Illarikam
-
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
‘ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే...భలే ఛాన్సులే’ అంటుంది సుపరిచిత సినిమా పాట. ‘మజా’ సంగతి ఎలా ఉన్నా ‘ఇల్లరికం అల్లుడు’ అంటే మజాకా కాదు. అత్తామామలను కన్నతల్లిదండ్రుల్లా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు మద్నూర్ మండల ఇల్లరికం అల్లుళ్లు...మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల్లీకో నలుగురు ఇల్లరికం అల్లుళ్లు ఉంటారు. అందులో రెండు మూడు తరాల వాళ్లున్నారు. ఒకటి రెండు కుటుంబాల్లో మామ, అల్లుడు ఇద్దరూ ఇల్లరికం వాళ్లే ఉన్నారు. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్లు తమ బంధువుల అబ్బాయిలను, తెలిసిన వాళ్ల అబ్బాయిలను, బంధుత్వం లేని వాళ్లను కూడా ఇల్లరికం తెచ్చుకుని వారికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారు.అత్తగారి ఇల్లే....అమ్మగారి ఇల్లుఇల్లరికం వచ్చిన అల్లుల్లు అత్తారింటిలో భాగం అయిపోతారు. ఇక్కడి ఇంటి పేరే వారి ఇంటి పేరుగా మారిపోతుంది. సంతానం లేని కుటుంబాల్లో దగ్గరి బంధువుల అమ్మాయిని దత్తత తీసుకుని, వేరే అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుని పెళ్లిచేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు అన్నీ తామై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అల్లుడే కుమారుడై...మగ సంతానం లేకపోవడంతో ఇల్లరికం అల్లుడిని తెచ్చుకునే పద్ధతిని చాలామంది పాటిస్తున్నారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయడంతో పాటు, వృద్ధాప్యంలో అత్తామామలకు ఆసరాగా ఉంటున్నారు అల్లుళ్లు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.మంచిగ చూసుకుంటరు...తాడిచెట్లవార్ సచిన్ సొంతూరు మహారాష్ట్రలోని సావర్మల్. అత్తమామలు తాడిచెట్ల అంజయ్య, రుక్మిణిలకు మగసంతానం లేరు. 2021లో సచిన్ను ఇల్లరికం తెచ్చుకున్నారు. ‘మా అత్తామామలకు కొడుకు, అల్లుడు అన్నీ నేనే. వ్యాపారం చూసుకుంటాను. ఇంటి వ్యవహారాలన్నీ నేను చూస్తాను. అందరం చాలా బాగా ఉంటాం’ అంటున్నాడు సచిన్.‘మాది మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా. మా అత్తమామలకు ఒకతే ఆడపిల్ల కావడంతో 2022లో నన్ను ఇల్లరికం అల్లుడిగా తీసుకుని పెళ్లి జరిపించారు. ఇంట్లో అందరూ మంచిగ చూసుకుంటరు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఇంట్లో అందరి సహకారం బాగుంది. ఎవరూ తేడా చూపరు’ అంటున్నాడు కన్నవార్ మణికంఠ.‘2003 లో నేను ఇల్లరికం వచ్చాను. అల్లుడినైనా కొడుకులాగా మా అత్తామామలను చూసుకోవాలి. ఏ ఇబ్బందీ లేకుండా సంతోషంగా ఉన్నాం’ అంటున్నాడు గంపల్వార్ నాగనాథ్.‘నాకు ముగ్గురు పిల్లలు. వాళ్లను బాగా చదివిస్తున్నాను. మా అత్తమామ నన్ను కొడుకులా చూసుకుంటారు. నాకు వాళ్లే తల్లిదండ్రులు’ అంటున్నాడు గడ్డంవార్ మల్లికార్జున్. ఇవన్నీ చూస్తుంటే మనం మొదట్లో పాడుకున్న పాటకు తగ్గట్టే ఉన్నారు అనిపిస్తోంది కదా!మామ... అల్లుడు ఇద్దరూ ఇల్లరికమే...మద్నూర్లో గడ్డంవార్ నడిపి గంగారాం 1966లో ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. ఆయనే ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు పెళ్లిళ్లు చేసిన తరువాత నాలుగో కూతురికి ఇల్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నారు. 2000 సంవత్సరంలో మల్లికార్జున్ను ఇల్లరికం తెచ్చుకుని నాలుగో కూతురితో పెళ్లి జరిపించాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మళ్లికార్జున్ చూసుకుంటున్నాడు.అల్లుళ్ల సంఘం!మద్నూర్ మండల కేంద్రంలో ఇల్లరికం అల్లుళ్లు కలిసి ఒక సంఘం పెట్టుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఊళ్లో ఇల్లరికం అల్లుళ్ల పేర్లతో జాబితాను రూపొందించుకున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి వంటి పదవులకు కూడా పేర్లు నిర్ణయించుకున్నారు. ఎందుకోగానీ సంఘం పెట్టుకోవాలనే వారి కల కలగానే మిగిలిపోయింది. చిన్న చూపు చూడలేదు... చిన్న సమస్యా రాలేదుమా ఆయన ఇల్లరికం వచ్చిండు. మాకు అందరు బిడ్డలే. మేమూ అల్లున్ని ఇల్లరికం తెచ్చుకున్నం. ఎప్పుడు గూడా చిన్న సమస్య రాలేదు. అందరం మంచిగనే ఉంటం. ఇల్లరికం అని ఎవరినీ ఎవరూ చిన్న చూపు చూడలేదు. కలిసి మెలిసి ఉండి ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటరు. – గడ్డంవార్ చంద్రకళ – ఎస్. వేణుగోపాలాచారి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
ఇల్లరికంలో ఉంది మజా!
అత్తారింటికి దారి.. కడియపు సావరం! ఉపాధి కరువై.. బతుకు భారమై.. ఉన్న ఊరిని వదిలి వలస వచ్చేస్తున్నవారికి ఆ ఊరు.. కల్పవృక్షం. ఏడాదిలో 365 రోజులూ చేతి నిండా పని, రెండు చేతులా సంపాదిస్తూ శ్రీమంతులు కావాలంటే ఆ ఊరిలో అడుగుపెట్టాల్సిందే.. అంతేనా చక్కనైన కుందనపు బొమ్మల్లాంటి యువతులను పెళ్లి చేసుకోవడానికి దారీ అదే‘ఇల్లరికంలో ఉంది మజా’ అంటూ పాటేసుకుంటూ.. ఆ మజాను ఆస్వాదించాలన్నా ఆ ఊరికి దారి తీయాల్సిందే..పూల మొక్కలతో.. నర్సరీలతో అలరారే ఆ అందమైన ఊరు.. కడియపు సావరం.. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కుగ్రామం ఇల్లరికపు అల్లుళ్లకు కేరాఫ్ అడ్రస్గా భాసిల్లుతోంది.. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు ఆ గ్రామంలోని పూల మొక్కలు, నర్సరీల్లోని పనులను ఆలంబనగా చేసుకుని 365 రోజులూ పనులు చేసుకుంటున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదిస్తూ భార్యాభర్తలిద్దరూ ఆడుతూపాడుతూ పనులు చేసుకుంటూ సంపన్నులవుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు.. పొలం, పుట్ర కొనుక్కుంటున్నారు.. ఇళ్లు కట్టుకుంటున్నారు.. పిల్ల లకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. స్వగ్రామంలో పూట గడవని స్థితిని ఎదుర్కొన్న వీరంతా కడియపు సావరంలో కాలరెగరేసుకుని జీవిస్తున్నారు. మొత్తంగా కడియపు సావరం ప్రజలు తమ గ్రామ అల్లుళ్లకు నర్సరీలు, పూలమొక్కల పెంపకం పనులు ఇస్తూ, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా ఆ గ్రామం ఇల్లరికం అనే పదానికి అర్థాన్నే మార్చేసింది. వివాహాలు ఇలా ప్రారంభం.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు అక్కడే ఏళ్ల తరబడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వీరిలో బుద్ధిమంతులైన కొందరు యువకులకు ఆ గ్రామంలోని రైతులు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడం ప్రారంభమైంది. అలాగే ఇతర ప్రాంతాల యువకులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం జరిపించిన రైతులు వారినీ తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఇలా ఉపాధిని వెతుక్కుంటూ సుమారు 500 నుంచి 700 మంది వరకు అల్లుళ్లు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కుగ్రామమైన కడియపు సావరంలో గత కొన్నేళ్ల నుంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చేతినిండా పని.. బతుకుపై భరోసా కడియం మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు పూలు, పండ్లు, కూరగాయ మొక్కల పెంపకం, నర్సరీలే జీవనాధారం. ఆ మండలంలోని 13 గ్రామాల్లో ఏడు వందల నర్సరీలు ఉన్నాయి. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు మొక్కలను విక్రయిస్తున్నారు. వీటితోపాటు కల్యాణ మండపాలు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ అభివృద్ధి వంటి అనేక రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎంత సంపాదించినా స్త్రీ, పురుష అనే భేదం లేకుండా రోజుకు రెండు మూడు గంటలు నర్సరీలో పనిచేయాల్సిందే. చేతినిండా పని, బతుకుపై భరోసా కల్పిస్తుండటంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వేలాది మంది కార్మికులు వలస వచ్చారు. మరోవైపు సమాజం ఆధునిక పోకడల వైపు పయనిస్తుండటంతో ఇక్కడి యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్న యువత పూల మండపాల అలంకరణపై దృష్టి పెడుతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఉండి విభిన్న రీతుల్లో మండపాలను రూపొందిస్తున్నారు. ఇద్దరం కష్టపడుతున్నాం మాది అల్లవరం మండలం గూడతిప్ప. పదేళ్ల క్రితం పెళ్లైంది. మా అత్తగారి ఊరు కడియపు సావరం. మా ఏరియాలో పనులు తగ్గిపోవడం, కూలీ గిట్టుబాటు కాకపోవడంతో పెళ్లైన కొత్తలోనే ఇక్కడకు వచ్చేశాం. ఇద్దరం కష్టపడుతున్నాం. చేతినిండా పని దొరుకుతోంది. నేను వ్యవసాయ పనుల్లోకి వెళుతుంటే, మా ఆవిడ వెంకట లక్ష్మి పూలు గుచ్చి రైతులకు అందిస్తోంది. ఇటీవలే మేం సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం. మేం చాలా ఆనందంగా జీవిస్తున్నాం. ఈ ఊరు మాకు బతుకుపై భరోసా కల్పించింది. – డాబా లక్ష్మణస్వామి, కడియపు సావరం