
హైదరాబాద్, సాక్షి : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
‘‘ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్(Benefit Shows), ప్రత్యేక షోలకు అనుమతించొద్దు. నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదు’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం రేవంత్?