
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ...
● దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు మంజూరు చేశారు కదా, ఇప్పుడెందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు.మేజర్, మైనర్ మినరల్స్కు ఒకే రకమైన నిబంధనలు విధించడం వల్ల మైనర్ మినరల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి.
– జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
● రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారు. – సుంకన్న, వెల్దుర్తి జెడ్పీటీసీ
● పచ్చ చొక్కాల వారికే మినీ గోకులాలను మంజూరు చేస్తున్నారు. పశువులు ఉన్న రైతులకు మంజూరు చేస్తే బాగుంటుంది.
– బి.పులికొండనాయక్, తుగ్గలి జెడ్పీటీసీ
● ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు నీటిని నందికొట్కూరు ఊరుబయట నుంచి తీసుకువెళ్లాలి. ఊర్లో పైప్లైన్లు వేస్తే తాగునీటికి సంబంధించిన సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్, వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
– పి.జగదీశ్వరరెడ్డి, జూపాడుబంగ్లా జెడ్పీటీసీ
● గడివేముల–బూజనూరు రోడ్డును బాగు చేయండి.
– గడివేముల జెడ్పీటీసీ ఆర్బీ చంద్రశేఖర్రెడ్డి
కేసీ, తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో అందని నీరు
● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో
చైర్మన్ పాపిరెడ్డి
● ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు
రూ.1.54 కోట్ల జెడ్పీ నిధులు
● జెడ్పీ ముందున్న హోర్డింగ్స్
తొలగింపుకు ఆమోదం
● కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘాలు
వాయిదా
కర్నూలు(అర్బన్): ‘‘కేసీ కెనాల్, తెలుగుగంగ నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఆయకట్టు రైతులు నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ కింద లక్ష ఎకరాలకు, తెలుగుగంగ కింద 84 వేల ఎకరాలకు నీరిచ్చామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడతారు. రైతుల కష్టాలను పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఆ కథనాలు అవాస్తవమా?’’ అని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఆర్ఎంబీ నిబంధనల మేరకు కొంత ఒడిదుడుకుల మధ్య నీటిని అందించామని ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానం పట్ల చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేట్ చేయరాదనే అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశంలో ప్రభుత్వం ద్వారా ఎందుకు చెప్పించలేకపోయారని ప్రశ్నించారు. జూరాల నుంచి 1700, సుంకేసుల నుంచి 300 టీఎంసీలు (మొత్తం 2 వేల టీఎంసీలు) శ్రీశైలానికి వెళ్లినా, మనం ఉన్న రిజర్వాయర్లలో ఎందుకు నీటిని నిల్వ చేసుకోలేకపోయామరు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గడిచిన స్థాయీ సంఘ సమావేశాల్లో చర్చించిన నేపథ్యంలోనే గాజులదిన్నె ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం వల్ల కోడుమూరు, తదితర ప్రాంతాల రైతులు, ప్రజలకు ఎంతో ఉపయోకరంగా ఉందన్నారు.
తాగునీటి అవసరాలకు
జెడ్పీ నిధులు రూ.1.54 కోట్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా పరిషత్ నుంచి రూ.1.54 కోట్లను మంజూరు చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి 46 పనులను గుర్తించి మంజూరు చేశామన్నారు. ఈ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆయన కోరారు. మొత్తం పీఆర్, ఆర్డబ్ల్యూఎస్కు 352 పనులు కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 21 పూర్తయ్యాయని, మిగిలిన 331 పనులను జూన్, జూలై నాటికి పూర్తి చేయాలన్నారు.
జెడ్పీ ముందున్న
హోర్డింగ్స్ తొలగింపునకు ఆమోదం
జిల్లా పరిషత్ భవనం ముందు భాగాన ఉన్న హోర్డింగ్స్ను తొలగించేందుకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ హోర్డింగ్స్కు సంబంధించి ఒక చదరపు అడుగు రూ.212 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇదే ఏడాది జూన్ 30వ తేదీ వరకు చెల్లించాలని జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో తీర్మానం చేశారు. అయితే హోర్డింగ్స్ ఏజెన్సీ ఒక చదరపు అడుగుకు రూ.100 మాత్రమే చెల్లించగలమని చెప్పడం వల్ల ఈ నెల 16వ తేది వరకు ఒక చదరపు అడుగుకు రూ.212 ప్రకారం చెల్లించి హోర్డింగ్స్ తీసివేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘ
సమావేశాలు వాయిదా
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కోరం (సభ్యులు) లేకపోవడం వల్ల విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం ( 4,5,6 ) శాఖలకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు.
మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల గైర్హాజరు
జిల్లా పరిషత్ పరిధిలోని ఏడవ స్థాయీ సంఘంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఒకటవ స్థాయీ సంఘంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఉన్నారు. మిగిలిన ఐదు స్థాయీ సంఘాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే బుధవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ప్రజా ప్రతినిధులతో పాటు మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.

ఆయకట్టులో పారింది కన్నీళ్లే!