
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. ఈ మార్గంలో వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలను తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ(NHAI) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి (31 అర్ధరాత్రి) నుంచి అమలులోకి రానున్నాయి.
ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ చార్జీలను తగ్గించింది. తగ్గిన చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు అమలులో ఉండనున్నాయి. ఇక, హైదరాబాద్-విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ప్లాజాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది.
గతంలో ప్రతీ ఏప్రిల్ 1న టోల్ చార్జీలు పెంచిన జీఎంఆర్. 2024 జూన్ 31తో జీఎంఆర్ ఒప్పందం ముగిసింది. అయితే, హైవే-65ను బీవోటీ పద్ధతిలో నిర్మించడంతో 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూలు చేసిన జీఎంఆర్. ఒప్పందం 2024లో ముగియడంతో ఏడాది పాటు నిర్వాహణను ఏజెన్సీలకు అప్పగించిన ఎన్హెచ్ఏఐ. దీంతో, తాజాగా ఎన్హెచ్ఏఐ టోల్ నిర్వహణను చేపడుతుండటంతో ఛార్జీలు తగ్గాయి. టోల్ తగ్గించడంతో వాహనదారులకు ఊరట లభించనుంది.