Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Trump administration announced new tariff on Chinese imports1
చైనా నడ్డి విరిసేలా అమెరికా కొత్త సుంకాలు

చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్‌ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్‌ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్‌ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్‌టైల్‌ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.

Supreme Court Key Comments Over HCU Lands And Telangana Govt2
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.

YSRCP Gudivada Amarnath Serious Comments On CBN Govt3
వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి: అమర్నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమి సర్కార్‌ కుట్రలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం విగిపోతుందని చెప్పారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు విప్ జారీచేస్తున్నాము. 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తాము. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకు ఉంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి.మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ..‘మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్.. నాకు మేయర్‌గా వకాశం కల్పించారు. బీసీ జనరల్ అయిన సరే యాదవ మహిళకు మేయర్‌గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్‌ జగన్ పెద్దపీట వేశారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంతవరకు సమంజసం. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించలేదా?. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మేయర్‌పై అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం విగిపోయేందుకు కావల్సినంత బలం మాకు ఉంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 58 మందికి విప్ జారీచేస్తున్నాము’ అని తెలిపారు.

National Herald Case BJP Slams Gandhi Family Congress Counter4
National Herald: సోనియా, రాహుల్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్‌ కౌంటర్‌

ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్‌ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్ ప్రసాద్.నేషనల్‌ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్‌ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్‌ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్‌ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌’ (ఏజేఎల్‌)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.మరోవైపు.. రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పవన్‌ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

Zaheer Khan Sagarika Ghatge Blessed with baby boy Reveals Name Pic Viral5
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్‌ ఖాన్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్‌ దంపతులు బుధవారం సోషల్‌ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్‌ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేయగా.. జహీర్‌- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, కేఎల్‌ రాహుల్‌ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్‌ సింబల్‌తో విషెస్‌ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్‌ ఖాన్‌.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్‌ ఖాన్‌.. లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్‌లో కొనసాగిన జహీర్‌ ఖాన్‌.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్‌ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి

Police Denies Permission to Devi Sri Prasad Musical Night in Vizag6
దేవి శ్రీప్రసాద్‌కు ఎదురుదెబ్బ.. మ్యూజికల్‌ నైట్‌ లేనట్లే!

సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ‍ప్రసాద్‌ విశాఖపట్నంలో నిర్వహించబోయే మ్యూజికల్‌ నైట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఏప్రిల్‌ 19న విశ్వనాథ స్పోర్ట్స్‌ క్లబ్‌లో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ లైవ్‌ షో కోసం ఆన్‌లైన్‌లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్‌.. తన సంగీత కచేరిని వాయిదా వేస్తాడా? లేదా వేరే ప్రదేశానికి షిఫ్ట్‌ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by ACTC Events (@actc_events) చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్‌ తీసుకుందని ట్రోలింగ్‌..

KSR Comments On Chandrababu P-4 Concpet7
అపరాధ భావం.. అతకని కథలతో బాబు కాలక్షేపం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో వింత ప్రకటన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా.. మిగిలిన అన్ని విషయాలపై అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన డాక్టర్‌ అవుతున్నాడు.. మాస్టర్‌ అవతారం ఎత్తుతున్నాడు.. రోజూ ఏదో ఒక విషయం ఎత్తుకోవడం.. దానిపై మీడియాతోనో లేకపోతే ఇంకొకరితోనో.. గంటల తరబడి మాట్లాడటం! ఇదీ తంతు! ఈ ధోరణి గతంలోనూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అది మితి మీరిపోతోంది.హామీలు అమలు చేయలేక ప్రజల్లో పలచన అవుతున్నాన్న అపరాధ భావమో.. ఇతరాంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టి తప్పించాలనో ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఈ క్రమంలో ఆయన సమతుల్యత తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం..‘పీ-4 కార్యక్రమంలో ఎంత మంది మంత్రులు పాల్గొంటున్నారు? ఎన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు’ అని ఈమధ్య ఓ విలేకరి చంద్రబాబును ప్రశ్నించారు. అంతే ఆయనకు ఉన్నట్టుండి కోపం ముంచుకొచ్చింది. ‘కుక్క కరిస్తే, పిల్లి అరిస్తే సీఎం ఏం చేస్తాడు? విలేకరిగా నీకు బాధ్యత లేదా? సచివాలయంలో కూర్చున్నావంటే సొసైటీ నీకు ఆ స్థాయిని కల్పించిందని మర్చిపోవద్దు. మంత్రులను అడుగుతున్నావు.. ప్రెస్‌లో ఎంతమంది దత్తత తీసుకున్నారు? అన్నీ నేనే చూడాలన్న ఆలోచన ధోరణి మారాలి’ అంటూ చిర్రుబుర్రులాడారు.విలేకరి అడిగిన ప్రశ్నకు ఈయన గారి సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడాన్ని కాసేపు పక్కనబెడదాం. వాస్తవానికి తాను అనుకుంటున్న పీ-4 కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఇదో మంచి అవకాశం. మంత్రులు, తన పార్టీ నేతలను ఆ విధమైన సేవాభావం వైపు మళ్లించేందుకు ఓ సందేశం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఆ ప్రశ్న వేసిన విలేకరినే మందలించడం ఆయన పరిస్థితిని తెలియజేస్తోంది! పైగా ఇలా అసందర్భంగా మాట్లాడితే సీఎం స్థాయి నేత బ్యాలెన్స్‌ కోల్పోయినట్లు అనుకోరా?. చివరికి ప్రెస్ వారు దత్తత తీసుకోవాలని చెబుతున్నారంటేనే ఆ పీ-4 కార్యక్రమంలో చక్కదనం ఏంటో అర్థమవుతుంది.చంద్రబాబు గతంలో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసేవారు. కాకపోతే ఈసారి అవి శృతి మించాయనిపిస్తుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మీడియా అంతా అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడుతుండాలి. అబద్దాలు పోగు చేసి రాయాలి. లేకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నారని ఆయనే మీడియా సమావేశాలలో వ్యాఖ్యానిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి అయితే మాత్రం అంతా అదరహో అని ఊదరగొట్టాలి. టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇదే పనిలో ఉంటాయి. అయినా ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చేస్తుందన్న మాట. ఇంకో విషయం చూద్దాం.ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఫీజుల చెల్లింపును డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది. దాని గురించి మీడియాలో కథనాలు వస్తే చంద్రబాబు ఆ అంశంపై మాట్లాడకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రులు అంటూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారట. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డు, అన్ని మండలాలలో జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీల అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చి.. ఆ తరువాత కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన ‘ఇంటింటికి డాక్టర్’ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ, జగన్‌కు పేరు వస్తుందన్న భయంతో ఆ పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సరైన వైద్యమే అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలకు ప్రతిగా ఆయన చెబుతున్నది ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలోను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారట. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేట్‌ పద్ధతిలో.. ఈ రకమైన ఆసుపత్రులకు నష్టాలొస్తే ప్రభుత్వం పదేళ్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తుందట. ఆరోగ్యశ్రీ రోగుల్లో యాభై శాతం మందికి ఇక్కడకు పంపిస్తారట. హాస్పిటల్ లేని నియోజకవర్గాలలో వంద నుంచి 300 పడకలతో ఈ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తారట. ఎక్కడో ఒకటి, అర తప్ప, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి?. ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడేను? అదేమని అడిగితే.. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటు చేస్తామంటారు. అది ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు. పది వ్యాధులకు ఒకరు చొప్పున డాక్టర్లను సలహాదారులుగా నియమిస్తారట. ఇదేమిటో తెలియదు.ఇంకోపక్క.. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయని వాటికి ఆక్సిజన్ ఇవ్వాలని, కాని డబ్బులు లేవంటున్నారని చంద్రబాబే చెబుతారు. మరి ఆయన చెప్పేవాటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అమరావతిలో ఖర్చు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల, మధ్య తరగతి వారి ఆరోగ్యం కన్నా, భారీ భవంతులు కట్టడం ప్రయోజనకరమని ఆయన భావిస్తున్నారా? ఇలా అడిగితే ఆయన ఊరుకోరు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, వ్యాధులు అంటూ ఆయనే ప్రజెంటేషన్ ఇస్తారు. విరుగుడు మాత్రం ప్రైవేటు మంత్రం అని పరోక్షంగా చెబుతూంటారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదలుకుంటారు. జగన్ తెచ్చిన వైద్య కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగిస్తారట.చంద్రబాబు మరో సలహా ఇచ్చారు. ప్రజలు ఏమేమి తినాలో ఆయన చెబుతున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదని, వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, జీవన శైలి మార్చుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. జంక్ ఫుడ్స్ వదలిపెట్టి, మిల్లెట్స్ వాడాలని సూచిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 600 గ్రాముల ఉప్పు, రెండు లీటర్ల నూనె, మూడు కిలోల పంచదారే వాడాలని అన్నారు. ఏదో పెద్ద తరహాలో చెబితే అదో రకం. కాని ఆయన మద్యం తాగమని చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారే! తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చామని గొప్పగా అసెంబ్లీలో చెప్పారే. మరి ఆ మద్యం బాటిళ్లపై హానికరం అని ఉంటుంది కదా! ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందన్న సంగతి అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడిన సీఎంకు మద్యం తీసుకుంటే లివర్ పాడవుతుందని తెలియదా?. ఇక్కడే చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.యధా ప్రకారం జీఎస్డీపీ అంటూ కాకి లెక్కలు చెప్పి, జగన్ టైమ్‌లో అలా జరిగింది.. ఇలా జరిగిందని చెప్పి మభ్య పెడితే ప్రజలకు ఒరిగేదేమిటి? కొసమెరుపు ఏమిటంటే మీరు చెబుతున్నవాటిన్నటికి డబ్బు కావాలి కదా? ఎక్కడ నుంచి వస్తాయని అడిగితే, చాలా విషయాలలో డబ్బు కంటే సంకల్పం, పాజిటివ్ దృక్పథం ముఖ్యమని సెలవిచ్చారు. అంటే గాలిలో మేడలు కడుతున్నట్టు అనిపించదా?. కాకపోతే చంద్రబాబు ఉపన్యాసాలు ఈనాడు వంటి టీడీపీ మీడియా ‘ఆరోగ్య భాగ్యం’ అంటూ శీర్షికలు పెట్టి బాజా వాయించడానికి మాత్రం బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Mirchi Farmers Protest AT guntur8
గుంటూరు మిర్చి యార్డ్‌ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్‌!

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్‌ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Japanese Envoy Keiichi Ono Tries Bihars Litti Chokha9
భారతీయ ఫేమస్‌ వంటకాన్ని మెచ్చిన జపాన్‌‌ రాయబారి..!

మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్‌. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్‌ రాయబారి కైచి ఓనో బిహార్‌ పేమస్‌ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్‌, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్‌ రాయబారి కైచి ఓ రెస్టారెంట్‌లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్‌లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్‌, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.."నమస్తే బిహార్‌..చివరికి బిహార్‌ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్‌ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్‌ బేక్డ్‌ హోల్‌ వీట్‌ బాల్స్‌ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్‌ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్‌ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)

 Tamil Nadu CM MK Stalin Set up High-level committy10
స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్..

ఈ మధ్య కాలంలో, కేంద్ర విధానాలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కాకను పెంచుతోంది. కేంద్రంతో, దక్షిణాది రాష్ట్రాలు తగవు పెట్టుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈమధ్య తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాల అధినేతల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అసంతుష్ట సీఎంల జాబితాలో.. తమిళనాడు ప్రభుత్వాధినేత ఎంకే స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైఖరికి నిరసనగా స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. తొలుత, త్రిభాషా విధానంపై.. తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలనూ.. తన దారిలోకి తెచ్చుకున్నారు. ముందు నుంచీ హిందీ వ్యతిరేక విధానాన్ని ఒంట పట్టించుకున్న తమిళ ప్రజలకు, తాము ఎక్కడ దూరమవుతామోనని, అక్కడి అన్ని పార్టీలూ, త్రిభాషా విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇదే ఊపులో.. స్టాలిన్, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలన్న అంశంపై, దక్షిణాదిలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే చెన్నైలో ఎన్డీయేతర పక్షాలతో భేటీని కూడా నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక పార్టీలన్నీ స్టాలిన్‌ ఆందోళనతో ఏకీభవించాయి. కేంద్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలని తీర్మానించాయి.తొలి తమిళ సీఎంలు.. కీలక కమిషన్లు..ఎన్డీయేతర పక్షాల భేటీ తర్వాత, మలి అడుగుగా, ఇప్పుడు, స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను తాజాగా నిర్వచించేందుకు, ఈ బంధాలు మెరుగయ్యే అవకాశాలపై అధ్యయనం కోసం ఏకంగా ఓ న్యాయ కమిషన్‌నే నియమించాలని నిర్ణయించారు. తగిన సిఫారసుల కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. మంగళవారం (15-04-2025) నాడు తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని సర్కారు ఇలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్‌లను నియమించడం ఇదే తొలిసారి కాదు. 1969 ఫిబ్రవరిలో.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఎం.కరుణానిధి, ఎనిమిది నెలల్లోనే ఇదే అంశంపై, రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా.. తొలిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్, తండ్రి చూపిన బాటలోనే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తానూ కమిషన్‌ను నియమించడం విశేషం.రాష్ట్రాలు నియమించే కమిషన్ల వల్ల ప్రయోజనముందా?కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతపై కమిషన్ల ఏర్పాటు అంశం కొత్తదేమీ కాదు. 1969లో డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వేసిన జస్టిస్ రాజమన్నార్ కమిషన్‌తో మొదలు పెడితే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1983లో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్, అనంతరం, 2007లో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ వేసిన కమిషన్‌లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సునిశితంగా అధ్యయనం చేసి సిఫారసులను చేశాయి.జస్టిస్ రాజమన్నార్ కమిటీ, జస్టిస్ సర్కారియా కమిటీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతకు.. ప్రధాని నేతృత్వంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించాయి. జస్టిస్ పూంచీ కమిటీ కూడా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ అంశంలో.. ప్రణాళిక, ఆర్థిక సంఘాల మధ్య సమన్వయానికి ఓ నిపుణుల కమిటీ ఉండాలని సూచించింది. రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలే కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల సిఫారసులూ బుట్టదాఖలు కావడం శోచనీయం. ఇప్పుడు తాజాగా స్టాలిన్ నియమించే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ చేసే సిఫారసులను, ఎటూ కేంద్రానికే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది.. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.మరి స్టాలిన్ దూకుడు ఎందుకు?తమిళనాడు అసెంబ్లీకి ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో, స్టాలిన్ తన పాలనతో రాష్ట్రంపై విశిష్ట ముద్రనేదీ వేయలేదన్న భావన ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే, కచ్చితంగా, స్థానికుల సెంటిమెంట్‌ని రగిలించడమే సరైనదని స్టాలిన్ భావిస్తున్నారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీట్ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఇటీవలే త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు.. వాటిని వ్యతిరేకించడంలో స్టాలిన్ ముందు వరుసలోనే నిలిచారు. ఇప్పుడు, దక్షిణాది విశాల ప్రయోజనాల పేరిట, డీలిమిటేషన్‌ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా మలచుకుని, స్టాలిన్, తమిళుల హృదయాల్లో.. తనను తాను, జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్స్‌పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రంపై పోరు, దాని వెనుక మర్మం ఏమైనా, స్టాలిన్ తాజా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. - పి.విజయ్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement