IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన | BCCI Announces Big Cash Reward For IPL's Unsung Heroes, Jay Shah Post Viral | Sakshi
Sakshi News home page

BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన

Published Mon, May 27 2024 11:54 AM | Last Updated on Mon, May 27 2024 12:11 PM

BCCI Announces Big Cash Reward For IPL's Unsung Heroes, Jay Shah Post Viral

పొట్టి క్రికెట్‌ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించింది.

ప్యాట్‌ కమిన్స్‌ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌ చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌ సన్‌రైజర్స్‌కు రూ. 12.5 కోట్లు అందాయి.

 

అన్‌సంగ్‌ హీరోలకు భారీ నజరానా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్‌సంగ్‌ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.

గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్‌ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్‌ కావడానికి గ్రౌండ్‌ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.

వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.

ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఐపీఎల్‌ మ్యాచ్‌లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్‌ చేశారు.

వేదికలు ఇవే
కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌లో ముంబై(ముంబై ఇండియన్స్‌), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్‌), చెన్నై(చెన్నై సూపర్‌ కింగ్స్‌), కోల్‌కతా(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌), చండీఘర్(పంజాబ్‌ కింగ్స్‌)‌, హైదరాబాద్(సన్‌రైజర్స్‌)‌, బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్‌ జెయింట్స్‌), అహ్మదాబాద్(గుజరాత్‌ టైటాన్స్‌)‌, జైపూర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్‌ రాయల్స్‌), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్‌), ధర్మశాల(పంజాబ్‌ కింగ్స్‌)‌ మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.

చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్‌: కమిన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement