. ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు కూడా రూ.29,524 ఉంది. అధికారులను సంప్రదిస్తే ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులను సైతం దోపిడీ చేస్తోంది. మొదటి విడతలో 200 యూనిట్లు, ఆపైన వాడకం ఉన్న వినియోగదారుల నివాసాల్లో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలైంది. వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ట్రూ అఫ్ చార్జీలు.. 2022, 2023, 2025 సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులపై సగటున రూ.500 నుంచి రూ.1500 వరకు భారం మోపుతోంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక గృహ వినియోగదారుల దోపిడీ

ఇక గృహ వినియోగదారుల దోపిడీ

ఇక గృహ వినియోగదారుల దోపిడీ

ఇక గృహ వినియోగదారుల దోపిడీ