
సాక్షి,కరీంనగర్:తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేనని, తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ అన్నారు. ఈ విషయమై బండి సంజయ్ ఆదివారం(డిసెంబర్ 15) మీడియాతో మాట్లాడారు.
‘పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు మళ్లీ అప్పగిస్తారనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు.హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి.ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా’అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.