
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.