విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాముడు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా పుష్కరాలలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్శాఖ సర్వం సమాయత్తమైందని, ఇప్పటికే 52 పుష్కరఘాట్లలో విద్యుద్దీకరణ పనులను ప్రారంభించి పూర్తిచేసే దశలో ఉన్నట్లు జిల్లా విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.రాముడు పేర్కొన్నారు. పుష్కరఘాట్లలో విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడారు.
నిరంతరం అందిస్తాం
– 220మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ
– విద్యుత్ అంతరాయం తెలుసుకునేందుకు వైర్లెస్ సెట్ల వినియోగం
– ‘సాక్షి’ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ ఎస్ఈ కె.రాముడు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా పుష్కరాలలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్శాఖ సర్వం సమాయత్తమైందని, ఇప్పటికే 52 పుష్కరఘాట్లలో విద్యుద్దీకరణ పనులను ప్రారంభించి పూర్తిచేసే దశలో ఉన్నట్లు జిల్లా విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.రాముడు పేర్కొన్నారు. పుష్కరఘాట్లలో విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘సాక్షి’ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో...
రూ.12.73కోట్లతోఏర్పాట్లు
జిల్లాలో 52పుష్కరఘాట్లలో ఏడు ఘాట్లను వీఐపీ, అత్యధిక రద్దీగల ఘాట్లుగా భావించి, అందుకనుగుణంగా విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తున్నాం. గొందిమళ్ల, సోమశిలలో విద్యుత్ సరఫరా పనులను ఇప్పటికే పూర్తిచేశాం. బీచుపల్లి, రంగాపూర్, పాతాళగంగ, సోమశిల సాధారణ ఘాట్లలో విద్యుత్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పుష్కరాల్లో విద్యుత్ అవసరాలు తీర్చడానికి తమ శాఖ రూ.12.73కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే 208ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో బిగించాం. అత్యధిక విద్యుత్ సామర్థ్యం కలిగిన 315 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను 12చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. వీటిని బీచుపల్లిలో 4, రంగాపూర్లో 5, గొందిమళ్లలో 3 ఇప్పటికే ఇప్పటికే బిగించాం.
24గంటల విద్యుత్
పుష్కరఘాట్లున్న గ్రామాల్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. పుష్కరాల్లో విద్యుత్ సేవలు అందించడానికి 220మంది ఉద్యోగులను ప్రత్యేకంగా వినియోగిస్తున్నాం. చీఫ్ ఇంజనీర్స్ సైతం పుష్కరాల్లో పాల్గొని విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తారు. నిరంతరం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఎక్కడైనా బ్రేక్డౌన్ కలిగిస్తే తక్షణం సమాచారం అందేలా ఉండేందుకు వైర్లెస్ సెట్లను ఉపయోగించనున్నాం. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి కోరాం. విద్యుత్ సరఫరా అనుకోకుండా నిలిచిపోయినా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టాం. ఆయా ప్రాంతాల్లో 77జనరేటర్లు ఏర్పాటు చేశాం.
5లోగా పనులు పూర్తి
పుష్కర యాత్రికులకు సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే పార్కింగ్స్థలాల నిర్మాణం, నిర్ధారణ పూర్తికాని ప్రాంతాల్లోనే విద్యుత్ సౌకర్యం కొంత ఆలస్యమైంది. ఈ నెల 5వతేదీ వరకు మా శాఖాపరంగా చేయాల్సిన అన్ని పనులను పూర్తిచేసి ట్రయల్రన్ చేస్తాం. విద్యుత్ వెలుగులు అన్ని ఘాట్లలో పెద్ద ఎత్తున ఉండేలా శక్తివంతమైన లైట్లను వాడుతున్నాం. ప్రతి చోటా 2, 4, 6 స్తంభాల లైన్లను ఏర్పాటు చేసి, ఒక్కొ స్తంభానికి 10 నుంచి 20, 20 నుంచి 40వరకు 400 నుంచి 1000వాట్స్ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరాల్లో తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నాం. ఇందుకోసం ప్రత్యేక టారీఫ్ను రూపొందించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే గొందిమళ్ల వీఐపీ ఘాట్లో నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. జోగుళాంబ దేవత, తెలంగాణ తల్లి వంటి చిత్రపటాలను ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరిస్తాం.
‘‘ఎక్కడ విద్యుత్ అంతరాయం కలిగినా తక్షణమే తెలుసుకునేందుకు ప్రతి పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాం. పుష్కరఘాట్లున్న ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.’’
– కె.రాముడు, విద్యుత్ ఎస్ఈ