principal suspended
-
జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
ఆత్మకూరురూరల్ : గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. గత నెల 24వ తేదీన గురుకుల పాఠశాలలో చదువుతున్న కోటకు చెందిన ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలుత ఐటీడీఏ పీఓ కమలకుమారి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, ఎస్ఐ ఎం.పూర్ణచంద్రరావు విచారణ నిర్వహించారు. గురుకుల పాఠశాలల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి విచారణ నిర్వహించారు. ఈ నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ కె.మురళీకష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు పంపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను అతని ఇంటి తలుపులకు అంటించారు. నాలుగేళ్లుగా ఆ ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాడు.