Chennai Super King
-
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అన్ని ఫార్మాట్లకు విడ్కోలు పలకనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు ధోని తల్లిదండ్రులు స్టేడియంకు వచ్చారు. దీంతో ఢిల్లీ మ్యాచ్ అనంతరం ధోని రిటైర్ కానున్నాడని వార్తలు వినిపించాయి.కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు చేయకపోయినా సీజన్ అనంతరం మాత్రం ధోని కచ్చితంగా ఐపీఎల్కు గుడ్బై చెప్పునున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై మిస్టర్ కూల్ స్పందించాడు. ఐపీఎల్-2026లో ఆడాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధోని చెప్పుకొచ్చాడు."నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది సీజన్లో ధోనికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తన మార్క్ను మాత్రం చూపించలేకపోతున్నాడు. 4 మ్యాచ్లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా తన జిడ్డు బ్యాటింగ్తో అభిమానులకు విసుగు తెప్పిస్తున్నాడు.ఈ క్రమంలోనే ధోని రిటైర్ అయ్యి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని పలువరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే జట్టు సైతం తీవ్ర నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట సీఎస్కే ఓటమి పాలైంది. చెన్నై తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 8న చంఢీగడ్ వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. -
ఆడుదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్..!
-
చెన్నైకే చెల్లింది
ఐపీఎల్ అంటే ‘ఫైనల్లో చెన్నైతో తలపడేందుకు మిగతా ఏడు జట్లు లీగ్లో పోటీ పడుతుంటాయి’.... ఈ పాపులర్ డైలాగ్లో ఎంత వాస్తవం ఉందో మరోసారి కనిపించింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, విజయంపై ఎలాంటి ఆశలు లేని స్థితిలో నిలిచినా... అక్కడి నుంచే ఆటను మలుపు తిప్పి గెలుపు బొమ్మను జేబులో వేసుకోవడం చెన్నైకి చెల్లినంతగా మరెవరికీ సాధ్యం కాదేమో. వాట్సన్ విఫలం, రాయుడు డకౌట్, లెక్క లేనన్ని సార్లు జట్టును గెలిపించిన రైనా వల్ల కాలేదు, ధోని, బ్రేవో కూడా చేతులెత్తేశారు... కానీ సన్రైజర్స్తో క్వాలిఫయిర్లో ఆ జట్టుకు కొత్త హీరో దొరికాడు. లీగ్లో నాలుగు మ్యాచ్లే ఆడిన డు ప్లెసిస్ అసలు పోరులో నిలిచాడు... ఓటమి అంచుల్లోంచి చెన్నైని తప్పించి ‘చోకర్’ ముద్ర పడకుండా జట్టును గెలిపించిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడంటే అది కూడా చెన్నై మహత్యమేనేమో! చెన్నై విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. సన్రైజర్స్ కెప్టెన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం మ్యాచ్ దిశను మార్చేసింది. బ్రాత్వైట్ వేసిన 18వ ఓవర్లో 20 పరుగులు రాబట్టిన ఆ జట్టు, కౌల్ వేసిన 19వ ఓవర్లో మరో 17 పరుగులు తీసింది. చివరి ఓవర్ భువీ వేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. ధోని తరహాలో సిక్సర్తో మ్యాచ్ను ముగించి డు ప్లెసిస్ సూపర్ కింగ్స్ను ఏడోసారి ఫైనల్ చేర్చాడు. బ్యాటింగ్ వైఫల్యంతో 139 పరుగులకే పరిమితమైన హైదరాబాద్ తమ బలమైన బౌలింగ్తో ఒక దశలో గెలుపునకు చేరువగా వచ్చినా చివరకు చతికిలపడింది. బ్యాటింగ్లో ఒకే ఓవర్లో 20 పరుగులు బాది సన్ ఆశలు నిలిపిన బ్రాత్వైట్, ఆ తర్వాత అన్నే పరుగులు బౌలింగ్లో ఇవ్వగా... బౌలింగ్లో 50 పరుగులు సమర్పించి విలన్గా మారబోయిన శార్దుల్ ఠాకూర్ చివరి క్షణాల్లో మూడు ఫోర్లతో జట్టు రాత మార్చాడు. మ్యాచ్ ఓడినా ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్ రూపంలో సన్రైజర్స్కు మరో అవకాశం మిగిలే ఉంది. ముంబై: ఎందుకో, ఏమో కాని ధోని నాయకత్వం వహించే జట్టులో ఓ ప్రత్యేకత కనిపిస్తుంటుంది. అప్పటిదాక ఎలా ఆడినా, తన సారథ్యంలో ఆటగాళ్లు విశేషంగా రాణిస్తుంటారు. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ మ్యాచే దీనికి ఉదాహరణ. ప్రత్యర్థి బౌలర్ల దెబ్బకు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని పరిస్థితుల్లో పడిన చెన్నై సూపర్కింగ్స్... అసాధారణ రీతిలో పుంజుకుని ఏకంగా మ్యాచ్నే గుంజేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ డు ప్లెసిస్ (42 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ, అద్భుత ఇన్నింగ్స్కు తోడు శార్దుల్ ఠాకూర్ (5 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) మెరుపు దాడితో ఆ జట్టు ఐదు బంతులుండగానే ఛేదనను పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కార్లోస్ బ్రాత్వైట్ (29 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ విలియమ్సన్ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు) రాణించాడు. చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. ఆరంభం నుంచే తడబ్యాటు... సన్రైజర్స్ జట్టులో జోరు మీదున్నది ఇద్దరే బ్యాట్స్మెన్. వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (0) దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. అయితే, విలియమ్సన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి ఓవర్ను ఘనంగా ముగించాడు. మరో ఎండ్లో ఇన్గిడిని కాచుకుంటూ రెండు బౌండరీలు బాదిన శ్రీవత్స్ గోస్వామి (12) అతడికే వికెట్ ఇచ్చుకున్నాడు. తర్వాత మూడు బంతులకే ఇంకో పెద్ద దెబ్బ. లెగ్ సైడ్ వెళ్తున్న శార్దుల్ బంతిని వెంటాడిన విలియమ్సన్ మూల్యం చెల్లించుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 47/3. రెండు ఓవర్లు ఎదురొడ్డిన షకీబ్ (12) సైతం కెప్టెన్ తరహాలోనే అవుటయ్యాడు. యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), మనీశ్ పాండే (8) వికెట్ పడకూడదన్నట్లు ఆడారు. వీరి భాగస్వామ్యంలో 29 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా లేకపోవడంతో రన్రేట్ 6కు పడిపోయింది. ఇంతలో పాండే... జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో జట్టు సగం వికెట్లు కోల్పోయింది. వేగం పెంచే యత్నంలో ఉన్న పఠాన్ను బ్రేవో తన బౌలింగ్లోనే చక్కటి క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. 15 ఓవర్లకు 88/6తో ఉన్న హైదరాబాద్... స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరూ లేకపోవడంతో కనీస స్కోరైనా చేస్తుందా? అనిపించింది. కానీ, బ్రాత్వైట్, భువనేశ్వర్ (7) నిలిచారు. శార్దుల్ వేసిన 18వ ఓవర్లో ఇన్నింగ్స్ తొలి సిక్స్ బాది జట్టు స్కోరును 100 దాటించిన బ్రాత్వైట్ మరుసటి బంతినీ అదే విధంగా బాది ఊపు తెచ్చాడు. ఇన్గిడి కట్టడి చేసినా... 20వ ఓవర్లో శార్దుల్ మరోసారి బలయ్యాడు. బ్రాత్వైట్ రెండు సిక్స్లు, ఫోర్ సహా 20 పరుగులు పిండుకోవడంతో సన్రైజర్స్కు పోరాడగల స్కోరు దక్కింది. చివర్లో టాప్ గేర్లోకి... సూపర్కింగ్స్ ఇన్నింగ్స్ సన్రైజర్స్ ఇన్నింగ్స్ను తలపిస్తూ మొదలైంది. ఓపెనర్ వాట్సన్ (0)... భువనేశ్వర్ను ఆడేందుకు తీవ్రంగా ఇబ్బందిపడి ఐదో బంతికే క్యాచ్ ఇచ్చాడు. బౌండరీలతో పరిస్థితిని తేలిక చేస్తున్న రైనా (13 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను, మ్యాచ్కే హైలైట్ అనదగ్గ యార్కర్తో రాయుడు (0)ని వరుస బంతుల్లో బౌల్డ్ చేసిన కౌల్ దెబ్బతీశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు 33/3తో నిలిచింది. ఓవైపు డు ప్లెసిస్ పాతుకుపోయినా... ధోని (9), బ్రేవో (7), జడేజా (3) బంతులు మింగడం తప్ప స్కోరు చేయలేకపోయారు. అయితే, చహర్ (10) తోడుగా ఏడో వికెట్కు డు ప్లెసిస్ 30 పరుగులు జోడించి సూపర్ కింగ్స్ను పోటీలోకి తెచ్చాడు. ఐదు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్భజన్ (2) బంతులను వృథా చేయడంతో మ్యాచ్ మళ్లీ సన్రైజర్స్ వైపు మొగ్గింది. అయితే, బ్రాత్వైట్ వేసిన 18వ ఓవర్లో డు ప్లెసిస్ మూడు ఫోర్లు, సిక్స్ సహా 20 పరుగులు రాబట్టడం, భజ్జీ రనౌట్తో క్రీజులోకి వచ్చిన శార్దుల్... కౌల్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు చేయడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా భువీ వేసిన తొలి బంతినే సిక్స్ బాది డు ప్లెసిస్ తన శ్రమకు సరైన ముగింపు ఇచ్చుకున్నాడు. ►7 చెన్నై ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది ఏడో సారి. రెండు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు నాలుగు ఫైనల్స్లో ఓడింది. ► 8 ధోనికి ఇది ఎనిమిదో ఫైనల్. చెన్నైతో పాటు 2017లో అతను ఆడిన పుణే సూపర్ జెయింట్ ఫైనల్ చేరింది. ఏ ఆటగాడికైనా ఇదే అత్యధికం. -
చెన్నై సూపర్ కింగ్...
సాక్షి క్రీడావిభాగం రవిచంద్రన్ అశ్విన్ మంచినీళ్ల ప్రాయంలా వరుస పెట్టి వికెట్లు తీయడం కొత్త కాదు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు సింహస్వప్నంలా మారి కొత్త కొత్త రికార్డులు సృష్టించడం కూడా అతనికి ఇప్పుడు వాకింగ్కు వెళ్లినంత సాధారణంగా మారిపోయింది. తాజాగా వచ్చిన ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా అతని అబ్బురపరిచే గణాంకాలకు లభించిన మరో గౌరవం. కానీ అశ్విన్ అంటే సాధారణ బౌలర్ మాత్రమే కాదు. అతడు ఒక జీనియస్. అతని ఖాతాలో వచ్చి పడిన ప్రతీ వికెట్ వెనక ఒక కథ ఉంటుంది. సాధారణంగా టీమ్ సమావేశాల్లో, కోచ్ చెప్పే సూచనలతో అమలు చేసే వ్యూహాలకు అశ్విన్ తన సొంత ఇంజనీరింగ్ బుర్రను జోడిస్తాడు. ఒక మంచి బ్యాట్స్మన్ను అవుట్ చేయాలంటే ఎంతగా శ్రమించాలో అంతగా హోంవర్క్ చేసి మైదానంలోకి అడుగు పెడతాడు. తాను వేసే ప్రతీ బంతి తన ఆఖరి బంతి అన్నంత కసితో బౌలింగ్ చేస్తాడు. గత ఏడాది సంగక్కరను నాలుగు ఇన్నింగ్స్లలో నాలుగు సార్లు అవుట్ చేయడం అయినా... ఇంగ్లండ్తో సిరీస్లో రూట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చే బలహీనతను గుర్తించి దానికి తగినట్లుగా బంతిని సంధించడం అయినా... వారిని అవుట్ చేయడంలో అతను చెప్పిన విశ్లేషణ అబ్బురపరుస్తుంది. అవసరానికి, పరిస్థితులకు తగినట్లుగా అతను తనను తాను మలచుకున్న తీరు అశ్విన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముందు బ్యాట్స్మన్గా మొదలు పెట్టి, ఆ తర్వాత కాస్త మీడియం పేస్ బంతులు వేయగలిగిన బౌలర్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్స్పిన్నర్లలో ఒకడిగా ఎదిగాడు. తన మార్క్నుంచి రనప్ మొదలు పెట్టడం నుంచి మ్యాచ్ ముగిసే వరకు తాను ప్రతీ బంతి ఎలా వేశాడో మైండ్లో ఫిక్స్ చేసుకోగలిగిన అశ్విన్, వేలాది గంటల నెట్ ప్రాక్టీస్కంటే విలువైన పాఠాలు మ్యాచ్నుంచే నేర్చుకుంటాడు. స్కూల్ స్థాయి క్రికెట్లోనే తనకు ఫలానా విధంగా ఫీల్డింగ్ కావాలంటూ కోచ్తో వాదన పెట్టుకున్న అశ్విన్కు తన తెలివితేటలపై అపార నమ్మకం ఉంది. జిమ్లో ఎన్ని గంటలు గడిపినా సహచరులతో పోలిస్తే మైదానంలో చురుగ్గా మారలేనని గుర్తించిన అతను, ఆటకు అవసరం కాబట్టి వికెట్ల మధ్య పరుగెత్తడంలో ప్రత్యేక కోచ్ను పెట్టుకొని మరీ సాధన చేశాడు. ఒక దశలో వరుసగా ఆరు టెస్టుల్లో అతడికి అవకాశం దక్కని సమయంలోనూ నేను అత్యుత్తమ బౌలర్గా ఎదుగుతాను అంటూ తన యాక్షన్ను మార్చుకొని మరీ సంచలనాలకు శ్రీకారం చుట్టడం అశ్విన్కే సాధ్యమైంది. బౌలింగ్లో అద్భుతాలు సృష్టిస్తున్న సమయంలోనూ నాకెందుకీ బ్యాటింగ్ తలనొప్పి అన్నట్లుగా అతను దూరం జరిగిపోలేదు. బ్యాటింగ్ను కూడా అంతే ప్రేమించాడు. అదే స్థాయిలో కష్టపడి ఇప్పుడు బ్యాట్స్మన్గా కూడా అవతలి జట్టుకు చెమటలు పట్టిస్తున్నాడు. క్రికెట్కు సంబంధించిన ప్రతీ సూక్ష్మమైన అంశంపై అతనికి పట్టుంది. తాను మ్యాచ్ ఆడని సమయంలో టీవీలో చాలా ఎక్కువగా క్రికెట్ చూస్తాడు. అది జింబాబ్వే ఆడుతున్న సిరీస్ అయినా సరే. ఏదో సరదా కోసమో, పేపర్లో ఫొటో కోసమో కాకుండా ఆటపై ఇష్టంతో ఇటీవలే చెన్నైలో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు. అక్కడ కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడినంత సీరియస్గా తన దూస్రాలతో బ్యాట్స్మెన్ను అవుట్ చేయడమే లక్ష్యంగా శ్రమించాడు. నా ఆట తప్ప నేనేమీ పట్టించుకోను అంటూ చెప్పుకునే టైపు క్రికెటర్ కాదు అతను. అతను పత్రికలు చదువుతాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తాడు. అది పిచ్పై వచ్చిన విమర్శలపై అయినా, చకింగ్ గురించైనా, లేదంటే హర్భజన్తో పోలిక అయినా సరే. తాజాగా ముంబై టెస్టులో తన కెప్టెన్పై అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై అతనితోనే నేరుగా తలపడటం అశ్విన్ ముక్కుసూటితనాన్ని చూపిస్తుంది. మీడియా సమావేశంలో కూడా డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా జవాబివ్వడంలో అశ్విన్ తర్వాతే ఎవరైనా. ట్విట్టర్ను ఏదో నామ్కే వాస్తేగా వాడకుండా దానిని సమర్థంగా వినియోగించే భారత క్రికెటర్ అశ్విన్ ఒక్కడే. ఎంతటి కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత కూడా ఇతర తమిళనాడు క్రికెటర్ల తరహాలో హై క్లాస్ ఏరియాలోకి మారకుండా అతను తన పాత లొకాలిటీలో, అదే ఇంట్లో ఇప్పటికీ ఉంటున్నాడు. అసంఖ్యాకమైన చెన్నైయిన్లలాగే రజినీకాంత్, కమల్హాసన్లతో పాటు ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే ఈ స్టార్ ఆటగాడు భారత క్రికెట్పై వేసిన ముద్ర ప్రత్యేకం.