
సాక్షి, అమరావతి: గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. తద్వారా గ్రామాల్లో ఆస్తిని సమకూర్చనుంది. ఇందుకోసం రూ.3,825.15 కోట్లను వెచ్చిస్తోంది.
గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతులకు ఒక్క గ్రామ సచివాలయాలపైనే ఇంత మొత్తంలో వ్యయం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు భవన నిర్మాణాలతో గ్రామాలకు కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది.
ముమ్మరంగా పనులు
గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తాం. బిల్లులు చెల్లించక ఎక్కడా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఆగిపోలేదు. ప్రతి వారం వీటి పురోగతిని సమీక్షిస్తున్నాం.
– గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్