
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు.
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి బాలకృష్ణమచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి మోపిదేవి రమణ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పదవుల నియమాకాల్లోనూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.పదవుల పంపకంలో వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, బాల నాగిరెడ్డి, అన్న బత్తుల శివకుమార్, కిలారు రోశయ్య, ముస్తఫా, వసంత కృష్ణ ప్రసాద్, విడదల రజనీ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు నిర్వహించడానికి ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 16న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు అవకాశం కల్పించారు. 26న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.