
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం.
కుటుంబ పెద్ద జబ్బపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా ఇవాళ ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.