రాజోళి: రాజోళి, పచ్చర్ల, వడ్డేపల్లి మండలంలోని కొంకలలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద శనివారం కొనుగోళ్లు జరిగినట్లు పీఏసీఎస్ సిబ్బంది తెలిపారు. మూడు కేంద్రాల వద్ద శనివారం 40 మంది రైతుల నుండి 4వేల బస్తాల జొన్నలను కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంకు తరలించారు.
వేరుశనగ క్వింటా రూ.6,667
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 378 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,667, కనిష్టం రూ.4,019, సరాసరి రూ.5,269 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5402, కనిష్టం రూ.5211, సరాసరి రూ.5368 ధరలు వచ్చాయి. 1474 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2401, కనిష్టం రూ.1707, సరాసరి ధర రూ.2111 ధరలు వచ్చాయి. 26 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ. 1746 పలికింది. 3 క్వింటాళ్ళ కంది రాగా, గరిష్టం రూ. 9666, కనిష్టం రూ. 8319, సరాసరి రూ.9666 ధరలు వచ్చాయి.
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటేత్తింది. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించడంతోపాటు, దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, చంద్రశేఖర్రావు, నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ సన్నిధిలో
కేంద్రమంత్రి
జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి లోగనాథన్ మురగన్ దర్శించుకున్నారు. వారికి ఆలయ పాలకమండలి చైర్మన్ చిన్నకృష్ణయ్య ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ చిన్నకృష్ణయ్య ఆలయాలను కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని అలాగే కేంద్ర పురాతత్వ శాఖ తరపున పలు అభివృద్ది పనులకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వీరితోపాటుగా బిజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి జలగిరి అశోక్, ఉపాధ్యక్షుడు మధసూదన్ గౌడు, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు.
సోనామసూరి ధర రూ.2,442
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,442, కనిష్టంగా రూ.1,900 ధరలు లభించాయి. హంస ధాన్యం సరాసరిగా రూ.1,909 ఒకే ధర పలికింది. మార్కెట్కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
అడవిని నరికితే
సహించం
కొల్లాపూర్ రూరల్: అడవిని నరికితే సహించమని డీఎఫ్ఓ రోహిత్ గోపిడి అన్నారు. శనివారం మండలంలోని నల్లమల అడవిలో ఉన్న పవర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏరియాలో నరికిన చెట్లను ఫారెస్ట్ రేంజర్ శరత్చంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ అడవిని నరికిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేంజర్ను ఆదేశించారు. అక్కడ కొత్తగా మొక్కలు నాటించి, పెంచాలని తెలిపారు.