
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో నవీన్ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గతేడాది మే 25న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్రెడ్డి వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. తప్పుడు అభియోగాలతో ఫిర్యాదు చేశారని, ఆరోపణలకు ఆధారాల్లేవన్నారు.