-
బోడసింగిపేటలో కార్డన్ సెర్చ్
బొండపల్లి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు జరుపుతున్నారు. బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామంలో గజపతినగరం సీఐ ఎన్.వి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు శనివారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నివాసితుల వివరాలు సేకరించారు. అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. గుర్తింపు పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అల్లర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బొండపల్లి, గజపతినగరం, మానాపురం ఎస్సైలు కె.లక్ష్మణరావు, యు.మహేష్, బి.లక్ష్మీప్రసన్న కుమార్తో పాటు సర్కిల్ పరిధిలోని పోలీసులు ఈ సెర్చ్లో పాల్గొన్నారు. 8 ద్విచక్ర వాహనాలు సీజ్ ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలించిన పోలీసులు -
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
విజయనగరం అర్బన్: వచ్చేనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నట్టు జిల్లా ఎన్నిక అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభించాలని చెప్పారు. ఓట్లను లెక్కించే కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియలో వివిధ న్యాయపరమైన అంశాలు, సిబ్బంది విధులు, నిబంధనలు, కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో ఓట్లు లెక్కించే విధానం, టేబుళ్ల ఏర్పాటు, చెల్లని, చెల్లిన ఓట్లు గుర్తించడం, వేరు చేయడం, ఫలితాలను బోర్డుపై వెల్లడించడం, తిరిగి ఈవీఎంలను సీల్ చేయడం, స్ట్రాంగ్ రూంలోకి తరలించడం తదితర అంశాల ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని సూచించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు కేంద్రాలు, మొత్తం పార్లమెంటు స్థానం ఓట్ల లెక్కింపు కోసం లెండి కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో కేంద్రంలో నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ స్థానం పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ర్యాండమైజేషన్గా కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గాల కేటాయింపు, టేబుళ్లను కేటాయిస్తామని చెప్పా రు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్వో ఎస్.డి.అనిత, శిక్షణ అధికారి సుధాకరరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకరరావు పాల్గొన్నారు. -
డిగ్రీ ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
విజయనగరం అర్బన్: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2021 – 24 బ్యాచ్ డిగ్రీ తుది పరీక్షల (ఆరో సెమిస్టర్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పలు సబ్జెక్ట్లలో మొదటి మూడు స్థానాలు సాధించారు. బీసీఏ గ్రూప్లో దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామానికి చెందిన కన్నా జోస్యుల అపూర్వ 9.25 సీజీపీఎస్ పాయింట్లు, పట్టణంలోని కామాక్షినగర్కు చెందిన కట్లమూడి భవ్యతేజ 9.24 తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బీఎస్సీ (సీబీసీఎస్)లో మెరకముడిదాం మండలం బిల్లలవలసకు చెందిన ఆరవెల్లి ఆశ్రితరాం 9.60, డెంకాడ మండలం చింతలవలస చెందిన శంకుసాయి ప్రవళ్లిక 9.56 సీజీపీఎస్ పాయింట్స్లో జిల్లా స్థాయిలో రెండు, మూడు స్థానాలు సాధించారు. బీకాం (జనరల్) విభాగంలో పట్టాణానికి చెందిన మంచుకొండ అలివేలు మంగతాయారు 9.31 సీజీపీఏ పాయింట్స్, విసినిగిరి గీతాంజలి 9.19, మోతమర్రి అనూష 8.85 పాయింట్లతో వరుసగా మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించారు. బీబీఏలో పట్టణానికి చెందిన బగ్గాం లిఖిత 8.68, కెళ్ల తరుణిసాయిశ్రీ 8.64 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్లో పట్టణానికి చెందిన నేపాడ హిమాని 8.65, సారిక నయోమి 8.62, రాజాం మండలానికి చెందిన కోడూరు వెన్నెల 8.50 పాయింట్లతో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు. జిల్లా టాపర్ హారిక.. బొబ్బిలి: బీఎస్సీ మ్యాథ్స్, స్టాటస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పొట్నూరు హారిక 9.7 పాయింట్లతో జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో హారికను రాజా కాలేజ్ ప్రిన్సిపాల్ చల్లా వీరంద్రకుమార్, అభినందించారు. -
మాతా,శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి
సీతానగరం: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో మాతా,శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీపీఎంఓ డాక్టర్ పీఎల్ రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీకి వచ్చిన గర్భిణులకు డాక్టర్ పావని పర్యవేక్షణలో వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, ఎక్కువ శాతం మంది మహిళల్లో హిమోగ్లోబిన్(ఐరన్) తక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పెదబోగిలి, సీతానగరం గ్రామాల్లో ఐరన్ లోపం ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించిన గర్భిణుల ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టికాహారం వినియోగం, మందుల వాడకంపై అవగాహన కల్పించారు. పీహెచ్సీ డాక్టర్ బి. పావని మాట్లాడుతూ.. సీతానగరం పీహెచ్సీ పరిధిలోఉన్న 18 వెల్నెస్ కేంద్రాల పరిధిలో 21 మంది గర్భిణులు హైరిస్క్లో ఉన్నట్లు గుర్తించి, వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఎస్వీ రమణ,హెల్త్ సూపరువైజర్ శర్మ, పీహెచ్ఎన్ సత్యవతి, ఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. డీపీఎంఓ రవికుమార్ -
కళలు నేర్పే వారి కల నెరవేరింది...
● బాలభవన్ కేంద్రాల్లో సిబ్బందిని రెగ్యులర్ చేసిన ప్రభుత్వం ● జీఓ 62 ద్వారా వారి జీవితాల్లో వెలుగులు ● మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి కృషితో కరుణించిన సర్కారుచీపురుపల్లి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాలుగా వారంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కల. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ వారి కష్టాన్ని గుర్తించలేదు. అయినప్పటికీ అరకొర వేతనాలతో పనిచేస్తూ ఏ రోజుకై నా తమను ఆదుకునే దేవుడు రాకపోతాడా అంటూ పిల్లలను తీర్చిదిద్దుతూ పని చేశారు. ఎట్టకేలకు దేవుడు సీఎం జగన్ మోహన్రెడ్డి రూపంలో వచ్చి మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చాడు. జవహర్ బాలభవన్ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపునిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జవహర్ బాలభవన్ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. జీవితాంతం సీఎం జగన్ మోహన్రెడ్డిని మరిచిపోలేమని వారంతామ చెబుతుండడంవిశేషం. బాలభవన్ కేంద్రాలంటే ఏమిటి.. పేద ఇళ్లల్లో జన్మించిన చిన్నారుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయాలంటే చాలా ఫీజులు కట్టుకుని ప్రైవేట్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించాలి. ఇది అందరికీ సాధ్యం కాకపోవడంతో వారి ఆశయాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో 1962లో ఇందిరాగాంధీ దేశ వ్యాప్తంగా జవహర్ బాలభవన్ కేంద్రాలు నెలకొల్పింది. అనంతర కాలంలో 1993లో ఏపీలో పాఠశాల విద్యాశాఖ ద్వారా జవహర్ బాలభవన్లు ఏర్పడ్డాయి. ఈ కేంద్రాల ద్వారా చిన్నారులకు నిరంతరం శాసీ్త్రయ నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రియేటివ్ రైటింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తూ వారిలో ఉన్న దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభకు పదును పెడుతున్నారు. కేంద్రాల్లో శిక్షణ పొందిన ఎంతోమంది చిన్నారులు ఎంతో గొప స్థాయికి చేరుకున్నారు. రాష్ట్రంలో బాలభవన్ కేంద్రాలు ఇలా..... రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ జవహర్ బాలభవన్ కేంద్రాలున్నాయి. అందులో భాగంగానే చీపురుపల్లి, రాజాం, విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, అనంతపురం, పాలకొల్లు, కడప, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, మచిలీపట్నం, ఏలూరు, నంధ్యాల, తదితర ప్రాంతాల్లో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ దాదాపు 300 మంది విద్యార్థులు నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రియేటివ్ రైటింగ్ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా ప్రతిఏటా వేసవి సెలవుల్లో వేసవి శిక్షణ తరగతులు పేరుతో వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. అరకొర జీతాలతోనే... జవహర్ బాలభవన్ కేంద్రాల్లో సూపరింటెండెంట్, ఇన్స్ట్రక్టర్, ఆయా, శిక్షకులుగా చాలా మంది తాత్కాలిక ప్రాతిపదికన దశాబ్దాల కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాలను కోరుతున్నారు. కాని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో వీరి సమస్యను మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ విడుదల చేసింది. జీవిత కాలం కోరిక నెరవేరింది..... మూడు దశాబ్దాల కాలంగా బాలభవన్ కేంద్రంలో పనిచేస్తూ ఎంతో మంది పిల్లలను నృత్యం, చిత్రలేఖనం, సంగీతంలో తీర్చిదిద్దాం. తమ కేంద్రాల్లో నృత్యం నేర్చుకున్న పిల్లలు విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చారు. అరకొర జీతాలతోనే పని చేశాం. బాలభవన్ కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ను మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే విధంగా చూశారు. తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీఓ 62ను విడుదల చేసింది. సీఎం జగన్ మోహన్రెడ్డికి జీవిత కాలం రుణపడి ఉంటాం. – డాక్టర్ సుంకరి రమేష్, సూపరింటెండెంట్, జవహర్ బాలభవన్ కేంద్రం, చీపురుపల్లి -
మానవ అక్రమ రవాణా అమానుషం
విజయనగరం క్రైమ్: మానవ అక్రమ రవాణా అమానుషమని, చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.విజయకళ్యాణి అన్నారు. సంస్థ కార్యాలయ ఆవరణలో ‘మిస్సింగ్ చిల్డ్రన్స్, వివిధ రకాల బాధితుల మానవ అక్రమ రవాణా’ అనే అంశంపై శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెట్టిచాకిరీ, అవయవాలు, మత్తుపదార్థాల వ్యాపారం, వ్యభిచారం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాల, బాలికలను, యువతీయువకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని, దీనికి కారణమైన వారికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామన్నారు. పీఎల్ఏపీయూఎస్ జడ్జి జి.దుర్గయ్య మాట్లాడుతూ మానవులను గనులు, కర్మాగారాల్లో వెట్టిచాకిరీ పనులు, సైబర్ నేరాలకు అక్రమంగా తరలిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని హితవు పలికారు. దిశ సర్కిల్ ఇన్సెపెక్టర్ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత మూడున్నరేళ్లలో తప్పిపోయిన పిల్లలను వెతికి గుర్తించామని, పిల్లలను సెల్ఫోన్కు దూరంగా ఉంచాలన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వన్స్టాప్ సెంటర్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కె.సాయి విజయలక్ష్మి మాట్లాడుతూ కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, ప్రేమ వివాహం తదితర వాటిలో బాధిత మహిళలకు అండగా వన్స్టాప్ సెంటర్ ఉందన్నారు. బాధిత మహిళలకు కౌన్సిలింగ్ , వైద్యం, రక్షణ, న్యాయం, పునరావాసం, తదితర సేవలు అందిస్తున్నామని చెప్పారు. లీగల్ కౌన్సిలర్ జయలక్ష్మి మాట్లాడుతూ అనాథలైన పిల్లలను చట్టప్రకారం అడాప్షన్ సెంటర్ ద్వారా పిల్లలు లేని తల్లిదండ్రులకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారా అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో మెప్మా, వివిధశాఖల, అధికారులు, న్యాయ సేవా సిబ్బంది పాల్గొన్నారు. -
ఇకపై హైస్కూల్ ప్లస్..
విజయనగరం అర్బన్: బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తొలి నుంచి విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. గత పాలకులు పట్టించుకోని విద్యావ్యవస్థలో ప్రగతి పరుగులు పెట్టించారు. మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. పుస్తకాలు, యూనిఫారాలు, ట్యాబ్లు అందజేయడంతో పాటు నాణ్యమైన ఆహారం, మెరుగైన బోధన అందించడంతో గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. సౌకర్యవంతమైనా ఆయా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులు కూడా ప్రవేశ పెట్టి ఉన్నత విద్యను అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ముందడుగు వేశారు. రెండేళ్ల కిందట జిల్లాలోని ఎస్.కోట మండలం ధర్మవరం ఉన్నత పాఠశాలలో ప్రయోగాత్మకంగా ‘హైస్కూల్ ప్లస్’ పేరుతో ఇంటర్మీడియట్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి జిల్లాలో ఏడు హైస్కూళ్లను ‘హైస్కూల్ ప్లస్’గా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అందుబాటులో ఉన్నత విద్య విభజిత విజయనగరం జిల్లాలో 27 మండలాలుండగా.. 17 మండలాల్లో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. దీంతో మిగిలిన మండలాలకు చెందిన బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువులు అందని ద్రాక్షలా మారాయి. పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదవించడం విద్యార్థుల తల్లిదండ్రలుకు తలకు మించిన భారం కావడంతో, పిల్లల చదవులు పదితోనే ఆగిపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాఠశాల స్థాయిలోనే ఇంటర్మీడియట్ కోర్సులను ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేశారు. తొలుత జిల్లాకి ఒక హైస్కూల్ని ఎంపిక చేసి ‘హైస్కూల్ ప్లస్’ పేరుతో ఇంటర్మీడియట్ కోర్సులను రేండేళ్ల కిందట ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో వాటిని విస్తరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో మరో ఏడు హైస్కూళ్లను ‘హైస్కూల్ ప్లస్’గా అప్గ్రేడ్ చేశారు. నాలుగు గ్రూప్లు.. ఇంటర్మీడియట్ గ్రూపుల్లో ప్రధానంగా డిమాండ్ ఉన్న నాలుగు గ్రూపులను పాఠశాలల్లో నిర్వహిస్తారు. అయితే ప్రతి స్కూల్లో ప్రవేశాల సరిపడా ఉన్న రెండు గ్రూప్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. ప్రతి గ్రూప్లో 40 మందికి ప్రవేశం కల్పిస్తారు. మౌలిక సదుపాయాలు తొలి విడతగా అమలు చేస్తున్న ఏడు ‘హైస్కూల్ ప్లస్’ స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువులకు అవసరమైన అన్ని హంగులు ఏర్పాటు చేశారు. లైబ్రరీ, సైన్స్ గ్రూపులకు అవసరమైన లేబరేటరీలు ఏర్పాటు చేశారు. కనీసం రెండు ఎకరాల విస్తీర్ణమున్న విశాలమైన క్రీడా మైదానాలు ఈ స్కూళ్లలో ఉన్నాయి. ఆయా మండల పరిధిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ స్కూళ్లు వరంగా మారనున్నాయి. సర్కార్ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చదువులు బడుగు, బలహీనవర్గ విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య ఏడు స్కూళ్లలో ఈ ఏడాది నుంచే అమలు 40 సీట్ల వంతున రెండేసి కోర్సులతో ప్రారంభం ప్రవేశాల కోసం ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ ఈ విద్యాసంవత్సరం నుంచి ‘హైస్కూల్ ప్లస్’ స్కూళ్లుగా మారనున్న ఏడు పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నాం. ఆయా స్కూళ్ల పరిసర గ్రామాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. పదో తరగతి తర్వాత ఏ ఒక్కరూ చదువు మానేసే పరిస్థితి రాకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. –ఎన్.ప్రేమకుమార్, డీఈఓ ఈ ఏడాది నుంచే అమలు.. జిల్లాలో వివిధ యాజమాన్యాలకు చెందిన దాదాపు 300 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇప్పటికే కేజీబీవీలలో, మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ఏడు మండలాలను తీసుకొని వాటిలో కో–ఎడ్యుకేషన్గా ఇంటర్మీడియట్ చదువులను అందుబాటులోకి ఈ ఏడాది నుంచి తీసుకువచ్చారు. విజయనగరం డివిజన్ పరిధిలోని జామి, బొండపల్లి.. బొబ్బిలి డివిజన్ పరిధిలోని రామభద్రపురం, పిరిడి.. చీపురుపల్లి డివిజన్ పరిధిలో తెట్టండి, కోనూరు, ఏ వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ‘హైస్కూల్ ప్లస్’లుగా తీర్చిదిద్దారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు సాలూరు: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ వాసునాయుడు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు పట్టణంలోని పంటలవీధిలో నివాసముంటున్న త్రిమూర్తులు (50) పచ్చళ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పచ్చళ్ల విక్రయానికి ద్విచక్ర వాహనంపై మక్కువ మండలం నంద గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కూర్మరాజుపేట జంక్షన్ వద్దకు వచ్చేసరికి.. ఐస్ వ్యాపారి సూరజ్కుమార్ బంగారమ్మపేట నుంచి సాలూరు వైపు వెళ్తూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. సూరజ్కుమార్యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముత్తాయవలసలో చైన్ స్నాచింగ్.. బొబ్బిలి: మండలంలోని ముత్తాయవలసలో మహిళ మెడలోని గొలుసును తెంచుకు పోయిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై జి. లోవరాజు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బలగ లక్ష్మి గ్రామ శివారున ఉన్న బావి వద్దకు నీళ్ల కోసం వచ్చింది. ఈ సమయంలో బైక్పై హెల్మెట్తో పాటు ముసుగు వేసుకుని వచ్చిన ఓ అగంతుకుడు తాగేందుకు మంచి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె నీళ్లు పడుతుండగానే మహిళ ను కొట్టి తిరగేసి మెడలోని గొలుసు తెంచుకుపోయాడు. ఈక్రమంలో జరిగిన పెనుగులాట లో బాధితురాలి చేతిలో అరతులం, దొంగ చేతి లో తులం గొలుసు ఉండిపోయాయి. బాధితు రాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జి. లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివిల్స్ అభ్యర్థులకు అండగా సుశీలమ్మ ఫౌండేషన్ రాజాం సిటీ: సివిల్స్ చదవాలన్న ఆసక్తి ఉండి సరైన అవకాశాల్లేని విద్యార్థులకు లోలుగు సుశీలమ్మ ఫౌండేషన్ సువర్ణావకాశం కల్పిస్తోంది. ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తూ విద్యార్థులకు చేదోడుగా నిలుస్తోంది. గతేడాది ఇదే తరహాలో 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఢిల్లీలో సివిల్స్లో శిక్షణ ఇప్పించింది. ఈ ఏడాది కూడా 2022, 23, 24 సంవత్సరాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. జూన్ 30న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు కోచింగ్, వసతి కోసం ఒక్కొక్కరికి రూ. 4 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్టీటీపీ:// ఏపీఎస్ఎస్ఏ. ఏపీటీఓఎన్ఎల్ఐఎన్ఈ.ఐఎన్/ పీఆర్ఈఆర్ఏఎన్ఏ/ ఐఎన్డీఈఎక్స్. పీహెచ్పీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. పరీక్ష ఫీజు కింద వంద రూపాయలు చెల్లించాలి. అయితే పరీక్షకు హాజరైన వారికి ఆ నగదు తిరిగి ఇచ్చేస్తారు. పరీక్షను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వారిచే నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 80744 02554 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లే కీలకం
కట్టుదిట్టమైన భద్రత ● ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈవీఎంల రవాణాకు బారికేడ్లు ఏర్పాటు ఉంటుంది. ● రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోనికి అనుమతిస్తారు. ● మూడంచెల భద్రతలో భాగంగా మొదటిగా 100 మీటర్ల పాదచారుల జోన్ ఉంటుంది. ఇందులో సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును సీనియర్ మేజిస్ట్రేట్ పరిశీలించి అనుమతిస్తారు. ● రెండో అంచెలో ఆయా వ్యక్తులను రాష్ట్రసాయుధ పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, మొబైల్ ఫోన్లు లేవని నిర్ధారించుకున్న తరువాత విడిచి పెడతారు. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ● మూడో అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తనిఖీ చేస్తాయి. కౌంటింగ్ హాలు లోపలకు కెమెరా స్టాండ్ను అనుమతించరు. చేతి కెమెరాకు మాత్రమే అనుమతి ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో కచ్చితత్వం పాటించాలి. ● ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకూ మొత్తం బాధ్యత రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. విజయనగరం అర్బన్: జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తోంది. లెక్కింపు ప్రక్రియపై 1,043 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఎన్నికల నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించింది. కౌంటింగ్కు అభ్యర్థుల తరఫున హాజరయ్యే ఏజెంట్లకు లెక్కింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన అవసరమని, అప్పుడే లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఇలా.. ● కౌంటింగ్ సిబ్బందిని తప్ప ఇతరులెవ్వరినీ ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలోకి అనుమతించరు. ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ జీవీ, లెండి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణాల్లోకి ఎటువంటి వాహనాలకూ అనుమతి ఉండదు. ● కౌంటింగ్ కేంద్రాల్లోనికి రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) తప్ప ఇతరుల మొబైల్ ఫోన్లను అనుమతించరు. ● ఆర్వోలు తమ మొబైల్ ఫోన్ ద్వారా రౌండ్ల వారీ సమచారం ఇవ్వాలి. ఆర్వోలు డిజిగ్నేటెడ్ అధికారిని నియమించుకుని వారి ద్వారా మీడియా విభాగానికి సమాచారం చేరవేయాలి. ● కమ్యూనికేషన్ విభాగంలోని అధికారులు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఎస్టీడీ, ఫ్యాక్స్, ప్రింటర్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచుతారు. ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమచారం అందించేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్తో పాటు ఒక హాట్ లైన్ ఏర్పాటు చేస్తారు. ● ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో గరిష్టంగా 14 మంది ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. ● ఫారం 17సీలో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరి చూస్తారు. ఆ సంఖ్యను కౌంటింగ్ సిబ్బంది ఫారం–17సీ పార్ట్–2 లో నోట్ చేసుకుని ఏజెంట్ల సంతకం తీసుకుంటారు. ● ఆ తర్వాత ఈవీఎంల సీల్ తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ● ఆ వివరాలను కౌంటింగ్ సిబ్బంది నోట్ చేసి, ఆ సంఖ్యను ఏజెంట్లందరికీ చూపించి వారి సంతృప్తి వ్యక్తం చేశాకే రౌండ్ ఫలితాలను వెల్లడించాలి. ● ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చా యనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో తీసి భద్రపరుస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ జీవీ, లెండి కళాశాల ప్రాంగణాల్లో కౌంటింగ్ సెంటర్ల కోసం ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ కోసం 14, ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల వంతున ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉండి ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ అర్హతలు పోస్టల్ బ్యాలట్లను ముందుగా లెక్కిస్తారు. ఒక నియోజకవర్గానికి ఒక ఏఆర్ఓ, కౌంటింగ్ పరిశీలకుడు, ఇద్దరు కౌంటింగ్ సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేశారా? లేదా, సంతకం, డిక్లరేషన్, సీరియల్ నంబర్, ఓటరు సంతకం, సీరియల్ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్గా గుర్తిస్తారు. వ్యాలిడ్ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలపై అవగాహన తప్పనిసరి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటు రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన -
స్ట్రాంగ్ రూమ్ను సందర్శించిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ ఎం.దీపిక శనివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడంచెల భద్రత, గార్డ్స్ పనితీరును తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రామతీర్థానికి పోటెత్తిన భక్తులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసం, శనివారం కలిసి రావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలు భక్తులు విచ్చేసి శ్రీరామచంద్రస్వామిని, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమా సదాశివుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్మపథం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు కళాకా రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి భజనలు ఆకట్టుకున్నాయి. ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది (99.57 శాతం)ఉత్తీర్ణత సాధించారు. బీఏ(సీబీసీఎస్)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్)లో 98.66, బీకాం (కంప్యూటర్స్)లో 99.71, బీకాం(జనరల్)లో 99.92, బీహెచ్ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్ సైన్స్లో 100, బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీలో 100, బ్యాచలర్ ఆఫ్ ఓకేషన్లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు. -
చిన్నారులపై దాడి
సంతకవిటి: మండల పరిధిలోని డోలపేటలో పాత జనసేన కార్యాలయం దగ్గర ఇద్దరు చిన్నారులపై దాడి చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితులు, ఎస్సై షేక్ శంకర్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బండి జశ్వంత్కుమార్ (14), బండి శేఖర్(13) అన్నదమ్ములు. తమ మేనత్త రాజాంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో పరామర్శకు వచ్చారు. ఈ క్రమంలో డోలపేటలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ని రాజు కార్యాలయం వద్ద నిలిపిన కారు అద్దాలు చూస్తుండగా.. ఎన్నిరాజు అనుచరులు అనుమానంతో చిన్నారులను కొట్టారు. తర్వాత వారిని కార్యాలయంలోకి తీసుకెళ్లగా.. అక్కడ ఎన్ని రాజు కూడా చిన్నారులపై చేయి చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు రాజాం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కొరియర్ పేరుతో సైబర్ మోసాలు
పార్వతీపురంటౌన్: ఫెడెక్స్ కొరియర్ పేరతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రత్తంగా ఉండాల్సిందేనని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇన్నాళ్లూ ఉద్యోగం, వ్యాపారం, చలానాలు, ఆఫర్లు అంటూ మోసం చేసేవారని, ఇప్పుడు కొరియర్ పేరిట కొత్త మోసాలకు తెరతీస్తున్నారన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాదికి ఫెడెక్స్ కొరియర్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాం... మీరు ముంబయి నుంచి థాయ్లాండ్కు పంపించిన పార్సిల్లో డ్రగ్స్తో పాటు ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ దాదాపు రూ.15 లక్షలు కాజేశారన్నారు. తమ సంస్థ పేరుతో జరుగుతున్న మోసాలపై ఫెడెక్స్ సైతం స్పందించిందన్నారు. ఫోన్కాల్స్ ద్వారా తాము ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం కోరబోమని తెలిపిందన్నారు. ఎవరైనా వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్లు, మెసేజ్ చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని సూచించారు. అనుమానాస్పదంగా అనిపించే ఫోన్ కాల్స్కు స్పందించవద్దన్నారు. యూపీఐ పిన్, ఐడీ లాంటి సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దని తెలిపారు. అధికారిక ఫెడెక్స్ వెబ్సైట్లో మాత్రమే స్టేటస్ను చెక్ చేయాలన్నారు. -
పట్టపగలే చోరీ
● ఆందోళనలో ప్రజలు గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి ప్రాజెక్ట్ బోటు షికారు పరిసరాలలో కొంతమంది దుండగులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. దళాయివలసకు చెందిన ఎస్.నారాయణరావు ఖడ్గవలస వైపు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి నారాయణరావు ద్విచక్ర వాహనం ఆపి ఆయన మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు దోచుకుని పారిపోయారు. వెంటనే నారాయణరావు గట్టిగా కేకలు వేసినా పరిసరాల్లో ఎవ్వరూ లేకపోవడంతో దొంగలు పరారయ్యారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా పలుమార్లు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోగొట్టుకున్న సెల్ అందజేత విజయనగరం క్రైమ్: వయోజన విద్యాశాఖలో సూపర్వైజర్గా పనిచేస్తున్న గెద్ద జయరామ్, అతని సోదరి హేమలత (ఉపాధ్యాయురాలు) శుక్రవారం ఉదయం పట్టణంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. సుమారు లక్ష రూపాయల విలువ చేసే ఐ ఫోన్ దొరికింది. ఇంతలో సెల్ఫోన్ పొగొట్టుకున్న బాధితుడు ధీరజ్కుమార్ టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫోన్ దొరికిన తర్వాత అందులో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగా.. బాధితుడు టూటౌన్లో ఉన్నట్లు తెలుసుకున్న జయరామ్, అతని సోదరి హేమలత స్టేషన్కు వెళ్లి పోలీసుల సమక్షంలో ఫోన్ అందజేవారు. కార్యక్రమంలో ఏఎస్సై పైడితల్లి, తదితరులున్నారు. మద్యం సీసాలు ధ్వంసం పార్వతీపురం టౌన్: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ ఎకై ్స్జ్ కేసుల్లో సీజ్ చేసిన 576 మద్యం బాటిళ్లను శుక్రవారం ధ్వంసం చేశారు. పార్వతీపురం ఏఎస్పీ సునీల్ షరైన్ సమక్షంలో మద్యం ధ్వంసం చేశామని పట్టణ సీఐ కృష్ణారావు చెప్పారు. మద్యం అక్రమంగా తరలించినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. -
హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
బొబ్బిలి: మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన పాతినవలస తవిటినాయుడు (40) ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చదలవాడ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. తవిటినాయుడు తన భార్య లక్ష్మిపై అనుమానం పెంచుకుని ఇనుపరాడ్తో కొట్టి ఇటీవల హత్య చేశాడు. పైగా దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఇదే సమయంలో విచారణ చేపట్టిన పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడైన తవిటినాయుడును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా... బెయిల్పై ఇటీవల బయటకు వచ్చాడు. అయితే హత్య కేసులో ఇరుక్కుపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తవిటినాయుడు ఊరి చివరలో ఉన్న చెట్టుకు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎం. నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారం మనదే..
విజయనగరం అర్బన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా.. జీవన ప్రమాణాలు పెరిగేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలన అందించారు.. పూర్తి మెజారీటీతో మరలా అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఉంది... 9వ తేదీన రెండో సారి ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విశాఖ వేదికగా ప్రమాణస్వీకారం చేస్తారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నా రు. విజయనగరం పట్టణంలోని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా తీసుకున్న ప్రతి నిర్ణయం విజయానికి బాసటగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆత్మగౌరవా న్ని పెంపొందించేలా సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. పేదరిక నిర్మూలన, విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. వైద్యశాఖలోని అన్ని ఖాళీలను భర్తీచేసి ప్రజలకు ఆరోగ్యభరోసా కల్పించినట్టు వివరించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, టోఫెల్, సీబీఎసీఈ సిలబస్లో విద్య, డిగ్రీ స్థాయిలో ఇంటెన్షిప్ విధానంతో ఉద్యోగ కల్పన, అంతర్జాతీయ విద్యా సంస్థలో ఎడెక్స్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు 100 యూనివర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందించడం, ప్రతి తరగతిలో స్మార్ట్ టీవీలతో డిజిటల్ విద్యాబోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్లు ఇవ్వడం.. రూ.1.25 కోట్ల వరకు ఉచితంగా ఫీజులు చెల్లించే విదేశీ విద్యా పథకం.. టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన ఫలితాలు రావడం వంటివి జగన్మోహన్రెడ్డి పాలనలో అందరికీ స్పష్టంగా కనిపించే మార్పులన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలన నచ్చితే ఓటేయాలని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. ఆయన మాటకు విలువనిచ్చి ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారన్నారు. అందుకే ఉమ్మడి విజ యనగరం జిల్లాలోని అన్ని సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. జూన్ 4 వరకు సంయమనం పాటించాలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకు ముందె న్నడూలేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నామని, ఇప్పటి ఎన్నికల్లో జరుగుతోన్న దాడులు, అల్లర్లను ఏనాడూ చూడలేదని మంత్రి బొత్స అన్నారు. ప్రధాన పార్టీల నేతలంతా రీకాల్స్ మూడ్లో ఎవరికి వారు విదేశాలకు వెళ్లారని, ఆయా పార్టీల కేడర్ కూడా ఎన్నికల ఫలితాలొచ్చేదాకా రాజకీయాలను పక్కనబెట్టి కాస్త సంయమనం పాటించడం మంచిదన్నారు. ఇకనైనా ఈ దాడులు, అల్లర్లు ఆపాలని, సోషల్ మీడియాలో అనవసరంగా ట్రోలింగ్లు పెట్టవద్దని కోరారు. జూన్ 4 వరకూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డిప్యూటీ స్వీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. జూన్ 9న విశాఖపట్నంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మంత్రి బొత్స సత్యనారాయణ -
అరగంట ముందే చేరుకోవాలి..
విజయనగరం అర్బన్ : ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షకు అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఆర్ఓ ఎస్డీ అనిత తెలిపారు. అభ్యర్థులను 7.30 నుంచి 8.30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఆమె తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శనివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 1470 మంది హాజరు కానున్నారని తెలిపారు. జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాంలో 300 మంది, ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, చింతలవలసలో 250 మంది, అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భోగాపురం మండలంలో 170 మంది, బొబ్బిలిలోని స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో 90 మంది, సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో 150 మంది, సీతం కాలేజీ, కొండకరకాంలో 510 మంది పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. రాజాం పరీక్ష కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 5.30, 6 గంటలకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టిక్కెట్తో పాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. డీఆర్ఓ అనిత నేడు డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
బొబ్బిలి: రోడ్డు ప్రమాదంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై జి. భాస్కరరావు తెలియజేసిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన పెంకి వినయవర్థన్(13), కేరళలో ఇంజినీరింగ్ చదువుతున్న మెరకముడిదాం మండలం గర్భాం గ్రామానికి చెందిన వెమ్మల పవన్ బొబ్బిలి మండలం కారాడలో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వీరివురూ బొబ్బిలి వైపు బైక్పై వెళ్తుండగా అలజంగి చెరువు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరూ కిందపడిపోయారు. బైక్పై వెనుక కూర్చున్న వినయ వర్థన్ తలకు బలమైన గాయాలు కాగా.. పవన్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ఇద్దరినీ బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. వినయవర్థన్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వినయ్వర్థన్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రత్నాలమ్మ వ్యవసాయ కూలీలు కాగా వీరికి ఇద్దరు పిల్లలు. వినయ్ వర్థన్కు అక్క ఉన్నట్టు బంధువులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై భాస్కరరావు తెలిపారు. చికిత్స పొందుతూ బాలుడు..గజపతినగరం రూరల్: మండలంలోని గంగచోళ్లపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నాటుబండి నుంచి కిందకు పడిపోవడంతో అఖిల్కు తీవ్రగాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సబ్జైల్ సందర్శన శృంగవరపుకోట: ఎస్.కోట సబ్జైల్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్ పరిసరాలను పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడుతూ నేరాన్ని అలవాటుగా చేసుకోరాదని, సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.విజయకళ్యాణి, ఎస్.కోట సబ్జైల్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తతే ప్రధానం విజయనగరం క్రైమ్: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ ఎం.దీపిక సూచించారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తును శుక్రవారం పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. తొలిరోజు ప్రశాంతం ● టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం విజయనగరం అర్బన్: పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదోతరగతి తెలుగు పరీక్షకు 1,218 మందికి 489 మంది మాత్రమే హాజరైనట్టు డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ సంప్లిమెంటరీ పరీక్షల్లో తొలి రోజు ఉదయం మొదటి సంవత్సర తెలుగు–1, సంస్కృతం–1, హిందీ–1, ఒకేషనల్–1 పరీక్షకు 3,542 మందికి 3,320 మంది హాజరయ్యారని ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం తెలుగు–2, సంస్కృతం–2, హిందీ–2, ఒకేషనల్–2 సబ్జెక్టు పరీక్షలకు 969కి 883 మంది హాజరయ్యారు. సజావుగా డీఈఈ సెట్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన డీఈఈ సెట్–2024 ప్రవేశ పరీక్ష స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షకు 256 మంది హాజరుకావాల్సి ఉండగా 228 మాత్రమే పరీక్ష రాసినట్టు డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. -
ఘీం‘కరి’ంచేవెన్నో!
● జిల్లాలో ఉన్న ఏనుగుల లెక్కింపు ● ఒకేసారి దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులపాటు లెక్కింపు సర్వే జిల్లాలో 1.07 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 60 శాతం ఆర్వోఎఫ్ఆర్ కిందే ఉంది. ఒడిశా సరిహద్దు ప్రాంతంతో కలసి ఉన్న మన్యం జిల్లాలో కొంతకాలంగా ఏనుగులు ఇటు ప్రజలకు, అటు అటవీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టం, పంట పొలాల ధ్వంసం సంభవించాయి. పలు కారణాలతో ఏనుగులు మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. ప్రస్తుతం రెండు గుంపులుగా 11 ఏనుగులు జిల్లాలో సంచరిస్తున్నాయి. మొత్తంగా ఏనుగుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? అన్న విషయాలను సర్వే ద్వారా ఒక నిర్ధారణకు వస్తారు. మూడు రోజులూ మూడు దశల్లో సర్వే నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అటవీ సిబ్బంది సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్జాగ్ విధానంలోనూ, రెండోరోజున రెండు కిలోమీటర్ల మేర నిటారు లైనులో, మూడోరోజున నీటి కోసం వచ్చే కుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాపు కాసి గుర్తించడం చేస్తున్నారు. ఏనుగుల అడుగు జాడలు, మలమూత్ర విసర్జన, సమూహం, పరిణామం ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు. కనిపించిన ఏనుగులను ఫొటోలు తీస్తారు. అవయవాలు, లింగ నిర్ధారణ ద్వారా గుర్తించి వివరాలు నమోదు చేసుకోవడం సర్వేలోని ప్రధాన భాగం. అనంతరం కేంద్ర అటవీశాఖకు నివేదికను సమర్పిస్తారు. మూడు దశల్లో... -
No Headline
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో కరిరాజుల లెక్క తేల్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. మూడు రోజులపాటు వీటి గణన చేపడుతోంది. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు.. కొత్తగా ఏమైనా చేరాయా? అన్న వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర నిపుణులతో పాటు జిల్లా ఏనుగుల పరిరక్షణ రేంజర్, ఆయా ప్రాంతాల అటవీ సిబ్బంది కలిసి సర్వే చేపడుతున్నారు. ఈ నెల 23న మొదలైన సర్వే.. 25వ తేదీతో ముగియనుంది. ● దక్షిణాది రాష్ట్రాల్లో ఒకేసారి.. మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నీ సంయుక్తంగా ఒకేసారి ఈ సర్వే చేపడుతున్నాయి. ఆంధ్రాతో పాటు, కర్నాటక, తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఏనుగుల లెక్కింపు సర్వే నిర్వహిస్తున్నారు. ఒకేసారి చేపట్టడం వల్ల ఏనుగులు అటూఇటూ ప్రయాణించినా, గణనలో తేడా రాదన్నది ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏనుగుల సంతతి పెరుగుతున్న క్రమంలో గత ఏడాది మే నెల 17 నుంచి 19వ తేదీ వరకు గణన చేపట్టారు. మరలా ఈ ఏడాది మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ● వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు గుర్తించిన ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు.. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులనూ సంరక్షించేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఏనుగులతోపాటు..అలుగు, పునుగుపిల్లి, కింగ్ కోబ్రా, కొండ చిలువలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో గ్రామీణ, గిరిశిఖర ప్రాంతాల్లో కొండచిలువలు కనిపించగానే గ్రామస్తులు భయంతో హతమారుస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కొండచిలువలు పార్వతీపురం, మక్కువ కొండ, వాగుల ప్రాంతాల్లో ఉన్నాయని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. అరుదైన జాతులు అంతరించిపోకుండా రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏనుగుల సర్వే చేపడుతున్నాం.. జిల్లాలో ఏనుగుల గణన చేపడుతున్నాం. మూడు రోజులపాటు ఇది ఉంటుంది. సర్వే పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అనంతరం వాటి రక్షణకు చర్యలు తీసుకుంటాం. వాటితోపాటు, వన్యప్రాణుల సంరక్షణ కూడా ముఖ్యమే. ఎక్కడైనా వన్యప్రాణులు కనిపిస్తే గ్రామస్తులు సంహరించవద్దు. అటవీ శాఖాధికారులకు సమాచారం అందించాలి. అరుదైన జాతులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారిణి బాసంగిలో ఏనుగులు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి ముంపు ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఏనుగులు జలకాలాడాయి. సాయంత్రానికి అరటి, పామాయిల్ తోటలోకి జారుకున్నాయి. అరటి పంటను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో పంటను నాశనం చేయడంతో ఆవేదన చెందుతున్నారు. -
రైతన్నకుఉపాధి అండ
రైతుకు మేలు పండ్ల తోటలు, టేకు మొక్కల పెంపకానికి ఉపాధిహామీ పథకం నిధులు కేటాయించడం రైతుకు లాభదాయకం. కందకాల తవ్వకం మంచి ఆలోచన. ఉపాధిహామీ పథకం అధికారుల సూచనల మేరకు మా పొలాల్లో కందకాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాను. – కె.అప్పలనాయుడు, లక్ష్మీపురం, రేగిడి మండలం నీటి కుంటల ఏర్పాటుకు దరఖాస్తు చేశా పొలాల్లో నీటి కుంటల ఏర్పాటుకు ఉపాధిహామీ పనులు కల్పించడం, రైతులకే ఆ పనులు ఇవ్వడం సంతోషదాయకం. మా పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాను. పని మంజూరు చేశారు. నీటి కుంటల ఏర్పాటుతో నీటిని ఆదాచేయవచ్చు. – టంకాల రాంబాబు, పొగిరి, రాజాం మండలంరాజాం: ఉపాధిహామీ పనులు పల్లెల్లో జోరుగా సాగుతున్నాయి. లక్షలాది మంది వేతనదారులు ప్రతిరోజు పనుల్లో పాల్గొంటున్నారు. తాజా నిబంధనల ప్రకారం రైతన్నకు ఉపాధిహామీ పథకం అండగా నిలవనుంది. పొలాల్లో గట్లు బాగుచేయడం, బట్టి(కాలువ)ల్లో పూడికల తొలగింపు, నీటి కుంటల నిర్మాణం, చెట్ల చుట్టూ కందకాలు తవ్వడం, తోటల పెంపకానికి ఉచితంగా మొక్కల పంపిణీ, వాటి సంరక్షణకు అవసరమైన నిధులు ఉపాధిహామీ పథకం నుంచి మంజూరుకానున్నాయి. రైతుకు అవసరమైన పనుల ఎంపికకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే పనుల నిర్వహణపై ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. పనుల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పనులు ఇలా.. ఉపాధిహామీ పథకం కొత్త పనుల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. హార్టికల్చర్ ద్వారా 14 రకాల పండ్ల తోటల మొక్కలను రైతులకు ఉచితంగా అందజేస్తారు. చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు 60 నుంచి 70 వరకూ మొక్కలు ఇస్తారు. వీటిని పొలాల్లో నాటడంతో పాటు మూడేళ్లపాటు పెంచుకునేందుకు ఏడాదికి రూ.35 వేలు వరకూ నిధులను ఉపాధిహామీ పథకం నుంచి చెల్లిస్తారు. మూడేళ్ల అనంతరం మొక్కల ఫలసాయం ఆయా రైతులే పొందవచ్చు. టేకు మొక్కలు వేసుకునే రైతులకు కూడా హార్టికల్చర్ ద్వారా ఎకరాకు 200 టేకు మొక్కలను అందించనున్నారు. వీటిని నాటేందుకు, సంరక్షణ నిమిత్తం మూడేళ్లు నిధులు ఇస్తారు. పచ్చదనం ప్రధాన అంశంగా ఉపాధి హామీ పథకంలో రైతులు తమ పొలాలు చుట్టూ కందకాలు (ట్రెంచ్లు) తవ్వుకునేందుకు, పొలాలు గట్లు, పొలాల్లో ఉన్న చెట్లు, మొక్కలు చుట్టూ కందకాలు ఏర్పాటుకు ఉపాధి పథకం ద్వారా ఆయా రైతులకు నిధులు చెల్లించనున్నారు. ఒక్కోచోట ఈ పనులు ద్వారా రైతులకు అటు తమ పొలాలు వద్ద చెట్లు సంరంక్షించుకునే అవకాశం లభించడంతో పాటు రూ. 17 వేల వరకూ వేతనాలు ఉపాధి హామీ పథకం కింద లభించనున్నాయి. మరో వైపు ఈ కందకాల కారణంగా చెట్టుకు నీటి సదుపాయం లభిస్తుంది. పొలాల్లో నీటి కాలువలు ఏర్పడతాయి. ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చీడపీడలు వ్యాపించవు. ఎకరా నుంచి మూడెకరాలు వరకూ పంటపొలాలు ఉన్న రైతులు తమ మెట్ట ప్రాంత పొలాల్లో నీటి కుంటలు తవ్వుకునేందుకు నిధులు కేటాయిస్తున్నారు. 9 మీటర్లు వెడల్పు, 9 మీటర్లు పొడవుతో పాటు రెండు మీటర్ల లోతు మేర వీటిని తవ్వుకోవాలని, వీటి నిర్మాణాలకు ఆయా రైతులకు రూ. 50 వేలు వరకూ నిధులు వెచ్చిస్తామని ఉపాధిహామీ అధికారులు చెబుతున్నారు. ఈ నీటి కుంటల వల్ల వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు పొలాల్లో భూసారం పెరిగి, పలురకాల పంటలు నీటి కొరతలేకుండా పండించుకునే వీలుంది. కొత్త పనుల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 480 దరఖాస్తులు వచ్చినట్లు రాజాం ఏపీడీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కందకాలు, నీటి కుంటలు నీటి కుంటలు, కందకాల పనులకు ప్రాధాన్యం హార్టికల్చర్ నుంచి ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ పెంపకానికి ఉపాధిహామీ నిధుల చెల్లింపు మూడేళ్లపాటు మొక్కల సంరక్షణ బాధ్యత నీటి కుంటలతో వర్షపునీరు ఆదా జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకూ 480కిపైగా దరఖాస్తులు -
కంటెయినర్ ఢీకొని వివాహిత దుర్మరణం
తగరపువలస: ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా ఎల్.కోటకు చెందిన సావర్ల నవ్య అనే వివాహిత మృతి చెందింది. ఆనందపురం పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెద్దిపాలెం నారాయణ కళాశాలలో నవ్య కుమార్తె ఝాన్సీ చదువుతోంది. కుమార్తె ఫీజు చెల్లించడానికి గానూ కుమారుడు రాజు, కుమార్తెతో కలిసి ఆమె ద్విచక్రవాహనంపై పెద్దిపాలెం వస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి రాంచీ వెళుతున్న చాక్లెట్ల కంటెయినర్ గోకార్టింగ్ సమీపంలో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్య అక్కడికక్కడే మృతి చెందగా.. రాజు, ఝాన్సీ గాయపడ్డారు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ సునీల్ ఫిర్యాదుతో సీఐ టి.తిరుపతిరావు కేసు నమోదు చేస్తున్నారు. కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించడానికి వచ్చి మృత్యువాత -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయనగరం అర్బన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఓట్ల లెక్కింపు సజావుగా, సకాలంలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. లెండి కళాశాలలో చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మెప్మా పీడీ సుధాకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు.. జేఎన్టీయూ కేంద్రానికి డిప్యూటీ సీఈఓ రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. లెండి కళాశాలలో ఆర్అండ్బీ, జేఎన్టీయూలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలు ఏర్పాట్లు చేస్తాయన్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మూడు రోజులు ముందుగానే లెక్కింపు గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 6 గంటలకే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని.. వారికి అల్పాహారం, భోజన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సిబ్బంది, ఏజెంట్లు వారికి కేటాయించిన కౌంటింగ్ హాళ్లకు సులువుగా చేరుకునే విధంగా సైన్ బోర్డులు, డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, జెనరేటర్ను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది, ఏజెంట్లు లోపలికి వెళ్లి రావడానికి వీలుగా బారికేడ్లు, మెష్ల ద్వారా వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు చోట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఒక్కో అంబులెన్స్ను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. సిబ్బందికి, ఏజెంట్లకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను నిర్ణయించాలని సూచించారు. ఏజెంట్లు నగదు చెల్లించి తీసుకొనే విధంగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పాత్రికేయుల కోసం రెండు చోట్లా రెండు మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, పబ్లిక్ కమ్యూనికేషన్ సెంటర్లను వినియో గించుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్ఓ ఎస్డీ అనిత, వివిధ విభాగాల నోడల్ అధికారులు, వేదికల ఇన్చార్జ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి కావాలి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు రెండు కేంద్రాల వద్దా పబ్లిక్ కమ్యూనికేషన్ సెంటర్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి -
సీజనల్ వ్యాధులపై జరభద్రం..
విజయనగరం ఫోర్ట్: సీజనల్ వ్యాధుల వ్యాప్తి ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడ్డారు. వైరల్ జ్వరాలు, మలేరియా, డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. వైరల్ జ్వర పీడితులైతే వేలల్లో ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ వ్యాధి నిర్ధారణ మాత్రం విజయనగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, రాజం ఏరియా ఆస్పత్రుల్లో చేస్తున్నారు. వేసవి కాలం ముగియనున్న సమయంలో వ్యాధుల వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందుస్తు నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు కూడా వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 67, 344 జ్వరాల కేసులు.. జిల్లాలో జనవరి నెల నుంచి మార్చి నెలఖారు నాటికి 67, 344 జ్వరాల కేసులు నమోదయ్యాయి. 820 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించగా అందులో 41 మందికి డెంగీ నిర్ధారణ అయింది. 67, 344 మందికి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 120 మలేరియా పాజిటివ్ వచ్చింది. మలేరియా.. తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు. మలేరియా జ్వరం తగ్గిన తర్వాత మళ్లీ వస్తుంది. జ్వరం తగ్గిపోయిన తర్వాత మళ్లి వచ్చినట్టు అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ కాటు వల్ల వస్తుంది. దోమ కాటు వల్ల దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్ శరీరంలోకి వెళ్తాయి. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది. ఈ దోమ నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మలేరియా నివారించడానికి దోమ తెరలు వినియోగించుకోవాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయాలి. డెంగీ.. జ్వరంతో పాటు తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటాయి. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం కలగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు, ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్టు చిన్న చిన్న మొటిమలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది. ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటు వల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పడు ఒళ్లుంతా దద్దర్లు కనిపిస్తాయి. ఇళ్లల్లోని కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంక్లు, ఎయిర్ కూలర్లు, ఇళ్ల పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కుప్పలు, పగిలిన సీసాలు, టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి దోమ పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇంటి పరసర ప్రాంతాల్లో వృథా నీటిని నిల్వ ఉంచరాదు. పెంట కుప్పలు, ఇంట్లో వచ్చే చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇళ్లలో ఉన్న అన్ని గదుల్లో దోమల మందు పిచికారీ చేయించాలి. దోమ తెరలు వాడటం లేదా ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిల్వ చేసే పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి మరలా నింపు కోవాలి. ప్రారంభమైన వ్యాధుల వ్యాప్తి 67,344 జ్వరాల కేసులు నమోదు 120 మలేరియా కేసులు, 41 డెంగీ కేసులు కూడా..అప్రమత్తంగా ఉన్నాం.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్వర పీడితుల వద్ద శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ఎస్. భాస్కరరావు, డీఎంహెచ్ఓ -
27 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
విజయనగరం రూరల్: పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని విజయనగరం ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జె.ఆశారమణి గురువారం తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ప్రాసెసింగ్ రుసుం మీసేవలో గాని, ఆన్లైన్లో గాని చెల్లించి, సంబంధిత రసీదును తీసుకురావాలన్నారు. పాలిసెట్ పరీక్ష హాల్టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణపత్రం, రాబడి, కుల ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూల్బాగ్లో ఉన్న ఎంఆర్ఏజీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద యం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీవరకు కౌన్సెలింగ్ జరుగుతుందని, ఈ నెల 31 నుంచి జూన్ 04 వరకు ఆఫ్సన్స్ ఎంపిక, జూన్ 7న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
నాతో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదు: హీరో
మాట నిలబెట్టుకున్న గుల్మోహర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
‘ఆధార్’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
దూసుకొస్తున్న రెమాల్ తుపాను
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్ల..!
తప్పక చదవండి
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- IPL 2024: రైజర్స్ VS రైడర్స్
Advertisement