PBKS VS RCB: రోహిత్‌ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి | IPL 2025 PBKS Vs RCB: Virat Kohli Equals Rohit Sharma For Most Player Of The Match Awards By An Indian In IPL | Sakshi
Sakshi News home page

PBKS VS RCB: రోహిత్‌ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి

Published Sun, Apr 20 2025 9:02 PM | Last Updated on Mon, Apr 21 2025 3:21 PM

IPL 2025, PBKS VS RCB: Virat Kohli Equals Rohit Sharma For Most Player Of The Match Awards By An Indian In IPL

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఛేదనలో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. ఓవరాల్‌గా 19వది.

ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో విరాట్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్‌ కూడా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్‌, రోహిత్‌ ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్‌లో 25 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్‌ గేల్‌ (22) పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్‌, రోహిత్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్‌-5)
19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)
19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)
18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)
16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)
16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)

ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో విరాట్‌ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్‌ వార్నర్‌ పేరిట ఉంది. వార్నర్‌ 66 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన టాప్‌-5 బ్యాటర్స్‌..
విరాట్‌- 67 (59 హాఫ్‌ సెంచరీలు, 8 సెంచరీలు)
వార్నర్‌- 66 (62, 4)
శిఖర్‌ ధవన్‌- 53 (51, 2)
రోహిత్‌ శర్మ- 45 (43, 2)
కేఎల్‌ రాహుల్‌- 43 (39, 4)
ఏబీ డివిలియర్స్‌- 43 (40, 3)

ఐపీఎల్‌లో విరాట్‌ పేరిట ఉన్న రికార్డు..
అత్యధిక పరుగులు
అత్యధిక శతకాలు
అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు
అత్యధిక బౌండరీలు

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుం​జుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో  కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేశారు.పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్‌ ఆర్య 22, శ్రేయస్‌ అ‍య్యర్‌ 6, జోస్‌ ఇంగ్లిస్‌ 29, నేహల్‌ వధేరా 5, స్టోయినిస్‌ 1, శశాంక్‌ సింగ్‌ 31 (నాటౌట్‌), జన్సెన్‌ 25 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్‌ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. 

జితేశ్‌ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌) సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (1), రజత్‌ పాటిదార్‌ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement