అవుట్ సమయాలు మార్చాలి
డ్యూటీ ఇన్టైం కొనసాగిస్తూనే అవుట్ టైం తగ్గించాలి. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంచాలి. రెండో షిఫ్టు సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలి. కొందరు ఆపరేటర్లు ఏసీలో పనిచేస్తున్నారని సాకు చూపుతూ మిగ తా వారందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదు.
– రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు, హెచ్ఎంఎస్
అనుకూలంగా ఉండాలి
ఓసీపీ కార్మికులకు అనుగుణంగా షిఫ్టు వేళలు మార్చాలి. గతంలో కొనసాగిన పద్ధతి అనుసరించాలి. గత వేసవి కన్నా ఈసారి మేలో ఎండలు మండిపోతున్నాయి. క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రఅస్వస్థతకు గురవుతున్నారు. ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది.
– సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
సీఎండీతో మాట్లాడతాం
గత వేసవిలో అనుసరించిన పద్ధతి ఇప్పుడూ కొనసాగించాలి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4 నుంచి రాత్రి 11గంటల వరకు రెండో షిఫ్టు గతంలో అమలు చేశారు. సోమవారం సీఎండీతో మాట్లాడతాం. పాత పద్ధతి కొనసాగించకపోతే యాజమాన్యంతో పోరాటం చేస్తాం.
– వాసిరెడ్డి సీతారామయ్య,
అధ్యక్షుడు, ఏఐటీయూసీ
● క్వారీల్లో మండుతున్న ఎండలు
● 50 డిగ్రీల సెల్సియస్పైనే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
● విధులు నిర్వర్తించేందుకు జంకుతున్న కార్మికులు
● షిఫ్ట్ సమయాలు మార్చాలని డిమాండ్
గోదావరిఖని: పైన మండుటెండ, క్వారీలో రగులుతున్న బొగ్గు వేడితో ఓసీపీల్లో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండు రోజులు విధులకు గైర్హాజరవుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం గతంలో మే నెలలో షిఫ్టు సమయాలు మార్చేది. ఈసారి ఎండలు మండుతున్నా దృష్టి సారించడం లేదు.
46 డిగ్రీల సెల్సియస్కు పైగానే
ఉష్ణోగ్రతల నమోదు..
● గోదావరిఖని పరిసరాల్లో వారం రోజులుగా 46 డిగ్రీల సెల్సియస్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
● ఓసీపీల్లో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని కార్మికులు చెబుతున్నారు.
● బయటి ఎండలకు తోడు క్వారీలోని బొగ్గు వేడికి పనిస్థలాల్లో విధులు నిర్వర్తించలేక కార్మికులు నీరసించిపోతున్నారు.
● వర్క్షాప్ల్లో పనిచేసే కార్మికులు, క్వారీల్లోని కేబుల్బాయ్లు, ఓబీ బ్లాస్టింగ్ సిబ్బంది, ట్రిప్మెన్ తదితర విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఎండవేడికి తల్లడిల్లి పోతున్నారు.
● సింగరేణి యాజమాన్యం భారీ యంత్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నా.. బ్లాస్టింగ్, సర్వే, ఓబీ కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
● ఈక్రమంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4గంటల నుంచి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ పెరుగుతోంది.
ప్రత్యామ్నాయం చూడాలి..
ఓసీపీల్లో షిఫ్టు వేళలు మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఉదయం షిఫ్టు 1గంట వరకు పూర్తి చేసి, రెండో షిఫ్టు సాయంత్రం 4గంటల తర్వా త ప్రారంభించాలని కార్మికులు కోరుతున్నారు. అయితే సింగరేణి యాజమాన్యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు విరామం ప్రకటిస్తామని చెబుతోంది. మూడు షిఫ్టుల సమయాలు మార్చి కొనసాగిస్తామని అంటోంది. దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
సవరించిన సమయాలివే
ఎండలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం సోమవారం నుంచి షిఫ్టు సమయాలు మార్చుతోంది. ఉదయం 6గంట నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మొదటి షిఫ్టు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టు కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు సమయాలను కూడా ప్రకటించింది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.