ములకలచెరువు: ఓటు బ్యాంకు రాజకీయాలు టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలి, ప్రజల్లో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను ఏదో విధంగా అడ్డుకోవాలి, గొడవలకు ప్రేరేపించి ప్రచారాన్ని అడ్డుకుంటే వైఎస్సార్సీపీ నాయకులు సహనం కోల్పోయి గొడవలకు దిగుతారు, తద్వారా తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. వైఎస్సార్సీపీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇది తెర వెనుక పచ్చ నాయకులు చేస్తున్న కుట్రలు. ఇందుకు అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాదరణను చూసి జీర్ణించుకోలేక అక్కడక్కడ టీడీపీ సానుభూతి పరులు కుట్రలు పన్నుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్తి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకగా మారింది. ఎలాగైనా ప్రజల్లో చెడ్డుపేరు తెచ్చేందుకు టీడీపీ సానుభూతి పరులు డ్రామాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగానే ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగోళ్లపల్లెలో ఆదివారం తెరలేపారు. ఈ పల్లెలో సుమారుగా 30 కుటుంబాలు ఉంటాయి. గతంలో 70 శాతం టీడీపీకి చెందినవారే. 20 ఏళ్లుగా ఈ ఊరికి తారు రోడ్డులేదు, సీసీ రోడ్లు, తాగునీటి బోరుసైతం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కుటాగోళ్లపల్లెకు వెళ్లిన ఎమ్మెల్యేకు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీచేసి పనులు పూర్తి చేయించారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యలు పరిష్కరించడంతో అక్కడి ప్రజలు వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారారు. దీంతో ఓర్వలేక కొందరు టీడీపీ వారు అప్పుడప్పుడు గ్రామంలో గొడవలు లేపేవారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో వేపూరికోటలో ప్రచారం ముగించుకొని కుటాగోళ్లపల్లెలోకి వెళ్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి భార్య కవితమ్మ ప్రచారం మొదలు పెట్టారు. కళ్యాణి అనే మహిళకు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంతలోనే కళ్యాణి అనే మహిళ మా ఊరిలో తాగునీరు రాలేదు, వీధి లైట్లు లేవని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తర్వాత పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్కనే ఉన్న గ్రామ సర్పంచ్ సునీతమ్మ సైతం ఆదేమాట చెప్పారు. ముందుగానే పథకం రచించిన టీడీపీ సానుభూతిపరులు కళ్యాణి ఆమే భర్త మల్లికార్జును అడ్డుపెట్టుకొని పలువురు గొడవకు దిగారు. పరిష్కరించకపోతే మీరు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారు అంటూ అత్యుత్సాహం ప్రదర్శిచారు. గ్రామస్తులు అదుపు చేయడానికి వారించినా లెక్క చేయకుండా వైఎస్సార్సీపీ వారిపైకి దూసుకొచ్చారు. గంట పాటు వారు కేకలు వేస్తూ ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. సమాచారం అందుకున్న ఎస్ఐ తిప్పేస్వామి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని నిలవరించే పనిలో నిమగ్నమయ్యారు. అయినా పోలీసుల మాటలు సైతం పట్టించుకోకుండా ఘర్షణను తలపించేలా చేశారు. ఈ ఘర్షణ వాతావరణంలో తోపులాటలో కళ్యాణి(28) కిందపడిపోయింది. ఇంక చేసేదిలేక కల్యాణిపై దాడి చేశారంటూ 108ను పిలిపించి మదనపల్లె జిల్లా హాస్పిటల్కు తరలించి డ్రామాకు తెర లేపా రు. అక్కడి వైద్యులు చికిత్స చేసి సురక్షితంగా ఉందని గ్రామ ప్రజలు చెబుతున్నారు.
ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే
అభ్యర్థి భార్యపై అనవసరంగా గొడవకు దిగిన మహిళ
వైఎస్సార్సీపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్లాన్
కుటుంబ సభ్యుల తోపులాటలో కిందపడిన మహిళ
పోలీసుల రంగప్రవేశంతో ఆసుపత్రికి తరలించి దాడి చేశారని డ్రామాకు తెరలేపిన టీడీపీ నాయకులు