
హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆగహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ప్రకటనలు ఆపివేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక సీఎస్ కు లేఖ రాసింది.
తెలంగాణలో ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీఐ ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఎన్నికల ముందు ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై ఎలక్షన్ కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా యాడ్లు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఈసీ ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌటింగ్ జరగనుంది. కాగా.. రేపటితో పార్టీల ప్రచారాలకు తెర పడనుంది.
ఇదీ చదవండి: పారిపోయే చాన్స్ చాలా తక్కువ