
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
● కలెక్టర్ రాహుల్శర్మ
కాటారం/మల్హర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం, మల్హర్ మండలం కొయ్యూరులో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.