
Photo Courtesy: BCCI
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్గా కొనసాగనున్నాడు.
సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది.
మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్కు కూడా పిలిపించుకుంది.
మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.
కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు.
7 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్గా ముద్ర వేసుకున్నాడు.