నాగారం: లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డీపీఓ సురేష్కుమార్ సూచించారు. శనివారం నాగారం మండల కేంద్రంతో పాటు నాగారంబంగ్లా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాల ఏర్పాటును పరిశీలించి మాట్లాడారు. అనంతరం నాగారంబంగ్లా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ధార శ్రీనివాస్, కార్యదర్శులు శోభన్బాబు, చంద్రశేఖర్, జీపీ సిబ్బంది ఉన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం జరిపారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా ముస్తాబుచేసి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. కల్యాణతంతు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రవేశం గావించి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రే ఆలయానికి చేరుకున్న భక్తులు రాత్రి బసచేసి తెల్లవారుజాముననే శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు క్రిష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు : డీఎంహెచ్ఓ
సూర్యాపేట: ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తేనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు. వైద్యారోగ్య శాఖలో ప్రోగ్రాం అధికారిగా సేవలందించి పదవీ విరమణ పొందిన డాక్టర్ వాసిరెడ్డి సాహితీ దంపతులను శనివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ జయ, అంజయ్య, లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను
విజయవంతం చేయాలి
సూర్యాపేట: జూన్ 2, 3 తేదీల్లో సూర్యాపేటలో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు వివక్ష, అణచివేత, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చైతన్యం చేసేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట కోశాధికారి ఝాన్సీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.