
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసు విచారణ (ట్రయల్ షెడ్యూల్) తేదీలను ఖరారు చేస్తూ స్థానిక 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కబర్ది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 నవంబరులో జరిగిన జంట హత్యల కేసులో చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, మొగిలి, హరిదాస్, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకటానంద్, కమలాకర్, రజనీకాంత్, నాగేంద్ర, శ్రీనివాసాచారి, బుల్లెట్ సురేష్ నిందితులుగా ఉన్నారు. వీరిలో వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్కు బెయిల్ రాలేదు. కేసు విచారణను వేగవంతం చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో చిత్తూరు కోర్టు చర్యలు చేపట్టింది. కేసులో మొత్తం 130 మంది సాక్షులుగా ఉన్నారు. వీరిలో 69 మందిని తొలుత విచారించనున్నారు. ఈ నెల 29 నుంచి ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు తొలి షెడ్యూల్ విచారణ జరగనుంది. మలి షెడ్యూల్ను ప్రకటించి విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించనున్నారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడంతో చింటూను పోలీసులు వైఎస్సార్ కడప జైలుకు తరలించారు.