
Photo Courtesy : Cheetah Conservation Fund
న్యూఢిల్లీ: దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో చీతాలు మనుగడ మొదలుపెట్టాయి. 1952లో దేశంలో అంతరించిపోయాయని ప్రకటించిన చీతాలు తాజాగా భారత్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నాడు నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్కు తీసుకువచ్చారు. వీటిలో రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి వీటిని తీసుకురావడానికి బీ 747 జంబో జెట్కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Photo Courtesy : Cheetah Conservation Fund
ప్రధాని స్వయంగా మధ్యప్రదేశ్లోని కునో–పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి శనివారం ఉదయం 11 గంటలకు చీతాలను విడుదల చేశారు. నమీబియా నుంచి భారత్లో అడుగుపెట్టిన చీతాలను నెల రోజుల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో క్వారంటైన్ చేశారు. అనంతరం భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెడతారు.
చదవండి: చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
Photo Courtesy : Cheetah Conservation Fund
చీతాకు పేరు పెట్టిన మోదీ
కునో నేషనల్ పార్క్లో మొదటి రోజు చీతాలు గడ్డిపై ఆడుతూ, పరుగెత్తుకుంటూ, పరిసరాలను గమనిస్తూ గడిపాయి. అయిదు ఆడ చీతాల్లో ఒకదానికి ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టారు. దాదాపు నాలుగేళ్ల వయసున్న ఈ చీతాను నమీబియాలోని సీసీఎఫ్కు (చిరుత సంరక్షణ నిధి) తీసుకొచ్చిన తర్వాత పేరు పెట్టలేదు. తరువాత ప్రధాని తన పుట్టిన రోజు కానుకగా దీనికి ‘ఆశా’ అనే పేరును సూచించారు.
ఆడ చీతాల పేర్లు
ఆడ చిరుతలల్లో ఒకదాని పేరు సియాయా. దీని వయసు రెండేళ్లు. ఇది సెప్టెంబర్ 2020 నుంచి సీసీఎఫ్లో ఉంది. మరో చీతా ‘టిబిలిసి’ కాగా దీని వయసు రెండున్నర సంవత్సరాలు. ఇది 2020 ఏప్రిల్ నెలలో నమీబియాలోని ఆగ్నేయ నగరం ఒమరూరులోని ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్లో జన్మించింది. ఆడ చీతల్లో పెద్దదైనది ‘సాషా’. మరో ఆడ చీతా సవన్నా.. వీటిని వాయువ్య నమీబియా నుంచి తీసుకొచ్చారు.
Photo Courtesy : Cheetah Conservation Fund
మగ చీతాల పేర్లు ఇవే
మగ చీతాలు మూడు ఉండగా అందులో మొదటిది ఐదేళ్ల ‘ఫ్రెడ్డీ’. దాని సోదరుడు ఎల్టన్. దీని వయసు అయిదున్నర సంవత్సరాలు. ఇవి 2021 జూలై నుంచి సీసీఎఫ్ ప్రైవేట్ రిజర్వ్లో ఉంటున్నాయి. ఇక మూడో మగ చీతా నాలుగున్నర ఏళ్ల వయసున్న ‘ఓబాన్’. ఇది మార్చి 2018లో ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్లో జన్మించింది. కాగా చిరుతలు ఎన్క్లోజర్లో విడుదలైన క్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవి మన అతిథులని, కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయని హర్షం వెలిబుచ్చారు.
చదవండి: కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో
Photo Courtesy : Cheetah Conservation Fund