
సత్యదేవుని వ్రతమాచరిస్తున్న నవ దంపతులు, భక్తులు
అన్నవరం: శ్రావణ మాసం వచ్చింది. శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముడుల బంధంతో.. ఏడడుగులు వేసి 300 జంటలు ఒక్కటయ్యాయి. దీంతో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా మారింది.
గతేడాది కరోనా విజృంభణ తరువాత ఇంత భారీగా వివాహాలు జరగడం ఇదే తొలిసారి. దేవస్థానంలోని సత్యగిరిపై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపంలోని 12 వివాహ వేదికల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది. వివాహాలు చేసుకున్న వారికి కల్యాణ మండపంతో పాటు అవసరమైన సామగ్రిని దాత మట్టే శ్రీనివాస్ ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహూకరించారు.