Job Recruitment examination
-
సరిగ్గానే దిద్దుతున్నారా?
సాక్షి, ఎడ్యుకేషన్రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా? వాటిని సరిగానే దిద్దుతున్నారా?అంటే.. లేదనే సమాధానమే వస్తోంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదివి పరీక్ష రాస్తే, ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత, అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపర్చేలా ఇటీవల గ్రూప్–1 పరీక్షలో వచ్చిన ఫలితాలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ‘కీ’ పాయింట్లకే పరిమితమై...పోటీ పరీక్షల్లో లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుబాటులో ఉన్నవారితోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు నాలుగైదు ‘కీ’పాయింట్లు ఇస్తారు. అయితే, అభ్యర్థి అంతకంటే మంచి పాయింట్లతో సమాధానం రాసినా, ఫ్యాకల్టీ ఆ కీ పాయింట్ల అన్వేషణకే పరిమితమై తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతోపాటు వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ను ఒక్కరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతోంది అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్ట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా ఖాళీగా ఉండటమే సమస్యకు మూలకారణమని అభ్యర్థులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య నెలకొందని చెబుతున్నారు. ఇవీ కొన్ని సమస్యలు.. ⇒ గ్రూప్–1 మెయిన్స్లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్ను పరిగణనలోకి తీసుకుంటే.. పాలిటీ వరకు మాత్రమే అకడమిక్స్లో ఉంటుంది. మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు కీ షీట్పైనే ఆధారపడి మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాల ఉంటాయి. కానీ, డిగ్రీ స్థాయిలో కోర్ సైన్స్ సబ్జెక్టులే ఉంటాయి. కరెంట్ టాపిక్స్ ఉండవు. దీంతో ఎవాల్యుయేటర్స్ కరెంట్ టాపిక్స్పై అవగాహన లేకుండానే మూల్యాంకనం చేస్తున్నారు. ⇒ జనరల్ ఎస్సే పేపర్లో హిస్టరీ, కల్చర్, ఎకనమీ, పాలిటీ, కరెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిని మూల్యాంకన చేయాలంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ను నియమించాలి. కానీ.. అలా జరట్లేదని అభ్యర్థులు అంటున్నారు. ⇒ వేర్వేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్ వారీగా వేర్వేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4,330 ఉంటే.. 1,048 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ గత నెలలో దాదాపు 150 మంది పదవీ విరమణ చేశారని సమాచారం. తెలంగాణలో 2,825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ⇒ డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా దాదాపు 40 శాతం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గడమే కాకుండా.. పరీక్షల నిర్వహణలో ప్రొఫెసర్ల భాగస్వామ్యం లేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. అనువాదం కూడా సమస్యే పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నల అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లిష్లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ను నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీకి మక్కీ (ట్రూ ట్రాన్స్లేషన్) అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ను (శాసన ఉల్లంఘన ఉద్యమం) పౌర అవిధేయత ఉద్యమం అని అనువాదం చేస్తుండటంతో అదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమే కావటంలేదు. ప్రశ్న పత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి కనీసం ఏడెనిమిది మందిని భాగస్వాములను చేస్తే సమస్య పరిష్కారమవుతందని నిపుణులు చెబుతున్నారు. సమయాభావం పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో సమస్య సమయాభావం. అభ్యర్థులకు మొత్తం ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాల్లో సమయం సరిపోవడం లేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్న పత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో చదవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండానే సమాధానాలు గుర్తించాల్సి వస్తోంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లోని సీశాట్లో 80 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తారు. మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ చేయాలా? గ్రూప్–1 మెయిన్స్ ప్రశ్న పత్రం రూపకల్పన, మూల్యాంకన సమస్యల నేపథ్యంలో మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్న పత్రం రూపొందించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి గ్రూప్–1లో కచ్చితంగా ఇద్దరు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. మొదటి, రెండో మూల్యాంకనాల్లో మార్కుల మధ్య 5 శాతం వ్యత్యాసం ఉంటే మూడో వ్యక్తితో మూల్యాంకనం చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీలో ఇదే విధానం అమలవుతోంది. రెండు, మూడు సబ్జెక్టుల సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో.. సెక్షన్ వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నపత్రం అనువాదం ఉండాలి. – ప్రొఫెసర్. వై.వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యుడు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ యూపీఎస్సీ తరహాలో చేయాలిగ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా మెయిన్స్కు 1:13 (ఒక్కో పోస్టుకు 13 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ప్రొఫెసర్లను ఎంపికచేస్తారు. వేర్వేరు సబ్జెక్టులు ఉండే పేపర్ల మూల్యాంకనానికి సెక్షన్ వారీగా వేర్వేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ.. సమాధానంలో అదనపు సమాచారం ఉంటే.. వాటికీ మార్కులు ఇస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఈ విధానం లేదు. -
సెప్టెంబర్లో ఉమ్మడి అర్హత పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
ఏ పరీక్ష రాయాలి దేవుడా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఏళ్లతరబడి చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు పరీక్షలు ఒకే రోజే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల హడావిడే కారణం.. ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో పరీక్షలు.. జనవరి 6న నాకు హైదరాబాద్లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్, అదే రోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉన్నాయి. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో ఎలా పరీక్ష రాయాలో అర్థం కావటం లేదు. ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలి. – చిప్పల వెంకటేశ్వరరావు, అభ్యర్థి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా రెండు వారాలు వాయిదా వేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కానిస్టేబుల్ పరీక్షను రెండు వారాల పాట వాయిదా వేయాలి, అదే విధంగా జనవరి 6న డీఎస్సీ పీఈటీ దేహదారుఢ్య పరీక్షకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల కోణంలో కాకుండా నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు -
టీఎస్పీఎస్సీ ‘తొలి పరీక్ష’ సక్సెస్
931 ఏఈఈ పోస్టులకు ఆన్లైన్ పరీక్ష * దేశంలోనే తొలిసారి విజయవంతంగా నిర్వహణ * 24,383 మంది హాజరు.. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష * నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ.. 24న తుది కీ సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి: దేశంలోనే తొలిసారిగా ఆన్లైన్లో ఉద్యోగ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలోని 99 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) ప్రశాంతంగా ముగిసింది. ఈ విధానంలో మొదటి ప్రయత్నంలోనే వేలాది అభ్యర్థులకు విజయవంతంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా టీఎస్పీఎస్సీ చరిత్ర సృష్టిం చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 24,383 మంది పరీక్ష రాశారు. యూపీఎస్సీతో పాటు దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్లూ ఇం త భారీ సంఖ్యలో అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించిన దాఖలా లు లేవు! రంగారెడ్డి జిల్లాలో ఒక పరీక్ష కేం ద్రంలో స్వల్ప సాంకేతిక సమస్య మినహా అంతా సజావుగా జరిగినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ 136 మందిని ఇతర కేంద్రాలకు తరలించి, అదనపు సమయం ఇచ్చారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాం డ్ సెంటర్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు, అధికారులు పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సహాయక సిబ్బంది, 250 మంది కమిషన్ పరిశీలకులు పరీక్షల విధుల్లో పాలుపంచుకున్నారు. పరీక్షా కేంద్రాలపై నిఘా కోసం 29 ప్రత్యేక బృందాలను కూడా టీఎస్పీఎస్సీ నియమించింది. మూడంచెల పాస్వర్డ్లు: ఆన్లైన్ పరీక్ష నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మూడంచెల పాస్వర్డ్ల విధానాన్ని అవలంబించింది. ఉదయం 7.30 గంటలకు తొలి పాస్వర్డ్ (బండిల్ పాస్వర్డ్), 9 గంటలకు రెండో పాస్వర్డ్ (డ్రైవ్ పాస్వర్డ్), 9.50 గంటలకు మూడో పాస్వర్డ్ (క్యాండిడేట్ పాస్వర్డ్)లను పరీక్ష కేంద్రాలకు విడుదల చేసింది. ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 2.30 వరకు పరీక్ష జరిగింది. నేడు సమాధాన పత్రాలు, ప్రాథమిక కీ ఇప్పటికే చాలా పరీక్ష కేంద్రాల నుంచి టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల సమాధాన పత్రాలు, ఆడిట్ ట్రయల్స్ చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులకు వారి సమాధాన పత్రాలతో పాటు ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ పంపించనుంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు రెండు రోజుల్లో తెలపవచ్చు. 24న తుది కీ విడుదలవుతుంది. మొరాయించిన కంప్యూటర్లు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్లు మొరాయించడంతో 136 మంది అభ్యర్థులను అనుమతించలేదు. 2 గంటలు గేటు బయటే ఉండాల్సి రావడంతో వారు ఆందోళనకు దిగారు. వారిని ఇతర కేంద్రాలకు తరలించారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభ ద్రయ్య నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు, పరీక్షలో పలుమార్లు సిస్టమ్ లాకవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. మౌస్ను నాన్స్టాప్గా కదిలించాల్సి వచ్చిందని, లేదంటే సిస్టం లాకయిందని అభ్యర్థులు వాపోయారు.