
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి త ర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
మంగళవారం ఉదయానికి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదు చ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి.