
సదస్సులో పాల్గొన్న విద్యార్థులు (ఇన్సెట్) మాట్లాడుతున్న పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రమణ
ఆదోని అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీమ ప్రజలకు అన్యాయం చేసి ద్రోహిగా నిలిచారని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ అన్నారు. గురువారం పట్టణంలోని జార్జిరెడ్డి భవన్లో రాయలసీమ సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాజధాని పేరుతో అమరావతి పిచ్చి పట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా సీమ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రాయలసీమను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు.
రాజధానిని సీమకు రాకుండా చేసి, విభజన హామీల్లో ప్రకటించిన కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు అంశాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. జీఓ 69ని రద్దు చేయకుండా రాయలసీమ రైతాంగాన్ని బలితీసుకుంటున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీమలో విద్యాభిద్ధికి రూ.వంద కోట్లు, సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో నాయకులు నరేష్ ఆచారి, అంజి, రాము, మహేంద్ర, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.