
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. ‘‘జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు దేశవ్యాప్తంగా వివిధ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
మరింత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి గోయల్ నరేంద్ర మోదీ కేబినెట్లో ఎన్నో శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వీటికే ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. పైగా రాజ్యసభ నేతగానూ గోయల్ పనిచేస్తున్నారు’’అని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ గతంలో పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ పనిచేశారు.