
రథోత్సవం ప్రారంభం
వరంగల్ : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్ద రథోత్సవం ప్రారంభమైంది. స్థానిక పురవీధుల్లో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, గోపాల నవీన్రాజ్, చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రథయాత్ర కొంత ఆలస్యంగా కరెంటు వైర్లు తీయడం మళ్లీ బిగించడంతో లేట్ అవుతుందని సోమవారం మధ్యాహ్నం వరకు దుర్గేశ్వర ఆలయం చేరుకుంటుందని తెలిపారు. సత్యనారాయణ, మీసాల ప్రకాశ్, జాతి రమేశ్, శ్రీనివాస్, బండి శంకర్, మహేష్, రాజు, శంకర్, పాల్గొన్నారు.
సేంద్రియ ఆహారం
తీసుకోవాలి
హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్ఫుడ్కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పధార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పులు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత పాల్గొన్నారు.
హామీలన్నీ నెరవేరుస్తాం..
నడికూడ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని అంచలవారీగా అమలు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వరికోల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, పేదల సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలో రేషన్ ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రథోత్సవం ప్రారంభం