BCCI
-
ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్
-
IPL 2025: కోల్కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరిగే ఫైనల్తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు (7 లీగ్ మ్యాచ్లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో; మార్చి 30న సన్రైజర్స్ హైదరాబాద్తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్కతాలో జరగనున్నాయి. » లీగ్లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లోని ఒక జట్టు తమ గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
కటక్ వన్డేలో ఫ్లడ్ లైట్ల సమస్య.. బీసీసీఐపై ఎదురుదాడికి దిగిన పాక్ అభిమానులు
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించారు.ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు. ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్కు మార్చాలని కోరారు.భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు. -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
బుమ్రా ఫిట్గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్నెస్పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్నెస్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
BCCI: రోహిత్ శర్మకు డెడ్లైన్?.. కోహ్లికి మాత్రం గ్రీన్సిగ్నల్?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికే సమయం సమీపిస్తోందా?.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో భారత్ను చాంపియన్గా హిట్మ్యాన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో అతడు చేసిన పరుగులు 58, 64, 35. వైట్బాల్ క్రికెట్లో ఈ మేర ఫర్వాలేదనిపించినా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.కెప్టెన్గానూ చెత్త రికార్డుతొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో తేలిపోయిన రోహిత్ శర్మ.. కెప్టెన్గానూ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో భారత్ కివీస్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో ఇంతటి పరాభవం చవిచూసిన తొలి భారత కెప్టెన్గా హిట్మ్యాన్ నిలిచాడు.అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లోనూ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఫామ్లేమి కారణంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 3-1తో ఓడిపోయింది.రోహిత్ శర్మకు డెడ్లైన్ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో తాను రిటైర్ కాబోనని ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్పష్టం చేశాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోహిత్ శర్మకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం.రోహిత్ శర్మ వయసుతో పాటు.. 2027 వన్డే వరల్డ్కప్ నాటికి జట్టును సన్నద్ధం చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేర అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్తో వన్డేలు, చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో సెలక్టర్లు, బోర్డు పెద్దలు రోహిత్ శర్మతో సుదీర్ఘ చర్చలు జరిపారు.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. రానున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ సీజన్కు.. అదే విధంగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో యాజమాన్యానికి కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.కోహ్లికి మాత్రం గ్రీన్సిగ్నల్?!కాబట్టి ఇప్పటి నుంచే జట్టు పరివర్తనపై దృష్టి పెట్టింది. అన్నీ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని పేర్కొన్నాయి. అయితే, మరో దిగ్గజ బ్యాటర్, 36 ఏళ్ల విరాట్ కోహ్లి విషయంలో మాత్రం బీసీసీఐ మరికొన్నాళ్ల పాటు వేచిచూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డేతో సిరీస్తో బిజీగా ఉన్నారు. ఇరుజట్ల మధ్య నాగ్పూర్లో గురువారం తొలి వన్డేతో మూడు మ్యాచ్ల సిరీస్ మొదలుకానుంది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 4-1తో గెలుచుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు -
వరుణ్ చక్రవర్తికి వన్ డేల్లో ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ
-
టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025 ఛాంపియన్స్గా భారత జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ షో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టిన త్రిష.. అనంతరం బ్యాటింగ్లోనూ 44(నాటౌట్) సత్తాచాటింది. ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.బీసీసీఐ భారీ నజరానా..ఇక వరుసగా రెండోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టుకు రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆదివారం బోర్డు వెల్లడించింది. ‘విశ్వ విజేతలకు శుభాకాంక్షలు. అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టు సభ్యులకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం.రెండోసారి వరల్డ్కప్ గెలిచిన జట్టు, సహాయక సిబ్బంది రూ. 5 కోట్లు అందిస్తాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా టైటిల్ గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్కు చెందిన నౌషీన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్గా వ్యవహరించింది. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.జట్టంతా సమష్టిగా రాణించడంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 2023లో తొలిసారి జరిగిన అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కూడా అప్పట్లో బోర్డు రూ. 5 కోట్ల నజరానా అందించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
BCCI Naman Awards 2025: విజేతలు వీరే (ఫోటోలు)
-
28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
భారత మాజీ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(wriddhiman saha) అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ జట్టుతో శనివారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్తో సాహా ఆటకు గుడ్బై చెప్పాడు. "క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు అయ్యింది. 1997 నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది. దేశం, రాష్ట్రం, జిల్లా, క్లబ్లు, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.ఈ స్ధాయిలో నేను ఉండటానికి, నేను సాధించిన విజయాలు.. నేర్చుకున్న పాఠాలు.. ఇవన్నీ అద్భుతమైన క్రీడతోనే సాధ్యమైంది. తన క్రికెట్ ప్రయాణంలోనిరంతరం మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్, టీసీఎ సోదరుడు, భార్య (రోమి), అన్వీ, అన్వే(పిల్లలు),అత్తమామలకు కృతజ్ఞతలు తెలపాలనకుంటున్నాను"అని సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశాడు.ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో బెంగాల్ జట్టు ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 343 పరుగులకు ఆలౌటై 152 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే తన కెరీర్ చివరి ఇన్నింగ్స్లో సాహా ‘డకౌట్’ కావడం గమనార్హం. 152 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 35.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ధోని తర్వాత..అయితే టెస్టు క్రికెట్లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్గా కొనసాగాడు. అయితే రిషభ్ పంత్ దూసుకురావడంతో 2021 నుంచి టీమిండియా తరపున ఆడేందుకు సాహాకు అవకాశాలు లభించలేదు.వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో బెంగాల్, త్రిపుర జట్లకు ప్రాతినిధ్యం వహించి 142 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 116 లిస్ట్–ఎ మ్యాచ్లు ఆడాడు.చదవండి: CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్తో జాగ్రత్త! -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
సచిన్కు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తమ మ్యాచ్లు ఆడనుంది. తొలి మ్యాచ్లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా? -
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. తొలి మ్యాచ్లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్దీప్ సింగ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్గా ఉంటే.. -
దేశవాళీ టోర్నీకి దిగ్గజాల కళ
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చాలా కాలం తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ బాట పట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానుండగా... భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనని ముందే వెల్లడించగా... ఢిల్లీ జట్టు ఆడే తదుపరి మ్యాచ్లో అతడు కూడా పాల్గొననున్నాడు. రోహిత్ శర్మ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఇప్పటికే స్టార్లతో నిండి ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో మరింత పటిష్టంగా మారింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జమ్మూ కశీ్మర్తో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తలపడుతుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై జట్టు తాజా సీజన్లో 5 మ్యాచ్లాడి 3 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్లో మూడో స్థానంలో ఉంది. బరోడా (27 పాయింట్లు), జమ్మూ కశ్మీర్ (23 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. రోహిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని ముంబై కెపె్టన్ రహానే పేర్కొన్నాడు. ‘రోహిత్ అంటే రోహితే. అతడికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడితో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్ను మరోసారి పంచుకోనుండటం ఆనందంగా ఉంది. రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో అది ఎన్నోసార్లు చూశాం. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఒక్కసారి లయ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. ప్రతి ఆటగాడికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరుగుల కోసం తపించడం ముఖ్యం. యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా ముంబై తరఫున కూడా అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న వారి సాన్నిహిత్యంలో ముంబై ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు’ అని రహానే అన్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో పేలవ ఫామ్తో నిరాశ పరిచిన రోహిత్ శర్మ... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ద్వారా తిరిగి లయ అందుకుంటాడా చూడాలి. పంత్ X జడేజా రాజ్కోట్ వేదికగా జరగనున్న గ్రూప్ ‘డి’ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టుతో ఢిల్లీ టీమ్ ఆడుతుంది. సౌరాష్ట్ర తరఫున టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగుతుండగా... రిషభ్ పంత్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా, జైదేవ్ ఉనాద్కట్లతో సౌరాష్ట్ర జట్టు బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టులో ఆయుశ్ బదోనీ, యశ్ ధుల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడనుండగా... కర్ణాటక జట్టుకు దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన విదర్భ ప్లేయర్ కరుణ్ నాయర్పై అందరి దృష్టి నిలవనుంది. హిమాచల్తో హైదరాబాద్ పోరు ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్తో హైదరాబాద్ రంజీ జట్టు తలపడనుంది. మరోవైపు పుదుచ్చేరితో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ జాతీయ విధుల్లో ఉండగా... స్టార్ పేసర్ సిరాజ్ పనిభారం కారణంగా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు ఒక విజయం, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉండగా... ఆంధ్ర జట్టు ఐదు మ్యాచ్ల్లో 3 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 4 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ధరించే జెర్సీ గురించి వస్తున్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు. తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్ పేరు ఉండటాన్ని బీసీసీఐ వ్యతిరేకించిందన్న వార్తలను కూడా ఈ సందర్భంగా ఖండించాడు.దుబాయ్లో టీమిండియా మ్యాచ్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. ఐసీసీ అనుమతితో తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో పాక్తో పాటు దుబాయ్ కూడా ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.ఇక ఈ మెగా ఈవెంట్లో తమ తొలి మ్యాచ్లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ఆతిథ్య దేశం పేరు.. అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. అయితే, బీసీసీఐ మాత్రం దాయాది పేరును తమ జెర్సీలపై ముద్రించకుండా ఉండాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మా డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుందిఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐసీసీ రూపొందించిన అన్ని నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది. జెర్సీ లోగో అంశం సహా అన్నింటినీ మేము ఫాలో అవుతాము. ఏ దశలోనూ ఉద్దేశపూర్వకంగా మేము నిబంధనలను ఉల్లంఘించబోము. కానీ మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో.. వారికి వీటి గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ రూల్స్ను అతిక్రమించేందుకు మాకు ఎలాంటి కారణాలు లేవు. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పెట్టిన డ్రెస్ కోడ్ను మేము ఫాలో అవుతాం. లోగో కూడా యథాతథంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరుగుతుంది.ఫిబ్రవరి 5లోగా మైదానాలు రెడీ: పీసీబీఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రెండు వారాల ముందే స్టేడియంలను సిద్ధం చేసేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పనులు వేగవంతం చేసింది. కరాచీ, లాహోర్ స్టేడియాలలో పునరి్నర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అధునాతన కుర్చీలు, అదనపు సౌకర్యాలతో కూడిన భవనాలు, ఎల్ఈడీ ఫ్లడ్లైట్లు, డిజిటల్ స్కోరు బోర్డులు ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతన్న మైదానాలను వచ్చే నెల 5 వరకు సిద్ధం చేయనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆడనున్న ముక్కోణపు సిరీస్ను ఈ మైదానాల్లో నిర్వహించనున్నారు. ఈ రెండు మైదానాల పునర్నిర్మాణం కోసం పీసీబీ 12 బిలియన్ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. కరాచీ స్టేడియం మేనేజర్ అర్షద్ఖాన్ మాట్లాడుతూ... ‘నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలి ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు ఈ నెలాఖరులోగా ముగుస్తాయి. ఫిబ్రవరి 5లోగా అధునాతన మైదానాన్ని పీసీబీకి అందిస్తాం. లాహోర్ స్టేడియంలో కూడా పనులు దాదాపు ముగిశాయి. తాజా మార్పుల్లో అధునాతన సదుపాయాలు కల్పించాం’ అని పేర్కొన్నాడు.చదవండి: రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్ -
రోహిత్కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్కోట్లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు.. కోటక్కు ఇది అగ్ని పరీక్షే
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టింది. ఈ చర్యల్లో భాగంగా దేశవాళీ పోటీల్లో క్రికెటరలందరూ పాల్గొనాలని, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ సితాన్షు కోటక్ను జట్టు బ్యాటింగ్ కోచ్గా నియమించింది.ఈ పదవికి పోటీ పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రఖ్యాత ఇంగ్లండ్ బ్యాటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తన సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా తన సంసిద్ధతను వ్యక్తం చేసాడు. అయితే బీసీసీఐ ముందే ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన సితాన్షు కోటక్ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. కోటక్ దేశవాళీ క్రికెట్లో 10,000 పరుగులు పైగా సాధించాడు కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. 2013లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత, కోటక్ కోచింగ్ రంగంలోకి దిగి తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 2020లో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడానికి మార్గనిర్దేశం చేశాడు. 2019 నుండి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు. ఇటీవలి కాలంలో భారత్ వైట్-బాల్ సిరీస్లో వివిఎస్ లక్ష్మణ్కు సహాయ కోచ్గా సేవలందించాడు . బుధవారం ఇంగ్లాండ్తో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్తో కోటక్ తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కోటక్ నియామకం తప్పనిసరిఇటీవల స్వదేశం, విదేశాలలో జరిగిన సిరీస్ల్లో భారత్ బ్యాటర్లు పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే అంతకుముందు స్వదేశంలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో స్పిన్కు అనుకూలమైన పిచ్ ల పై సైతం భారత బ్యాటర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఫలితంగా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు 0-3 తేడాతో పరాజయం పాలైంది. అప్పుడే బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ ని నియమించి వుంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కొద్దిగా పరువు దక్కేది. ఈ నేపథ్యంలో కోటక్ నియామకం కొద్దిగా ఆలస్యమైనా సరైన నిర్ణయం గా కనిపిస్తోంది.బ్యాటింగ్ కోచ్గా అనుభవం..అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించకపోయినా, కోటక్ రెండు దశాబ్దాల పాటు దేశవాళీ పోటీల్లో రాణించాడు. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ ఫార్మాట్లలో కలిపి 10,000 పైగా పరుగులు సాధించాడు. కోటక్ వార్విక్షైర్తో కౌంటీ క్రికెట్లో కూడా కొంతకాలం ఆడాడు. కోటక్ 130 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 15 సెంచరీలు మరియు 55 అర్ధ సెంచరీలతో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. ఇంకా 89 లిస్ట్ ఎ మ్యాచ్ లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 42.23 సగటుతో 3,083 పరుగులు సాధించాడు.అన్ని ఫార్మాట్లలో కోచింగ్ సమర్ధతకోటక్ బీసీసీఐ, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి లెవల్ 1 మరియు లెవల్ 2 కోచింగ్ పరీక్షలు పూర్తిచేసాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఇండియా ఎ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో అనుభవం గడించిన కోటక్ కొంతకాలం భారత పరిమిత ఓవర్ల జట్టుకి సహకారం కూడా అందించాడు. కోటక్ ఐపీల్ లో 2016లో గుజరాత్ లయన్స్కు సహాయ కోచ్గా పనిచేశాడు. సురేష్ రైనా, ప్రస్తుత ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వంటి ఆటగాళ్లతో కలిసి పనిచేసి రాటుదేలాడు.ఇటీవలి కాలంలో కోటక్ భారత జట్టుతో కలిసి పలు పర్యటనలకు వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ అందుబాటులో లేని సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ కి సహాయ కోచ్ గా పని చేశాడు. 2023లో జస్ప్రిత్ బుమ్రా నేతృత్వంలో భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడినప్పుడు కోటక్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. అన్ని ఫార్మాట్ల అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ లో మార్పులు చేయగల ప్రజ్ఞాపాటవాలు కోటక్ కి పుష్కలంగా ఉన్నాయి. అయితే జట్టులోని ఎంతో అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్మన్ కి కొత్తగా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా వంటి పిచ్ ల పై భారత్ బ్యాట్స్మన్ రాణించిన సందర్భాలు తక్కువే. అయితే ఇటీవల కాలంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమాహేమీలు వచ్చిన తర్వాత భారత బ్యాటర్లు విదేశీ పర్యటనలలో కూడా రాణించగలమని నిరూపించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో బీసీసీఐ జట్టు లోపాల్ని సరిదిద్దడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగా కోటక్ ని బ్యాటింగ్ కోచ్ గా నియమించారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందా లేదా అన్న విషయం రాబోయే ఇంగ్లాండ్ పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ తో తేలిపోతుంది. కోటక్ కి ఇది అగ్ని పరీక్షే! -
రంజీ బాటలో జడేజా
న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... దేశవాళీల్లో తప్పక ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన హెచ్చరికలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ షెడ్యూల్ లేని సమయంలో కూడా దేశవాళీ మ్యాచ్లకు దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు... రంజీ ట్రోఫీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేయగా... ఇప్పుడు ఆ జాబితాలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా... ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఆదివారం రాజ్కోట్లో సౌరాష్ట్ర జట్టు సభ్యులతో కలిసి జడేజా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ‘జడేజా ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో అతడు బరిలోకి దిగుతాడు’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయ్దేవ్ షా తెలిపారు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఈ స్పిన్ ఆల్రౌండర్... చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని వెల్లడించగా... రిషబ్ పంత్, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తమ తమ జట్ల తరఫున రంజీ మ్యాచ్లు ఆడనున్నారు. దీంతో ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరిగే మ్యాచ్లో ఢిల్లీ తరఫున రిషబ్ పంత్, సౌరాష్ట్ర తరఫున జడేజా ఆడనున్నారు. విదర్భతో పోరుకు సిరాజ్ భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్కు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వర్గాలు వెల్లడించాయి. ‘వర్క్లోడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో సిరాజ్ ఆడటం లేదు. విదర్భతో పోరులో మాత్రం అతడు జట్టులో ఉంటాడు’ అని ఓ హెచ్సీఏ అధికారి తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. కొత్త బంతితో పాటు పాత బంతితోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకంతో సెలెక్టర్లు సిరాజ్ను కాదని అర్‡్షదీప్ సింగ్ను ఎంపిక చేశారు. -
సిరాజ్ మెరుగులు దిద్దుకుంటాడా?
త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్దీప్ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం. -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
ఇదేమీ స్కూల్ కాదు.. సూపర్స్టార్లు అయినా తప్పదు: చీఫ్ సెలక్టర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవేశపెట్టిన ‘పటిష్ట జట్టుకు పది సూత్రాల’ అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిబంధనలు కఠినతరం చేశామే తప్ప.. ఇవేమీ స్కూలు పిల్లలకు ఇచ్చే పనిష్మెంట్లు కావని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుడు పరిణతి గలిగిన వ్యక్తులేనని.. సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారన్నాడు.అయితే, జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు ప్రతి ఒక్కరు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రతి టీమ్లోనూ రూల్స్ ఉంటాయని.. జట్టు అభివృద్ధి, ప్రయోజనాలు మాత్రమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు రోజురోజుకు మరింత మెరుగుపడటానికి మాత్రమే నిబంధనలు విధించినట్లు తెలిపాడు.బీసీసీఐ ప్రవేశపెట్టిన పది సూత్రాల పాలసీదేశవాళీ మ్యాచ్లు ఆడాల్సిందే ‘స్టార్ హోదాతో దేశవాళీ క్రికెట్ను అటకెక్కించిన ఆటగాళ్లు ఇకపై బరిలోకి దిగాల్సిందే. టీమిండియాకు ఎంపిక కావాలంటే రంజీ మ్యాచ్లు, ఇతర దేశవాళీ టోర్నీలలో ఆటగాళ్లంతా వారి వారి రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండాలి. సహేతుక కారణం ఉంటే తప్ప... తప్పుకోవడానికి యువ ఆటగాళ్లకే కాదు సీనియర్లకు ఇకపై వీలుండదు’బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవు టోర్నీలు, సిరీస్లు జరుగుతుంటే ఇకపై ‘బ్రాండింగ్’ షూటింగ్ల్లో పాల్గొనడం కుదరదు. ఆటగాళ్లు కుదుర్చుకున్న ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం సిరీస్ మధ్యలో ఫొటో షూట్స్ నిషిద్ధం.కుటుంబసభ్యుల అనుమతికి ఓ పరిమితి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఆ ద్వైపాక్షిక సిరీస్ 45 రోజులకు మించి సుదీర్ఘంగా సాగితే క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా అసాంతం ఉంటామంటే ఉండనివ్వరు. 45 రోజులు ఆ పైన పర్యటనల కోసం ఇకపై రెండు వారాలపాటే కుటుంబసభ్యుల్ని అనుమతిస్తారు. స్వల్పకాల పర్యటనలకు మాత్రం వారం పరిమితే ఉంటుందిక! జట్టుతో పాటే పయనం ఇప్పటి వరకు ఆటగాళ్లు విడతల వారీగా, పర్యటన షెడ్యూల్కు ఉన్న సమయానికి అనుకూలంగా ఆటగాళ్లు ఆయా దేశాలకు వేర్వేరుగా పయనమయ్యేవారు. కానీ ఇక మీదట ఓ జట్టుగా సహచరులతో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తద్వారా జట్టులో అను‘బంధం’ బలపడేందుకు దోహదం చేస్తుంది. అనివార్య కారణాలు లేదంటే తప్పనిసరై ఫ్యామిలీతో ప్రయాణించాలంటే మాత్రం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి! వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు జట్టులో ఎంత సీనియరైనా, దిగ్గజమైనా తమ వెంట వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తామంటే అనుమతించరు. సదరు సిబ్బంది అవసరమనుకుంటే ఆ ఆటగాడు కచి్చతంగా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుంది.‘అదనపు’ లగేజీ భారం ప్లేయర్లపైనే... విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఆటగాళ్ల లగేజీపై ఎలాంటి ఆంక్షలు, పరిమితుల్లేవు. ఎన్ని కేజీలు తీసుకెళ్లినా ఆ భారాన్ని బోర్డే భరించేది. కానీ ఇకపై ఒక ఆటగాడు 150 కేజీలకు మించి లగేజీ తీసుకెళితే ఆ భారం ఆటగాళ్లే మోయాలి.కలసికట్టుగా ప్రాక్టీస్ సన్నాహాలకు ఆటగాళ్లంతా సమయానికి అందుబాటులో ఉండాలి. నెట్స్లో శ్రమించేందుకు వెళ్లే సమయంలో తమకు వీలుచిక్కిన సమయంలో స్టేడియానికి చేరకుండా... అంతా కలిసి ఒకే బస్సులో ప్రాక్టీసుకు బయలు దేరాలి.బోర్డు కార్యక్రమాలకు హాజరు బీసీసీఐ నిర్వహించే సమావేశాలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు భారత ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలి. ఇది క్రికెట్ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది.మ్యాచ్లు ముగిశాక... ఏదైనా పర్యటన, సిరీస్, టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇష్టారీతిన ఎవరికివారు హోటల్ గదులకు వెళతామంటే కుదరదు. అందరు కలిసి జట్టుగా వెళ్లాలి. జట్టుతో పాటే పయనించాలి. గదుల్లోనూ కలిసిమెలిసే బస స్టార్ ఆటగాళ్లకు విడిగా ప్రత్యేక గదులిస్తున్నారు. ఇకపై రెండు వారాలు, ఒక వారం కుటుంబసభ్యుల పరిమితికి లోబడి మాత్రమే ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. మిగతా సమయంలో సహచర ఆటగాళ్లతో గదుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. చదవండి: అందుకే సిరాజ్ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ -
CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.సిరాజ్, సంజూకు మొండిచేయిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్లో చోటు దక్కింది. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా అతడిని ఎంపిక చేశారు.బుమ్రా ఫిట్నెస్ సాధిస్తాడా? మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఎనిమిది జట్లుఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్కు నేరుగా అర్హత సాధించగా.. భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్లోకి వస్తాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్. -
‘గంభీర్కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్కోచ్కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
BCCI: ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
-
భారత ఆటగాళ్లు.. బహుపరాక్.. ఈ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు..!
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులో క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు బీసీసీఐ 10 పాయింట్ల మార్గదర్శకాలను రూపొందించింది. భారత ఆటగాళ్లు కింద పేర్కొన్న గైడ్లైన్స్ను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలికాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న బీసీసీఐ ఈ కఠిన మార్గదర్శకాలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది.బీసీసీఐ ప్రవేశపెట్టిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలు..దేశవాలీ క్రికెట్ ఆడటం తప్పనిసరిజాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలంటే ఇకపై ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి. ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే కూడా దేశవాలీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాలి.కుటుంబాలతో వేరుగా ప్రయాణం చేయడం నిషేధంమ్యాచ్లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరుగా ప్రయాణాలు చేయడం నిషేధం. మ్యాచ్లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బీసీసీఐ భావిస్తుంది.అధిక లగేజీ భారాన్ని ఆటగాళ్లే మోయాల్సి ఉంటుందిఆటగాళ్లు పరిమితికి మించి లగేజీని క్యారీ చేస్తే సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది.వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణాలు ఆపండివిదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ళు వంటవారు, హెయిర్ డ్రెస్సర్లు, స్టైలిస్టులు, సెక్యూరిటీ గార్డులతో ప్రయాణించడాన్ని నిషేధించాలని బీసీసీఐ నిర్ణయించింది.అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలిబీసీసీఐ అధికారిక కార్యక్రమాలకు (షూటింగ్లు, ప్రమోషన్స్, ఫంక్షన్లు) ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి.టూర్ ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలిఆటగాళ్లు టూర్ లేదా సిరీస్ అధికారికంగా ముగిసే వరకు జట్టుతో పాటే ఉండాలి. మ్యాచ్ తొందరగా ముగిసినా జట్టును వీడ కూడదు.ప్రాక్టీస్ తర్వాత ప్రయాణంషెడ్యూల్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు ప్లేయర్లందరూ కలిసి ఉండాలి. ప్లేయర్లు ప్రాక్టీస్ అనంతరం కలిసి ప్రయాణించాలి.ఎండార్స్మెంట్లపై నిబంధనలుపర్యటన సమయంలో ఎలాంటి వ్యక్తిగత షూట్లు లేదా ఎండార్స్మెంట్లకు అనుమతి లేదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఇది నిర్దేశించబడింది.కుటుంబ సభ్యుల అనుమతి45 రోజుల కంటే ఎక్కువ గల విదేశీ పర్యటనల్లో మాత్రమే ప్లేయర్ల కుటుంబ సభ్యులకు రెండు వారాల అనుమతి ఉంటుంది.ఈ కొత్త పాలసీ ప్రకారం జట్టు సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ, జట్టు కోసం కట్టుబడి పనిచేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
మహిళల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14వ తేదీన మొదలవుతుంది. వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్లు జరుగుతాయి. బరోడా వేదికగా ఫిబ్రవరి 14న జరిగే తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. మార్చి 15న ముంబైలో జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. గుజరాత్, బెంగళూరు జట్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. తదుపరి డబ్ల్యూపీఎల్ గడిచిన రెండు సీజన్ల (2023, 2024) తరహాలో రెండు వేదికలపై కాకుండా నాలుగు వేదికల్లో జరుగనుంది. ఓపెనింగ్ లెగ్ మ్యాచ్లకు కొటాంబి స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. రెండో వారం మ్యాచ్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు షిఫ్ట్ అవుతాయి. అనంతరం నాలుగు లీగ్ మ్యాచ్లు లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుండగా.. ఎలిమినేటర్ (మార్చి 13), ఫైనల్ మ్యాచ్లు (మార్చి 15) సహా నాలుగు మ్యాచ్లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఐపీఎల్-2025 పూర్తి షెడ్యూల్..వడోదర లెగ్:14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ 17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్19 ఫిబ్రవరి 2025 యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్బెంగళూరు లెగ్:21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ 23 ఫిబ్రవరి 2025 బ్రేక్24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్ 25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 2 మార్చి 2025 బ్రేక్లక్నో లెగ్:3 మార్చి 2025 యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్4 మార్చి 2025 బ్రేక్5 మార్చి 2025 బ్రేక్6 మార్చి 2025 యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్8 మార్చి 2025 యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు9 మార్చి 2025 బ్రేక్ముంబై లెగ్:10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ 11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు12 మార్చి 2025 బ్రేక్13 మార్చి 2025 ఎలిమినేటర్14 మార్చి 2025 బ్రేక్15 మార్చి 2025 ఫైనల్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్రూమ్లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్తో కలిసి రివ్యూ మీటింగ్లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
పాకిస్తాన్కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.ఇక ఆతిథ్య పాకిస్తాన్తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్కు అర్హత సాధించాయి.తటస్థ వేదికపైఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడుఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. దాయాదుల సమరం ఆరోజేఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.ఇక టీ20 ప్రపంచకప్లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.చదవండి: టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం -
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?
ఇంగ్లాండ్తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు!
ఇంగ్లండ్తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్దీప్ సింగ్తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.సూపర్స్టార్పై వేటు!మరోవైపు.. సూపర్స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్తో ఐదు టీ20లుకోల్కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్కోట్లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
జై షాకు సన్మానం
ముంబై: భారత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ అయిన జై షాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించనుంది. రేపు జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఐసీసీ నూతన చైర్మన్ను సన్మానించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సెక్రటరీగా ఉన్న జై షా గతేడాది ఆగస్టులో జరిగిన ఐసీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతిపిన్న వయసులో ఐసీసీ చైర్మన్ అయిన క్రికెట్ పరిపాలకుడిగా ఘనత వహించారు. అయితే మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ 30 వరకు ఉండటంతో జై షా కాస్త ఆలస్యంగా డిసెంబర్ 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ నుంచి బోర్డు కార్యదర్శిగా, 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) చైర్మన్గా కీలకపాత్ర పోషించిన జై షా ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిరోహించారు. నిజానికి బీసీసీఐ ఆఫీస్ బేరర్ కాకపోవడంతో ఎస్జీఎంలో జై షా పాల్గొనేందుకు వీల్లేదు. అయితే మీటింగ్కు ముందు లేదంటే తర్వాత ఆయన్ని సత్కరించే అవకాశముంది. -
IND vs ENG: బీసీసీఐ యూ టర్న్..! కేఎల్ రాహుల్కు నో రెస్ట్?
భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు సిద్దమవుతోంది. ఈ వైట్బాల్ సిరీస్లలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలుత ఐదు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. జనవరి 22న ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ఈ సిరీస్ల కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం(జనవరి 13) ప్రకటించే అవకాశముంది. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించారు.కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 దృష్ట్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాహుల్ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2 అనంతరం స్వదేశానికి చేరుకున్న రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లకు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు.. తిరిగి ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా రాహుల్కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇప్పటివరకు 77 వన్డేలు ఆడిన రాహుల్.. 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్లో భారత్కు వెన్నెముకగా రాహుల్ ఉంటాడు.తన వన్డే కెరీర్లో రాహుల్ 5 స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ఏకంగా 1269 పరుగులు చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఆడనున్నారు. అయితే ఈ సిరీస్కు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)చదవండి: 'కోహ్లి వల్లే యువీ ముందుగా రిటైరయ్యాడు'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు -
క్రికెట్ ‘మనసు’ చదివింది!
చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అమ్మాయి... మరోవైపు అంతే స్థాయిలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం... ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి ఏదో ఒకదానిని ఎంచుకోమని సన్నిహితులు చెప్పారు. కానీ ఇష్టంలో కష్టం ఉండదని ఆ అమ్మాయి నమ్మింది. అందుకే ఒకవైపు చదువులో ఉత్తమ విద్యారి్థనిగా ఉంటూనే తనకు నచ్చిన రీతిలో క్రికెట్లో కూడా సాధనను కొనసాగించింది. ఫలితంగా ప్లస్ టు స్థాయిలో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు... ప్రొఫెషనల్ క్రికెటర్గా కూడా మారింది. ఇప్పుడు సైకాలజీ చదువుతూనే ఏకంగా భారత సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఓపెనర్గా భారత్ తరఫున ఆడిన 4 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించిన ఢిల్లీ అమ్మాయి ప్రతీక రావల్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. –సాక్షి క్రీడా విభాగం భారత జట్టులో స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్గా షఫాలీ వర్మ ఐదేళ్ల పాటు రెగ్యులర్గా జట్టులో ఉంది. 16 ఏళ్లు పూర్తి కాక ముందే జట్టులోకి వచ్చిన షఫాలీ సంచలన బ్యాటింగ్, దూకుడైన శైలితో దూసుకుపోయింది. అయితే వరుస వైఫల్యాల తర్వాత సెలక్టర్లు షఫాలీపై వేటు వేసి కొత్త ఓపెనర్గా ప్రతీక రావల్ను ఎంపిక చేశారు. షఫాలీ స్థానంలో వచ్చిన ప్లేయర్ నుంచి సహజంగానే అలాంటి ధాటిని అంతా ఆశిస్తారు. ఇప్పుడు నిలకడైన ప్రదర్శనతో 24 ఏళ్ల ప్రతీక తాను అందుకు తగిన దానినే అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆడిన 4 వన్డేల్లో ఆమె 82 స్ట్రయిక్రేట్తో వరుసగా 40, 76, 18, 89 పరుగులు సాధించి కెరీర్లో శుభారంభం చేసింది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆమెకు ఈ అవకాశం కల్పించింది. మూడేళ్ల క్రితం వన్డే టోర్నీలో 155 బంతుల్లో 161 పరుగులు చేసి ఢిల్లీని నాకౌట్ చేర్చడంతో ప్రతీకకు తొలిసారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బీసీసీఐ అండర్–23 టోర్నీలో 7 ఇన్నింగ్స్లలో 411 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్గా నిలవడంతో పాటు ఢిల్లీ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. తండ్రి అండదండలతో... ఢిల్లీలోని పశ్చిమ పటేల్ నగరంలో ఉండే ప్రదీప్ రావల్ కుటుంబం కేబుల్ టీవీ వ్యాపారంలో ఉంది. ప్రదీప్ అటు బిజినెస్లో భాగం కావడంతో పాటు ఢిల్లీ క్రికెట్ సంఘంలో బీసీసీఐ సర్టిఫైడ్ అంపైర్గా కూడా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి చాలాసార్లు మైదానానికి వెళ్లిన ప్రతీకకు సహజంగానే క్రికెట్పై ఆసక్తి ఏర్పడింది.దాంతో 10 ఏళ్ల వయసు ఉన్న తన కూతురిని కోచ్ శ్రవణ్ కుమార్ వద్ద శిక్షణ కోసం ప్రదీప్ చేరి్పంచారు. భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా తదితరులకు కోచ్గా వ్యవహరించిన శ్రవణ్కు మంచి గుర్తింపు ఉంది. శ్రవణ్ శిక్షణ ఇచి్చన తొలి అమ్మాయి ప్రతీకనే కావడం విశేషం. ఆ తర్వాత స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు వేర్వేరు చోట్ల చక్కటి ప్రదర్శనలతో ఆమె ఆకట్టుకుంది. క్రికెట్తో పాటు బాస్కెట్బాల్ కూడా బాగా ఆడుతూ వచ్చిన ప్రతీక 2019 జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆమె ఉత్తీర్ణురాలు కావడం విశేషం. నిలకడైన ప్రదర్శనతో... భిన్న రంగాల్లో సత్తా చాటుతున్నా... ప్రతీక అసలు లక్ష్యం మాత్రం క్రికెట్ వైపే సాగింది. దాంతో అండర్–17 స్థాయిలో మరింత మెరుగైన శిక్షణ అవసరమని భావించిన ఆమె రైల్వే కోచ్ ధ్యాని వద్ద చేరి తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంది. 2022–23 దేశవాళీ వన్డే సీజన్లో 14 మ్యాచ్లలో కలిపి 552 పరుగులు చేయడం ద్వారా తన స్థాయిని పెంచుకుంది. మరోవైపు ఢిల్లీ మహిళల జట్టు కోచ్, మాజీ ఆటగాడు దిశాంత్ యాజ్ఞిక్ కూడా ఆమె ఆటను తీర్చిదిద్దడంలో సహకరించాడు. బీసీసీఐ అండర్–23 స్థాయి టి20 టోర్నీలో కూడా రాణించిన ప్రతీక ఢిల్లీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనలు చూస్తే జాతీయ జట్టుకు ఎంతో దూరంలో లేదని అందరికీ అర్థమైంది. మానసికంగా దృఢంగా... ‘నేను ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలగన్నాను గానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నా కూతురి రూపంలో నా కోరిక తీరింది’ అని ప్రదీప్ రావల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీసీఐ విధుల్లో భాగంగా తండ్రి వడోదరలో ఉన్న సమయంలోనే ఆమెకు తొలి వన్డే ఆడే అవకాశం రావడం యాదృచ్చికం. తన కళ్ల ముందు భారత్కు ప్రాతినిధ్యం వహించిన ప్రతీకను చూస్తూ ఆ తండ్రి పుత్రికోత్సాహంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక... తన చదువు క్రికెట్ కెరీర్కూ ఉపయోగపడుతోందని చెప్పుకుంది. ‘మనుషుల మనస్తత్వాలను చదవడం గురించి నాకు బాగా తెలుసు. దానిని అర్థం చేసుకోగలిగితే అటు మైదానంలో, మైదానం బయట కూడా పని సులువవుతుంది. మ్యాచ్కు ముందు ఇప్పుడు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో అనే విషయంపై నాతో నేను సానుకూలంగా మాట్లాడుకుంటా. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నేను అత్యుత్తమ ప్లేయర్గా, ఏదైనా చేయగలనని భావించుకుంటా. అది నాకు సైకాలజీనే నేర్పింది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత జోరును కొనసాగించి ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టీమ్లో భాగం కావాలని ప్రతీక ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది. -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్లో క్రికెట్ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్లోని రంజీ టీమ్లతో మ్యాచ్లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
టీమిండియాకు భారీ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో కాస్త ఆసౌక్యరంగా కన్పించిన బుమ్రాను వెంటనే స్కానింగ్ తరలించారు.కానీ ఇప్పటివరకు బుమ్రా గాయం ఏ దశలో ఉందన్నది బీసీసీఐ గానీ టీమ్మెనెజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ జస్ప్రీత్ గాయం కాస్త తీవ్రమైనదిగానే అన్పిస్తోంది. అతడి గాయం అంత సీరియస్ కాకపోతే అతడు కచ్చితంగా కీలకమైన సిడ్నీ టెస్టులో బౌలింగ్ చేసేవాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం..!కాగా జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా నుంచి గురువారం భారత్కు చేరుకోనున్నాడు. స్వదేశానికి వచ్చాక గతం(2022)లో న్యూజిలాండ్లో తనకి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్టార్ పేసర్ ఏన్సీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నట్లు వినికిడి.కాగా బుమ్రా గాయం గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అతడు నాలుగు నుంచి ఐదు వారాల ఆటకు దూరం కాక తప్పదు. ఆ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే ఏన్సీఎ వైద్య బృందం క్లియరెన్స్ కచ్చితంగా కావాలి.ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశముంటుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది.ఒకవేళ గ్రూపు స్టేజి మ్యాచ్లకు బుమ్రా దూరమైతే భారత్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే బీసీసీఐ ఇంకా బుమ్రా గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.షమీ ప్రస్తుతం విజయ్హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ఇంగ్లండ్తో జరిగే వన్డేల్లో ఆడనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.ఆసీస్ గడ్డపై అదుర్స్..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్ను భారత్ కోల్పోయినప్పటికీ తన ప్రదర్శనతో ప్రత్యర్ధిని సైతం ఆకట్టుకున్నాడు. మొత్తం 5 మ్యాచ్లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.చదవండి: అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పరిస్థితి గంభీరం!
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్స్వీప్... ఇన్నింగ్స్లో 46కే ఆలౌట్... ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి. ఒక్క బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ విజయం మినహా హెడ్ కోచ్గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే. అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్... గతంలో జట్టుకు కోచ్గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగంభారత జట్టుకు హెడ్ కోచ్గా ఎంపిక కాకముందు గంభీర్ ఏ స్థాయిలో కూడా కోచ్గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత మూడు ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ టీమ్లకు మెంటార్గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్గా వ్యవహరించినప్పుడు కోల్కతా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు. ప్రాక్టీస్ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్ చూపించలేదు. ఒక టి20క్లబ్ టీమ్కు మెంటార్గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు. అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది. ఆ ముగ్గురు ఏం పని చేశారో?నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్గా పని చేయలేదనే విషయం గంభీర్కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), అభిషేక్ నాయర్ (భారత్), టెన్ డస్కటే (నెదర్లాండ్స్) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్కు అవకాశం ఇచ్చింది. అయితే ఆటగాడిగా మోర్కెల్కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్ సిరీస్లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్ మొదలు ఆడే షాట్ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు. దిగితే కానీ లోతు తెలీదు... కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే శాస్త్రి కోచ్గా ఉన్నప్పుడే భారత్ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు. ‘అడిలైడ్ 36 ఆలౌట్’ తర్వాత టీమ్ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్ స్పీచ్’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.కోచ్గా ఎంత వరకు! గంభీర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్కు అలవాటుగా మారింది. కోచ్గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా. 140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది. అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్ 2027 వరల్డ్కప్ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్తో జరగబోయే సిరీస్ను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీ కోచ్గా గంభీర్కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ -
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్తో మ్యాచ్లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాలు ఎదురు కానుంది. పాకిస్తాన్, యూఈఏ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గోనేందుకు టీమిండియా సిద్దం కానుంది.50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా రన్నరప్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షూరూ కానుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఐసీసీ నిర్దేశించిన గడువుకు ఒక రోజు ముందు (జనవరి 11)న భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినవెంటనే జట్టు ఎంపికకు కసరత్తులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్గా రోహిత్ శర్మ.. అయ్యర్కు ఛాన్స్కాగా ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్గా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే విధంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లతో షమీ పునరాగమనం చేసే అవకాశముంది.ఇంగ్లీష్ జట్టుతో టీ20 లేదా వన్డే సిరీస్కు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సైతం సెలక్టర్లు తిరిగి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లను అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్లలో అక్కడి పిచ్లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు బుమ్రా, సిరాజ్లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్లు ఆడి.. ప్రతి మ్యాచ్లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
పాక్ ఎత్తులకు చెక్
-
అఫీషియల్.. ఆసీస్తో టెస్టు సిరీస్ నుంచి షమీ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరిచింది. గాయం నుంచి కోలుకున్న షమీ.. ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపించాయి. అయితే షమీ మరోసారి గాయం బారిన పడ్డాడు.బౌలింగ్ ఓవర్లోడ్ కారణంగా షమీ మోకాలి వాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో సుదీర్ఘ స్పెల్లు వేయడానికి సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం తెల్చింది. ఈ క్రమంలోనే షమీ టీమిండియా రీఎంట్రీ మరింత అలస్యం కానుంది."ఈ ఏడాది రంజీ సీజన్లో మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో బెంగాల్ తరుపున షమీ 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో మొత్తం 9 మ్యాచ్ల్లో ఆడాడు. ఆ సమయంలో అతడు టెస్టు క్రికెట్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని భావించాము. అందుకు తగ్గట్టు షమీ కూడా అదనపు బౌలింగ్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గోన్నాడు. కానీ బౌలింగ్ వర్క్లోడ్ ఎక్కువ కావడంతో అతడి ఎడమ మోకాలి వాపు వచ్చింది. ఈ క్రమంలో అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పరిశీలించింది. అతడు ఇంకా ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేసే ఫిట్నెస్ సాధించలేదని మా వైద్య బృందం నిర్ధారించింది. అతడు పూర్తి స్ధాయి క్రికెట్కు అందుబాటులోకి రావడం మరింత సమయం పట్టనుంది.దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్ట్లకు షమీ దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పరిశీలను ఉంటాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను పాల్గొనడం కూడా అనుమానమే" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
BCCI: కీలక పదవుల భర్తీకి సన్నాహకాలు
బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా వెళ్లారు.మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్జీఎమ్ నిర్వహించాలి.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు. చదవండి: అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో అశూ వెల్లడించాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరిని షాక్కు గురిచేసింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్కు ఎంత మొత్తం పెన్షన్ వస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.అశ్విన్కు ఎంతంటే?ఫస్ట్క్లాస్ క్రికెట్లో కనీసం 25 మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది. 2022 వరకు ఆటగాళ్లకు తక్కువ మొత్తంలో పెన్షన్ లభించేది. కానీ జూన్ 1, 2022 ఆటగాళ్ల పెన్షన్ స్కీమ్లో బీసీసీఐ భారీగా మార్పులు చేసింది.ప్రస్తుత విధానం ప్రకారం.. 25 నుండి 49 మ్యాచ్లు ఆడిన ఫస్ట్-క్లాస్ క్రికెటర్లందరికి ప్రతీ నెలా రూ.30 వేల పెన్షన్ లభిస్తుంది. గతంలో వారికి నెలకు 15,000 రూపంలో పెన్షన్ అందేది. అదే విధంగా 50 నుంచి 74 మ్యాచులు ఆడిన వారికి రూ.45 వేల పెన్షన్ బీసీసీఐ నుంచి అందనుంది.75కి పైగా మ్యాచులు ఆడిన క్రికెటర్లకు ప్రతి నెలా రూ.52,500 పెన్షన్ ఇస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 25 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన టెస్టు క్రికెటర్లందరికీ నెలకు రూ.70,000 పెన్షన్ లభించింది. గతంలో వీరి పింఛన్ రూ. 50,000గా ఉండేది. ఈ లెక్కన 106 టెస్టులు ఆడిన అశ్విన్కు రూ. 70,000 పెన్షన్ అందనుంది.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్లు ఆడే అన్నీ మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్లో భారత్ ఆడాల్సిన మ్యాచ్లు యూఏఈ (దుబాయ్)లో... భారత్లో పాక్ ఆడాల్సిన మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి. -
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్కు కోహ్లి గుడ్బై... లండన్లో స్థిరనివాసం’ -
బీసీసీఐలో మరో పోస్ట్ ఖాళీ
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో మరో కీలక పదవి ఖాళీ అయ్యింది. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరారు. ఆదివారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్రికెట్ బోర్డులోని తన కోశాధికారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం 2022 అక్టోబర్లో బీసీసీఐ కోశాధికారిగా షెలార్ ఎన్నికయ్యారు.గత నెల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా... భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ముంబై సబర్బన్ జిల్లా పరిధిలోని వాంద్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులెవరూ బోర్డు కార్యవర్గంలో ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి. 2016లో ఏర్పాటైన జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే 2022లో ఎమ్మెల్యే, ఎంపీలకు మినహాయింపునిస్తూ కేబినెట్ హోదా ఉన్న వారిని అనర్హులని తీసుకొచి్చన సవరణకు సుప్రీం ఆమోదం తెలపడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్న షెలార్ కోశాధికారిగానూ పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కావడంతో బోర్డు పదవికి రాజీనామా చేశారు. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా జై షా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి కూడా ఖాళీ అయ్యింది. ఇప్పుడు కీలకమైన కార్యదర్శి, కోశాధికారి పదవులు రెండూ ఖాళీగా ఉన్నాయి. అయితే జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రస్తుతానికి తాత్కాలిక కార్యదర్శిగా పని చేస్తున్నారు. -
CT 2025: టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
షాకింగ్.. టీ20 ఫార్మాట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ!?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఇప్పటివరకు ఇంకా అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు.అందుకు కారణం బీసీసీఐ-పీసీబీ మధ్య నెలకొన్న విభేదాలే. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు పంపేంచేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది.అందుకు అన్ని క్రికెట్ బోర్డులు అంగీకరించినా, పీసీబీ మాత్రం ససేమీరా అంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహణకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ అందుకు ఒప్పుకోపోతే టోర్నీని పాక్ నుంచి వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీబీ ఓ మెట్టు దిగి వచ్చి హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేందుకు సిద్దమైనట్లు సమాచారం.మరో కొత్త ట్విస్ట్..తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంలో మరో కొత్త ఆంశం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్కు బదులగా టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం..ఐసీసీ షెడ్యూల్ను ఇంకా ఖారారు చేయకపోవడంతో మార్కెటింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని పెట్టబడుదారులు అవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి కొన్ని రోజులు ఇదే తంతు కొనసాగితే ఛాంపియన్స్ ట్రోఫీని టీ20 ఫార్మాట్లలో నిర్వహించాలని సదరు స్టేక్హోల్డర్స్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు ఐసీసీ కూడా సముఖంగా ఉన్నట్లు క్రిక్బజ్తో పాటు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ఫార్మాట్ కంటే టీ20లను ఈజీగా నిర్వహించవచ్చని ఐసీసీ భావిస్తున్నట్లు వినికిడి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై గురువారం(డిసెంబర్ 12)ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.చదవండి: IND vs AUS: 'ధోని లాంటి కెప్టెన్ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్' -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్లో పీసీబీ హైబ్రిడ్ మోడల్కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
క్రికెట్లో మన ‘దీక్ష’.. మెరిసింది! సత్తా చాటుతున్న గుంటూరు బాలిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొంచెం ఊహ వచ్చిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం కాలక్రమేణా తగ్గిపోతుంది. అందుకే వారు స్నేహితులపైనా, సెల్ఫోన్స్లాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్పై ఎక్కువ ఆధారపడుతుండడం మనం తరచూ చూస్తుంటాం. పిల్లలకు విషయాలు తెలుస్తున్న సమయంలో వారితో ఎక్కువ టైం గడిపితే వారిలోని అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే వీలుంటుంది. ఇదే చేశారు ఎస్వీఎన్ కాలనీకి చెందిన కాట్రగడ్డ శేషసాయి, హేమ ప్రభ దంపతులు. తమ ఒక్కగానొక్క కుమార్తె దీక్షను చిన్న వయస్సులోనే క్రికెట్ ఆటలో చేరి్పంచి మార్గదర్శకులుగా మారారు. అందుకే దీక్ష కేవలం 13 సంవత్సరాల వయస్సులోనే బీసీసీఐ అండర్–15 బాలికల క్రికెట్లో సత్తా చాటి ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో కీలక భూమిక పోషించింది. ఓపెన్ బ్యాటర్గానూ, వికెట్ కీపర్గానూ రాణించింది. కన్నవారి ప్రోత్సాహంతో.. దీక్ష తండ్రి శేషసాయి ఒకప్పుడు క్రికెటర్. దీక్షకూ క్రికెట్పై మక్కువ ఏర్పడింది. ఆమెకు ఆట నేర్పడంతో దీక్ష అండర్–13 జిల్లా, జోనల్క్రికెట్లో రాణించింది. గత నెలలో జరిగిన బీసీసీఐ అండర్–15 బాలికల టోర్నీకి ఆంధ్ర జట్టుకు ఎంపికైంది. కెప్టెన్గా అవకాశం దక్కింది. ఆ టోరీ్నలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆంధ్ర జట్టుకు బీసీసీఐ తదుపరి టోరీ్నకి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. దీక్ష బ్యాటర్గానూ, కీపర్గానూ రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. మంగళవారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దీక్షను అభినందించారు. తల్లిదండ్రులే స్ఫూర్తి నాన్నను చూసి క్రికెట్పై మక్కువ పెంచుకున్నా. అమ్మ నాతో మ్యాచ్లకు వస్తుంది. నాకు ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. కేవలం నేను క్రికెట్ను శ్రద్ధగా ఆడాలని మాత్రమే వారు చెబుతుంటారు. కోచ్ల సహకారం కూడా ఎంతో ఉంది. ఏసీఏతోపాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. ముందు సీనియర్స్ విభాగానికి రావాలి. ఆ తర్వాత నాకంటూ లక్ష్యాలు పెట్టుకుంటా. పేరెంట్స్ సహకారముంటే ఏ క్రీడలోనైనా రాణించవచ్చు. – దీక్ష -
CT 2025: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. ముందే!
చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్కు వెళ్లాలిఅందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.అయితే, భవిష్యత్తులో భారత్లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం
పట్నా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో బిహార్ ఎడంచేతి వాటం స్పిన్నర్ సుమన్ కుమార్ అద్భుతం చేశాడు. రాజస్తాన్తో ఇక్కడి మొయిన్ ఉల్ హఖ్ స్టేడియంలో ఆదివారం ముగిసిన మ్యాచ్లో 18 ఏళ్ల సుమన్ ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసుకున్నాడు. సుమన్ 33.5 ఓవర్లలో 20 మెయిడెన్లు వేసి 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. సుమన్ ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 75.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులకు ఆలౌటైంది. 285 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బిహార్ జట్టు రాజస్తాన్ను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో రాజస్తాన్ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మొత్తం 137.5 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.కూచ్ బెహార్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా సుమన్ కుమార్ గుర్తింపు పొందాడు. గతంలో ఆంధ్ర బౌలర్ మెహబూబ్ బాషా (2010లో త్రిపురపై 44 పరుగులకు 10 వికెట్లు), మణిపూర్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్కుమార్ సింగ్ (2018లో అరుణాచల్ ప్రదేశ్పై 11 పరుగులకు 10 వికెట్లు) ఈ ఘనత సాధించారు. -
ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జై షా
ఐసీసీ నూతన చైర్మన్గా జై షా ఇవాళ (డిసెంబర్ 1) బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు. షా ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా కొనసాగారు.ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక జై షా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడం తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని వెల్లడించారు. వచ్చే ఏడాది పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షాకు తొలి టోర్నమెంట్ కావడం విశేషం. -
ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిగివచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విషయంలో ఎట్టకేలకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకొన్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లుగా సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిసి టోర్నమెంట్ బరిలో దిగాలని ఉవ్విళ్లూరింది.పీసీబీకి ఐసీసీ అల్టిమేటంఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లిన బీసీసీఐ.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ విషయం గురించి పీసీబీకి చెప్పగా.. ఇందుకు పాక్ బోర్డు ససేమిరా అంది.మరోవైపు.. భారత్ కూడా ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ పెద్దలు పాక్తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్గా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మొండివైఖరి ప్రదర్శించగా.. ఐసీసీ కఠినంగా వ్యవహరించకతప్పలేదు.టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాక్ను తరలిస్తామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో దిగివచ్చిన పాక్ బోర్డు.. ఐసీసీ ప్రపోజల్కు సరేనందని.. అయితే, మూడు షరతులు కూడా విధించిందని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఆ మూడు కండిషన్లు ఏమిటంటే?..👉టీమిండియా గ్రూప్ దశలో, సెమీ ఫైనల్స్, ఫైనల్లో(ఒకవేళ అర్హత సాధిస్తే) ఆడేమ్యాచ్లను దుబాయ్లోనే నిర్వహించాలి.👉ఒకవేళ టీమిండియా గనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే.. అప్పుడు సెమీస్తో పాటు ఫైనల్ మ్యాచ్లను లాహోర్లో నిర్వహించేందుకు పాకిస్తాన్కు అనుమతినివ్వాలి.👉ఇక భవిష్యత్తులో భారత్ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లు ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికలపై మ్యాచ్లు నిర్వహించాలి. చదవండి: IND Vs AUS PM XI Test: టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
Champions Trophy: బీసీసీఐ, భారత విదేశాంగ శాఖది ఒకే మాట
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని పునరుద్ఘాటించారు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాక్ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే, ఇరుదేశాల మధ్య పరిస్థితులు, భద్రతాకారణాల దృష్ట్యా బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు ససేమిరా అంటోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలికి కూడా చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్ల కోసం తటస్థ వేదికలను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయిటీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఐసీసీ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. నేటితో చాంపియన్స్ ట్రోఫీ వేదికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లాను మీడియా పలకరించగా.. ‘‘మేము ఈ విషయంలో చర్చలు జరుపుతున్నాం. పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది.ఏదేమైనా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం. హైబ్రిడ్ మోడల్ అనే ఆప్షన్ కూడా ఉంది. అదే కాకుండా ఇంకా వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.#WATCH | Delhi: On Champions Trophy in Pakistan, BCCI vice president & Congress leader Rajeev Shukla says, "Our discussions are going on. A decision will be taken after looking at the situation. Our top priority is the safety of the players. Hybrid mode is also an option,… pic.twitter.com/daIaqIEyZ2— ANI (@ANI) November 29, 2024 విదేశాంగ శాఖ కూడా ఇదే మాటటీమిండియాను పాకిస్తాన్ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్ఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.చదవండి: స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి#WATCH | Delhi: On Indian cricket team participating in Pakistan, MEA Spokesperson Randhir Jaiswal says, "... The BCCI has issued a statement... They have said that there are security concerns there and therefore it is unlikely that the team will be going there..." pic.twitter.com/qRJPYPejZd— ANI (@ANI) November 29, 2024 -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
టీమిండియాలోకి షమీ..? ఇప్పట్లో తొందరేమీ లేదు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మొహమ్మద్ షమీని టీమిండియాలో చేర్చుకుంటారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ మేరకు.. ఇప్పట్లో షమీని హడావుడి జట్టులో చేర్చుకునే పరిస్థితులు లేవు.షమీ విషయంలో వేచి చేసే ధోరణిని అవళంభించాలని బీసీసీఐ భావిస్తుందట. బోర్డు ప్రస్తుత జట్టులోని బౌలర్లతో సంతృప్తిగా ఉందని సమాచారం. షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మరిన్ని మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ కోరుకుంటుంది.కాగా, షమీ ఏడాది గ్యాప్ (గాయం) తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ రంజీ మ్యాచ్లో షమీ 7 వికెట్లు తీసి రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రంజీ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో షమీని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని (అప్పటికే జట్టును ప్రకటించారు) అంతా అనుకున్నారు.తొలి టెస్ట్కు ముందు బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చాయి. షమీ చాలా దగ్గర నుంచి గమినిస్తున్నాము.. అతనికి సంబంధించిన వారితో నిత్యం టచ్లో ఉన్నామని బుమ్రా, మోర్కెల్ అన్నారు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 104, సెకెండ్ ఇన్నింగ్స్లో 238 పరుగులకు కుప్పకూలింది. -
CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై తుది నిర్ణయం ఆ రోజే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్కు శుక్రవారం(నవంబర్ 29 ) తెరపడే అవకాశముంది. ఆ రోజున అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కీలక బోర్డు సమావేశం జరగనుంది.ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వర్చవల్గా జరగనున్న ఈ భేటిలో మొత్తం 12 సభ్య దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాల్గోనున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.కాగా వాస్తవానికి ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్ను ఐసీసీకి పంపింది. కానీ పాక్కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించడంతో షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ మెగా ఈవెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. పీసీబీ మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఏదో ఒక విషయం తెలిపోనుంది.కాగా హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒప్పుకుంటే అదనంగా గ్రాంట్స్ మంజూరు చేసేందుకు ఐసీసీ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అప్పటికి హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరించకపోతే పాకిస్తాన్ నుంచి టోర్నీని వేరే చోటకు ఐసీసీ తరలించే అవకాశముంది. కాగా డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించే ముందు ఈ సమావేశం జరగనుండడం గమనార్హం.చదవండి: 'కోహ్లిలా నిన్ను నువ్వు నమ్ముకో'.. ఆసీస్ స్టార్ ప్లేయర్కు మెంటార్ సలహా -
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు ఇదే లాస్ట్ సిరీస్ అవుతుందా?
-
గౌతమ్ గంభీర్కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
ఆ 457 మంది పేర్లు చకచకా...
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి. వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్రౌండర్లు, వికెట్కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు. తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్గా వ్యవహరించింది. మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. -
గౌతమ్ గంభీర్కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్
చాంపియన్స్ ట్రోఫీ-2025.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా టోర్నీ వేదిక విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ ఐసీసీ ఈవెంట్కు సంబంధించిన ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ దేశంలోనే మ్యాచ్లన్నింటినీ నిర్వహించాలని పట్టుబడుతోంది. మరోవైపు.. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేది లేదని.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మండలికి తేల్చిచెప్పేసింది.తాము ఆడబోయే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం కావాలని ఐసీసీని కోరింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని పంతానికి పోతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మాజీ క్రికెటర్లు టోర్నీ నిర్వహణ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.కోహ్లికి పాకిస్తాన్లో ఆడాలని ఉందిఈ క్రమంలో పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించే అవకాశం లేదని.. ఏదేమైనా చివరిదాకా ఆశావాదంతోనే ఉంటామని పేర్కొన్నాడు. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి కూడా పాకిస్తాన్కు రావాలని ఉందని.. ఇక్కడ గనుక అతడు సెంచరీ చేస్తే కెరీర్ పరిపూర్ణం అవుతుందంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్షిప్ ఇండియా నుంచే‘‘చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంలో మా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తున్నాం. ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్షిప్ ఇండియా నుంచే వస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడు ఈ టోర్నీ గురించి ఇరుదేశాల ప్రభుత్వాలదే తుదినిర్ణయం.బీసీసీఐ గానీ.. పీసీబీ గానీ ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేవు. విరాట్ కోహ్లి మొదటిసారి పాకిస్తాన్లో ఆడాలని కోరుకుంటున్నాడు. పాకిస్తాన్ కూడా అతడు మా దేశంలో ఆడితే చూడాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ గడ్డ మీద విరాట్ సెంచరీ చేస్తే.. ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే జరిగితే అతడి కెరీర్ పరిపూర్ణం అవుతుంది.నమ్మకం లేదుపెద్ద పెద్ద టోర్నీలను పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించలేదనే అపవాదు ఉంది. కనీసం ఈసారైనా అది తప్పని నిరూపించాలని పీసీబీ సిద్ధమవుతోంది. కానీ.. ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో ఇక్కడే జరుగుతుందనే నమ్మకం లేదు. అయితే, చివరి నిమిషం వరకు మేము ఆశలు కోల్పోము. నేనైతే టీమిండియా పాకిస్తాన్కు వస్తుందనే ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్ -
Champions Trophy: పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఎనిమిది జట్లువన్డే వరల్డ్కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్అదే విధంగా.. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీఅంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.ముకుతాడు వేసిన ఐసీసీస్కర్దు, హంజా, మజఫర్బాద్లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు. చదవండి: టచ్లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్ -
పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.నవంబరు 16న ఇస్లామాబాద్లో‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్ నవంబరు 16న ఇస్లామాబాద్లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్బాద్లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్బాద్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రాంతాలు అని.. పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదుఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.తటస్థ వేదికపై నిర్వహిస్తారా?ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్ను పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్లో పంత్ క్లీన్బౌల్డ్! జైస్వాల్ కూడా..Get ready, Pakistan!The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024 -
వచ్చే నెలలో విండీస్తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్కోట్లో ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్లు జరగనున్నాయి. -
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడే.. పాక్ ప్రభుత్వ వైఖరి ఇదే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్లన్నీ ఇక్కడేఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్గా వెల్లడించాడు.ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యంకాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.పాకిస్తాన్లోనే అంధుల టీ20 ప్రపంచకప్ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్ఓసీని జారీ చేసింది. అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్కు బయల్దేరనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్ -
పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!?
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత జట్టును పాకిస్తాన్కు పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని అభ్యర్దించింది. అందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మొడల్లో యూఏఈలో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ..!స్పోర్ట్స్ టాక్ కథనం ప్రకారం.. ఐసీసీ డిమాండ్ను పీసీబీ అంగీకరించకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ తమకు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్ను లాక్ చేయనున్నట్లు సమాచారం.ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.చదవండి: అదొక పగటి కల.. భారత్కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
అదొక పగటి కల.. భారత్కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా తెలియజేసింది.భారత్ ఆడే మ్యాచ్లని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. కచ్చితంగా భారత జట్టు తమ దేశానికి రావల్సేందేనని పీసీబీ మొండి పట్టుతో ఉంది. అయితే టీమిండియా పాక్కు రాదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా పీసీబీకి తేల్చి చేప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ మరో ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ ఆడే మ్యాచ్లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ ఈ ఆఫర్ను అంగీకరించేందుకు పీసీబీ సిద్దంగా లేదని, అందుకు నిరసనగా ఆతిథ్య హక్కులు వదులు కోవాలని భావిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.అదొక పగటి కల..ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హాఫీజ్ మరోసారి భారత్పై విషం చిమ్మాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్కు రావాలనుకోవడం ఒక పగటి కల. ఈ మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్దం ఉంది.భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు. వరల్డ్లోని అన్ని క్రికెట్ దేశాలకు పాకిస్తాన్ స్వదేశంలో ఆతిథ్యం ఇస్తోంది. కానీ ఒక్క భారత్కే మాత్రం ఇక్కడ ఆడటం భద్రత కాదు. ఇందుకు బదులుగా మా ప్రభుత్వం, పీసీబీ నుంచి స్ట్రాంగ్ రిప్లై వస్తుంది అని ఆశిస్తున్నా" హాఫీజ్ ఎక్స్లో రాసుకొచ్చాడు. It was a day dream that India wil come to Pakistan to play #ChampionsTrophy2025. Pakistan is safe & ready to host the event. Pakistan hosting all cricket nations at home but somehow not *secure* for India 😇😇😇. Waiting for strong & surprised response from government & PCB.— Mohammad Hafeez (@MHafeez22) November 11, 2024చదవండి: IND vs AUS: 'బుమ్రా వరల్డ్లోనే బెస్ట్ బౌలర్.. అతడితో అంత ఈజీ కాదు' -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్కప్లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు.. ఐసీసీ రద్దు చేయనుందా!?
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.కాగా ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గోనేందుకు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.దీంతో భారత్ ఆడే మ్యాచ్లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న లహోర్లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయకాగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్డౌన్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఐసీసీ అధికారి ఒకరూ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు."ఈ టోర్నీలో పాల్గోనే జట్లతో పాటు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్లో ఓ ఈవెంట్ నిర్వహించాలని భావించాము. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్ -
‘టీమిండియా పాకిస్తాన్కు రాకపోతే.. మా వైఖరి వేరుగా ఉంటుంది.. ఇకపై’
చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టును దాయాది దేశానికి పంపేందుకు సిద్ధంగా లేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి సంకేతాలు ఇచ్చింది.హైబ్రిడ్ విధానంలో ఈవెంట్ను నిర్వహించాలని..ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని.. హైబ్రిడ్ విధానంలో ఈవెంట్ను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియా తప్పక పాల్గొనాలని.. భారత జట్టు మ్యాచ్ల కోసం లాహోర్ స్టేడియాన్ని సిద్ధం చేశామని చెబుతోంది.సరేనన్న ఐసీసీ?ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం అప్పట్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రోహిత్ సేనను పాక్కు పంపమని పేర్కొంది. అందుకు స్పందనగా ఐసీసీ.. టీమిండియా మ్యాచ్లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.మా వైఖరి వేరుగా ఉంటుందిఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘మేము ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించాం. అయితే, ప్రతిసారి మేము అలాగే చేస్తామని భావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సరైన కారణం చూపించాలి‘‘ఒకవేళ ఏదైనా జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలంటే సరైన కారణం చూపించాలి. టీమిండియా ఇక్కడికి రాకపోవడానికి భద్రతను కారణంగా చూపడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పాకిస్తాన్కు వస్తున్నాయి. ఆ జట్లు పాక్లో టోర్నీ ఆడాలనే తలంపుతో ఉన్నాయి.అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరునిజానికి ఐసీసీ మనుగడకు కారణమే పాకిస్తాన్, ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్లాగే మేము ఆడమని చెప్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు. ఈసారి గనుక టీమిండియా ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. ఈ టోర్నీని బహిష్కరిస్తుంది’’ అని రషీద్ లతీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు.భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదుఇక అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భారత ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడబోదని పేర్కొంటున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్కు వచ్చి సురక్షితంగా వెళ్లగలిగారని.. కానీ టీమిండియా ఆటగాళ్లను పాక్కు పంపే పరిస్థితులు మీ దేశంలో లేవంటూ లతీఫ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు గతేడాది భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
Ind vs SA: అతడు పట్టిందల్లా బంగారమే!.. ఒక్కో మ్యాచ్కు రూ. 73 కోట్లు!
టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్ను 3-0తో వైట్వాష్ చేసింది.అదొక్కటి సానుకూలాంశంఅయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం. మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్వాష్కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్తో సిరీస్ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.ఒక్కో మ్యాచ్తో రూ. 73 కోట్లు! నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్లతో భారత టీమ్ను ఎంపిక చేశారు.టీమిండియాతో టీ20 సిరీస్లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది! ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్బర్గ్- రాత్రి గం.8:30లకుజట్లుసౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్నీల్ బార్ట్మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.భారత్అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్దీప్ సింగ్, జితేశ్ శర్మ.ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది. -
పాకిస్తాన్కు వస్తారా? లేదా?.. ఏదో ఒకటి చెప్పండి! రాకపోతే మాత్రం..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై వచ్చే వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు దాయాది దేశానికి వెళ్లకుంటే.. ఏం చేయాలన్న విషయంపై కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ పర్యటన విషయంలో తమ వైఖరి ఏమిటో చెప్పాలంటూ ఐసీసీతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐ నుంచి రాతపూర్వక సమాధానం కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భద్రతా కారణాల దృష్ట్యాకాగా 2008 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోగా.. మెగా టోర్నీల్లో మాత్రం దాయాదులు ముఖాముఖి తలపడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు కలుగుతోంది.అప్పుడు శ్రీలంకలోఅయితే, ఆసియా వన్డే కప్-2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ సేనను అక్కడికి పంపలేదు. తమ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరగా.. ఆసియా క్రికెట్ మండలి అందుకు అంగీకరించింది. దీంతో టీమిండియా మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి.ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2023 భారత్లో జరుగగా.. పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో ఘోర ఓటమితో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు తమవే గనుక.. టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ కోరుతోంది. అయితే, బీసీసీఐ నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు. భారత ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా తాము అడుగులు వేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశాడు.రాతపూర్వక సమాధానం ఇవ్వండిఅయితే, వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీకి సిద్ధమవుతున్న పీసీబీ.. టీమిండియా తమ దేశానికి వస్తుందో? రాదో అన్న అంశంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. ఐసీసీ సైతం ఈ విషయం గురించి బీసీసీఐని అడిగిందని.. ఒకవేళ భారత బోర్డు నుంచి సమాధానం రాకపోతే వచ్చే వారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఒకవేళ టీమిండియా పాకిస్తాన్కు రాకపోతే మాత్రంఇక టీమిండియా మ్యాచ్లను లాహోర్లో నిర్వహిస్తామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఇప్పటికే చెప్పాడు. ఇదిలా ఉంటే.. బీసీసీఐ తమ జట్టును పాకిస్తాన్కు పంపేందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక కోసం ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంతమొత్తం పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జై షా డిసెంబరు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
బైజూస్కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్క్లాట్ తీర్పు ఇచ్చింది. -
ఇట్స్ బేబీ బాయ్: సర్ఫరాజ్ ఖాన్కు ప్రమోషన్(ఫొటోలు)
-
Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా తిలక్ వర్మ
ఒమన్ వేదికగా జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రైజింగ్ స్టార్, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం అభిషేక్ శర్మ, స్పిన్నర్ రాహుల్ చాహర్ భాగమయ్యారు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ)లకు చోటు దక్కింది. అండర్-19 వరల్డ్కప్-2022లో అదరగొట్టిన ఆల్రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం లభించింది. ఇక ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది.కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.ఎమర్జింగ్ ఆసియా కప్నకు భారత్-ఏ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్. -
‘రంజీ’ సమరానికి వేళాయె!
న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి వేళైంది. నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో 32 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. టెస్టు సీజన్ కారణంగా భారత జట్టు ప్రధాన ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి అందుబాటులో లేకపోగా... వర్ధమాన ఆటగాళ్లు కూడా వివిధ సిరీస్ల వల్ల సీజన్లో అన్నీ మ్యాచ్లు ఆడే పరిస్థితి లేదు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు కొత్తవాళ్లకు ఇదే సరైన అవకాశం. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... స్టార్ ప్లేయర్లు తప్ప మిగిలిన వాళ్లంతా వీలున్న సమయంలో ఈ టోర్నీలో పాల్గొననున్నారు. దేశవాళీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే కారణంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్పై బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో... యువ ఆటగాళ్లు అందరూ రంజీ ట్రోఫీ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తే చాలు జాతీయ జట్టుకు ఎంపికవొచ్చు అనే ఆలోచన ఆటగాళ్లకు రాకుండా... దేశవాళీల్లో రాణిస్తేనే టీమిండియా తలుపులు తెరుచుకుంటాయి అని బోర్డు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ప్లేయర్లు తమ శక్తియుక్తులను వాడేందుకు సిద్ధమయ్యారు. రంజీ సీజన్లోనే భారత జట్టు న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో అసాధారణ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా గడప తొక్కొచ్చు అనే ఆలోచన కూడా ప్లేయర్ల మదిలో ఉంది. హైదరాబాద్ ఆకట్టుకునేనా? గత ఏడాది బలహీన జట్లున్న ప్లేట్ గ్రూప్లో అదరగొట్టి ఎలైట్ డివిజన్కు అర్హత సాధించిన హైదరాబాద్ జట్టు పటిష్ట జట్లతో పోటీపడనుంది. టీమిండియా ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో నేడు ప్రారంభం కానున్న మ్యాచ్లో గుజరాత్తో హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు నాగ్పూర్ వేదికగా విదర్భతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో ప్రతి గ్రూప్లోని ఎనిమిది జట్లు... తక్కిన జట్లతో ఆడనున్నాయి. లీగ్ దశ ముగిశాక నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఎనిమిది జట్లు నాకౌట్ దశ (క్వార్టర్ ఫైనల్స్)కు అర్హత పొందుతాయి. నేడు ప్రారంభం కానున్న లీగ్దశలో తొలి ఐదు లీగ్ మ్యాచ్లు నవంబర్ 16తో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు నెలల విరామం తర్వాత చివరి రెండు లీగ్ మ్యాచ్లు జనవరి 23 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్ను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరిగే ఫైనల్తో రంజీ ట్రోఫీ సీజన్కు తెర పడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు మరోసారి భారీ బలగంతో బరిలోకి దిగుతోంది. దేశవాళీ దిగ్గజంగా గుర్తింపు సాధించిన ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా కీలకం కానున్నారు. ఖాన్ బ్రదర్స్లో... ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా... సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టుకు ఎంపివడం ఖాయమే. ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్కు ముందు భారత ‘ఎ’ జట్టు అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు కూడా పలు మ్యాచ్లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో నయా హీరోలు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జాతీయ జట్టుకు దూరమైన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాతో పాటు... అడపా దడపా జట్టులోకి వచ్చి పోతున్న శ్రేయస్ అయ్యర్, గతంలో మెరుగైన ప్రదర్శన చేయలేక చోటు కోల్పోయిన ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ వంటి వాళ్లు తిరిగి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక యశ్ ధుల్, సారాంశ్ జైన్, విద్వత్ కావేరప్ప, వైశాఖ్ విజయ్ కుమార్ వంటి వాళ్లు సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు సమాయత్తమయ్యారు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ముంబై, బరోడా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కశ్మీర్, సర్వీసెస్, మేఘాలయ, త్రిపుర. గ్రూప్ ‘బి’: ఆంధ్ర, హైదరాబాద్, గుజరాత్, విదర్భ, రాజస్తాన్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి. గ్రూప్ ‘సి’: బెంగాల్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్. గ్రూప్ ‘డి’: తమిళనాడు, ఢిల్లీ, సౌరాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, రైల్వేస్, అస్సాం. ప్రైజ్మనీ ఎంతంటే... విజేత: రూ. 5 కోట్లు రన్నరప్: రూ. 3 కోట్లు సెమీఫైనల్లో ఓడిన జట్లకు: రూ. 1 కోటి చొప్పునమ్యాచ్ ఫీజు ఎంతంటే (తుది జట్టులో ఉన్న వారికి) 40 లేదా అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 60 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 30 వేలు చొప్పున) 21 నుంచి 40 రంజీ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు: రోజుకు రూ. 50 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 25 వేలు చొప్పున) 1 నుంచి 20 రంజీ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు: రూ. 40 వేలు చొప్పున (రిజర్వ్ ప్లేయర్లకు: రూ. 20 వేలు చొప్పున).