టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు | Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు

Published Mon, May 6 2024 10:14 AM

Terror Threat To T20 World Cup 2024 In West Indies From North Pakistan Says Report

పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు (కరీబియన్‌ దీవులు) ఉత్తర పాకిస్తాన్‌ ప్రాంతం నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. 

పొట్టి ప్రపంచకప్‌ సహా పలు ఇతర క్రీడా కార్యక్రమాలపై దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు తెలుస్తుంది. ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు ప్రారంభించాయి. తమ మద్దతుదారులంతా యుద్ధరంగంలో చేరాలని పిలుపునిస్తున్నాయి.

ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చింది. టోర్నీకి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని ప్రకటించింది. క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్స్ హామీ ఇచ్చారు.

కాగా, టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ కూడా ఆతిథ్యమిస్తుంది. జూన్‌ 1 నుంచి ఈ క్రికెట్‌ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌ యూఎస్‌ఏలోని డల్లాస్‌ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ జట్టు.. వారి పక్క దేశమైన కెనడాతో తలడనుంది. 

మెగా టోర్నీ భారత్‌ ప్రస్తానం జూన్‌ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్‌లో బిగ్‌ ఫైట్‌, దాయాదుల సమరం జూన్‌ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement