
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 2019 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి స్పిల్ చానల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టును చూపించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తీసుకువచ్చిన రైతులు, విద్యార్థులతో సంభాషించారు. ఆ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్–2ను వెంటనే ఆమోదించి, పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఆనాడు పాండవులు న్యాయంగా ఐదు ఊళ్లు అడిగితే ఇవ్వలేదని.. అందువల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం మర్చిపోకూడదన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ‘సాక్షి’పై తన అక్కసు వెళ్లగక్కారు. కాగా సీఎం విజయవాడలోని ఆర్ అండ్ బీ నూతన భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ను సోమవారం ప్రారంభించారు.