
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం శివారు సమ్మక్క గద్దెల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి తెల్లూరి ప్రసాద్, రవీందర్, బాబా ఫకృద్దీన్, జోయెల్ కారులో పాల్వంచకు బయలుదేరారు. సమ్మక్క గద్దెల వద్ద ఎదురుగా వచ్చిన లారీ నేరుగా కారును ఢీకొట్టడంతో కారులోని నలుగురు గాయపడగా.. వారిని 108 ద్వారా ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తెల్లూరి ప్రసాద్, రవీందర్కు తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫార్సు చేశారు. బాబా ఫకృద్దీన్, జోయెల్ చేతి భాగంలో గాయాలయ్యాయి.
గడ్డివామి దగ్ధం
టేకులపల్లి: మంటలు చెలరేగి గడ్డివామి దగ్ధమైన ఘటన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తతండా(జీ)కు చెందిన రైతు బానోత్ కిషన్ తన పశువుల కోసం సుమారు 250 కట్టల గడ్డివామి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివామిపై నిప్పులు పడటంతో మంటలు చెలరేగి వామి మొత్తం కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సుమారు రూ.25 వేలు నష్టం వాటిల్లిందని కిషన్ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం
అశ్వారావుపేటరూరల్: గాలి దుమారంతో ఓ ఇంట్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఇళ్లు కాలిపోయిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలకోని దురదపాడు జీపీ పాలగుంపు గ్రామానికి చెందిన నల్లబెల్లి స్వప్న పూరింట్లో గాలి దుమారంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో అదే గ్రామానికి చెందిన మడకం రాము, కొర్సా భద్రమ్మ, గీగా బాబూరావుకు చెంది పూరిళ్లకు మంటలు అంటుకొని పూర్తిగా ఆహుతయ్యాయి. ఆయా ఇళ్లలో ఉన్న ధాన్యం బస్తాలు, జీడిగింజలతోపాటు బియ్యం బస్తాలతోపాటు ఇతర సామగ్రి కాలిపోయయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు బాధితులు వాపోతున్నారు. కాగా, ఘటన జరిగిన గ్రామానికి అగ్ని మాపక వాహనం ఆలస్యంగా చేరుకుందని, దీంతో తీరని నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.
లోన్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేసు
పాల్వంచ: ప్రైవేట్ బ్యాంక్లో లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన భాషబోయిన అశోక్కుమార్కు వద్దని చెప్పినా వినకుండా తిప్పరపు విజయ్ అనే వ్యక్తి రూ.20 లక్షల లోన్ ఇప్పిస్తానని ఒప్పించాడు. 20 రోజుల్లో వస్తుందని, ముందస్తు రూ.3,19 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అశోక్కుమార్ డబ్బులను గత డిసెంబర్లో ఇచ్చాడు. అయినప్పటికీ లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సుమన్ అజయ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు