మల్కన్గిరి: కలిమెల సమితి కంగుర్కొండ పంచాయతీ ఎం.వి 126 గ్రామంలో 8 అడుగుల కింగ్ కోబ్రా ఆదివారం హల్చల్ చేసింది. స్థానికులు వెంటనే కలిమెల అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వాడ్రాఫ్ బృందాన్ని తీసుకువచ్చారు. మూడు గంటలపాటు కష్టపడి అతికష్టం మీద పట్టుకున్నారు. సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ఎండకు ఇలా బయటకువస్తున్నాయని తెలిపారు
గూడ్స్ రైలు ఇంజిన్పై
బండరాళ్లు
జయపురం: విశాఖపట్నం – కిరండూల్ రైలు మార్గంలో ఆంధ్రప్రదేశ్లోని శివలింగపురం సమీపంలో బండరాయి కొండపై నుంచి గూడ్స్ ఇంజిన్పై బండరాళ్లు పడడంతో ఇంజిన్ పట్టాలు తప్పినట్లు సమాచారం. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విశాఖపట్నం– అరుకు, కొరాపుట్లకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేపట్టారు.
బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఆత్మహత్య
ఇచ్ఛాపురం: పట్టణంలో పెద్దాకుల వీధిలో లీలా బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సశ్మాల్ (43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం ఇంట్లో తలెత్తిన చిన్న గొడవ కారణంగా శ్రీదేవి మనస్థాపానికి గురైంది. బెడ్రూమ్లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు భర్త ప్రమోద్ సశ్మాల్, కుమారులు జోగేష్, ప్రిన్స్ ఉన్నారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
హిరమండలం: ఎన్నికలు సమీపిస్తున్న వేల బీఎల్ఓలు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఓటరు స్లిప్పులు లేకున్నా ఓటేసే అవకాశం ఉంది. ఎన్నికల రోజు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. వారి వద్దకు వెళ్లి ఓటరు స్లిప్పులు పొందవచ్చు. లేకపోతే ఓటరు జాబితాలో క్రమ సంఖ్య తెలుసుకుని పోలింగు ఏజెంట్లకు చెప్పి వారికి తానే సంబంధిత ఓటరని నిరూపించుకునే గుర్తింపు కార్డును చూపి ఓటేయచ్చు. లేదంటే పోలింగు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే జాబితాలను పరిశీలించి పేరు ,క్రమ సంఖ్యను కాగితంపై రాసుకుని వెళ్లవచ్చు. ఆ సమయంలో ఓటరు తగిన గుర్తింపు కార్డును తప్పకుండా వెంట తీసుకువెళ్లి పోలింగు కేంద్రంలో ఉండే అధికారులను చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.
7, 8 తేదీల్లోనూ పోస్టల్ ఓటు వేసే అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కొందరు ఎన్నికల సిబ్బంది 4, 5, 6 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే 7, 8వ తేదీల్లో ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామని పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్ఐ సత్యనారాయణ